కరోనా ప్రభావంతో ఇండియన్ ఎకానమీపై భారం: ప్రభుత్వ ఆర్థిక సలహాదారు వార్నింగ్
చైనా ను వణికిస్తున్న కరోనా వైరస్... ఇప్పుడు ప్రపంచ దేశాలకు ముచ్చెమటలు పట్టిస్తోంది. ఇది కేవలం ప్రాణాంతక వైరస్ గానే కాకుండా ఆర్థిక వ్యవస్థలను చిన్నాభిన్నం చేయగలిగే లక్షణాలను కలిగి ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పటికే చైనా లో 1,000 ప్రాణాలను బలి తీసుకున్న కరోనా వైరస్... మరో 50,000 మందికి సోకింది. ఇతర ఆసియా దేశాలతో పాటు అభివృద్ధి చెందిన దేశాల వరకు చేప కింద నీరులా విస్తరిస్తోంది. దీనిని అరికట్టేందుకు చైనా విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మొట్ట మొదట కరోనా వైరస్ కనిపించిన ఉహాన్ నగరాన్ని పూర్తిగా ఇతర ప్రాంతాలతో సంబంధాలు లేకుండా నియంత్రించింది. ఎవరూ ఆ నగరం విడిచి వెళ్లకుండా ఆంక్షలు విధించిన చైనా... అక్కడికి అన్ని రకాల ప్రయాణ మార్గాలను మూసివేసింది.
ఈ నేపథ్యంలో చైనా లోని మిగితా నగరాల్లో కూడా ఆర్థిక ఎమర్జెన్సీ నెలకొనటంతో ... ఆ దేశం పై ఆధారపడిన అనేక రంగాలు ప్రభావితం అవుతున్నాయి. చైనా నుంచి ఇండియా సహా ప్రపంచ దేశాలు పెద్ద ఎత్తున ముడిసరుకులు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, టాయ్స్, ఫార్మాస్యూటికల్ బల్క డ్రగ్స్ వంటి వాటిని దిగుమతి చేసుకుంటాయి. కానీ ఇప్పుడు వాటి సరఫరాకు అంతరాయం కలుగుతోంది. దీంతో ఇక్కడ మన కంపెనీల ఉత్పత్తి కూడా ప్రభావితం అవుతోంది.
ఇదిగో... భారత ఆర్థిక వ్యవస్థ ఇబ్బందుల్లో లేదు: నిర్మలా సీతారామన్
ఎకానమీ పై భారం...
పైన ఉదహరించిన కారణాలతో చైనా లో కరోనా వైరస్ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుందని, అది కొంత వరకు ఇండియన్ ఎకానమీ కి కూడా భారం అవుతుందని భారత ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ అభిప్రాయపడ్డారు. అయితే, అది ఎంత మేరకు ఉంటుందన్నది ఇప్పుడే కచ్చితంగా చెప్పలేమన్నారు. ఈ మేరకు అయన ప్రముఖ వార్త ఏజెన్సీ బ్లూమ్బెర్గ్ కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో వ్యాఖ్యానించారు. దీంతో మందగమనం నుంచి కోలుకుంటుందనుకున్న నేపథ్యంలో ఇప్పుడు చైనా కరోనా వైరస్ తో మన ఎకానమీ మళ్ళీ నెమ్మదించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 5% జీడీపీ వృద్ధి రేటును అంచనా వేస్తుండంగా... వచ్చే ఆర్థిక సంవత్సరం (2020-21) లో అది 6% నుంచి 6.5% వరకు ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
తెలియని కారణాలతో ఇబ్బంది...
ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం మన దేశంతో పాటు ఇతర దేశాలపై కూడా కనిపిస్తోంది. అయితే, ఈ విషయంలో తెలిసిన విషయాలతో పెద్దగా ప్రభావం పడదని.. కానీ తెలియని అంశాలతోనే ఎక్కువ ప్రమాదం ఉంటుందని కృష్ణమూర్తి అభిప్రాయపడ్డారు. చైనా లో ఏదైనా జరిగినా బయటి ప్రపంచానికి తెలిసేది చాలా తక్కువ అన్న విషయం తెలిసిందే. దీనినే అయన పరోక్షంగా ప్రస్తావించారు. ఏదైనా ముందస్తు సమాచారం ఉంటే ప్రమాదం నుంచి బయటపడవచ్చు. లేదంటే అది మన దాకా వచ్చే వరకు తెలియదు అన్నది సారాంశం. ఇదిలా ఉండగా... ప్రస్తుతం దేశంలో ఆర్థిక మందగమనం దాదాపు ముగిసినట్లేనని కృష్ణమూర్తి వెల్లడించారు. అయితే, దాని ఫలితాలు కనిపించాలంటే కొంత కాలం వేచిచూడాల్సిందేనని చెప్పారు. ఇలాంటి సమయంలో వచ్చే ఫలితాలు కాస్త అనిశ్చితిలో ఉంటాయన్నారు.
280 బిలియన్ డాలర్ల దెబ్బ...
ఇప్పటికే కరోనా వైరస్ వల్ల ప్రపంచవ్యాప్తంగా ప్రయాణాలపై ఆంక్షలు నెలకొన్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఒక్క త్రైమాషికంలోనే సుమారు 280 బిలియన్ డాలర్ల మేరకు నష్టపోతుందని కాపిటల్ ఎకనామిక్స్ అనే సంస్థను ఉటంకిస్తూ బ్లూమ్ బర్గ్ వెల్లడించింది. దీంతో 43 వరుస త్రైమాషీకాల్లో వృద్ధి నమోదు చేసిన గ్లోబల్ ఎకానమీకి ఇది వృద్ధి నిరోