కరోనా వైరస్తో ఇండియాకు లాభం కూడా ఉంటుందా?
ప్రతి సంక్షోభం లోనూ ఒక అవకాశం ఉంటుందని చెబుతారు. ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఒక పెద్ద సంక్షోభంలో పడిపోయింది. చైనా లో పుట్టున మాయదారి కరోనా వైరస్ తో ప్రమాదం ముంచుకొచ్చింది. ఈ దెబ్బకు తొలుత చైనా మొత్తం అతలాకుతం ఐంది. అక్కడ కరోనా వైరస్ సోకి సుమారు 3,200 మంది ప్రజలు చనిపోయారు. మరో 80,000 మందికి పైగా ఈ భయంకరమైన వ్యాధి సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కరోనా ప్రభావంతో చైనా లాక్ డౌన్ ప్రకటించటంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ 1% నుంచి 1.5% వరకు దెబ్బతింది. అయితే, ఇప్పుడిప్పుడే చైనా కోలుకుంటోంది. కరోనా మొదలైన వుహాన్ నగరం, హుబెయి ప్రావిన్స్ లో కూడా పరిస్థితి అదుపులోకి వచ్చింది.
మళ్ళీ ఫ్యాక్టరీలు తెరుచుకుంటున్నాయి. ప్రజలు తమ తమ పనులకు హాజరవుతున్నారు. కానీ, ప్రస్తుతం ప్రపంచమంతా వ్యాధి సోకి బాధపడుతోంది. నేను పుట్టాను... ఈ లోకం నవ్వింది. నేను నవ్వాను... ఈ లోకం ఏడ్చింది. నాకింకా ఈ లోకంతో పని ఏముంది? అనే ఒకప్పటి పాపులర్ సాంగ్ లాగా తయారైంది ప్రస్తుత పరిస్థితి. చైనా లో వైరస్ వచ్చినప్పుడు ప్రపంచం సీరియస్ గా తీసుకోలేదు. ఆ వారేదో అడ్డమైన తిండి తిని ప్రాణాలమీదికి తెచ్చుకున్నారు అని నవ్వుకున్నారు. కానీ, ఇప్పుడు అదే ప్రాణాంతక వైరస్ తమ గడపనూ తట్టడంతో ఎం చేయాలో పాలుపోని పరిస్థితి.
ఉద్యోగాల కోత వద్దు, శాలరీ కట్ చేయవద్దు, అమెరికాలో లక్షల జాబ్ కట్స్
ప్రపంచానికి ఆదర్శంగా భారత్...
కరోనా వైరస్ ప్రభావం భారత్ కు కూడా విస్తరించినప్పటికీ.. దానిని ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఏప్రిల్ 14 వరకు దేశమంతా లాక్ డౌన్ ప్రకటించి ప్రజలు ఎవరూ కూడా ఇండ్ల నుంచి బయటకు రావొద్దని ఆదేశాలు జారీ చేశారు. దీంతో ప్రపంచానికే ఇండియా ఆదర్శవంతంగా నిలిచింది. అత్యవసర సేవలు మినహా దేనికి కూడా ప్రజలు రోడ్లపైకి వచ్చే పరిస్థితి లేదు. గత 100 ఏళ్లలో ఎప్పుడు కూడా మన దేశం ఇలాంటి పరిస్థితిని చూసింది లేదు. పూర్తిగా ఇండ్లకే పరిమితం కావటం చాలా కష్టమైన పనే అయినప్పటికీ... ప్రజల ప్రాణాల రక్షణ కోసం దేశం, రాష్ట్ర ప్రభుత్వాలు చాలా బాధ్యతాయుతమైన నిర్ణయం తీసుకున్నాయి. అన్ని రకాల ప్రజా రవాణా వ్యవస్థలను పూర్తిగా రద్దు చేసి, ఒక్కరు కూడా విదేశాల నుంచి ఇక్కడికి రాకుండా... ఇక్కడినుంచి విదేశాలకు పోకుండా అడ్డుకోగలిగారు. ఈ వ్యాధి కేవలం విదేశాల నుంచి వచ్చిన వారికే సోకింది కాబట్టి, వారితో ఇతర ప్రజలు కలవకుండా చూడగలిగితే వైరస్ వ్యాప్తిని అడ్డుకోవచ్చని ప్రభుత్వం భావించి లాక్ డౌన్ ప్రకటించింది. ఈ నిర్ణయం వచ్చే 10 రోజుల్లో ఆశించిన ఫలితాలను ఇవ్వనుందని భావిస్తున్నారు.
భవిష్యత్లో పెరగనున్న పెట్టుబడులు...
ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వేనోళ్ళ పొగుడుతున్నారు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్లుగా భారత్ వైరస్ వ్యాప్తి చెందకుండా పకడ్బందీ చర్యలు తీసుకుంది. ఈ పరిస్థితులను ప్రపంచం మొత్తం నిశితంగా గమనిస్తోంది. భారత్ లో తీసుకునే ఏ నిర్ణయమైనా పారదర్శకంగా నిలుస్తోంది. ఇక్కడ నాయకత్వం పై ప్రజల్లో పూర్తి విశ్వాసం ఉండటం కూడా ప్రస్తుత సంఘటన నిరూపించింది. దేశ ప్రధాని ఒక్క ప్రకటన చేస్తే 130 కోట్ల మంది ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండటం ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఎంతో అభివృద్ధి చెందిన దేశాలకు సాధ్యం కాని ఈ పనిని ఇండియా చేసి చూపుతుండటంతో అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ముఖ్యంగా గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ పరిస్థితులను జాగ్రత్తగా గమనిస్తున్నారని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఏ దేశంలో ఐతే పారదర్శక నిర్ణయాలు, నిలకడైన పాలన ఉంటుందో ఆ దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ఆసక్తి చూపుతారు. ఇదే మన దేశానికి వచ్చే ఏడాది లో భారీ స్థాయిలో పెట్టుబడులను తెచ్చిపెట్టగలది ఆశిస్తున్నారు.
చైనా లో అంతా సీక్రెట్...
కమ్యూనిస్ట్ దేశమైన చైనా లో ఏం జరుగుతుందో ఎవరికీ పూర్తిగా తెలియదు. ఆ దేశ అధికారిక మీడియా చెప్పిందే ఇతర ప్రపంచానికి తెలుస్తుంది. కరోనా వైరస్ ప్రబలిన సందర్భంలో కూడా చైనా ప్రపంచానికి పెద్దగా సమాచారం ఇచ్చింది లేదు. అందుకే, ఆ దేశంపై ఇన్వెస్టర్లకు నమ్మకం సన్నగిల్లుతోందని కొందరు ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అమెరికా తో నెలకొన్న ట్రేడ్ వార్ తో చైనా బాగా దెబ్బతింది. అమెరికా కు చెందిన చాలా కంపెనీలు చైనా లోని తమ ఫ్యాక్టరీ లను మూసివేసి వేరే ఇతర దేశాలకు తరలి వెళ్లాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెగేసి చెప్పారు. దీంతో ఆయా కంపెనీలు ఇప్పటికే ఆసియా లోని ఇతర దేశాలు ఐన వియాత్నం, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్ వంటి దేశాలకు వెళుతున్నాయి. కానీ, ఇకపై చాలా వరకు కంపెనీలు భారత్ వైపు చూస్తాయని నిపుణులు చెబుతున్నారు. కరోనా వైరస్ ను జయిస్తే గనుక భారత్ కు ఇక తిరుగు ఉండదని వారు అభిప్రాయపడుతున్నారు. కరోనా ప్రభావంతో తాత్కాలికంగా ఒక ఏడాది పాటు గడ్డు పరిస్థితులను ఎదుర్కొన్నా.. ప్రపంచంలో పెట్టుబడుల స్వర్గధామంగా ఇండియా అవతరిస్తుందని పేర్కొంటున్నారు.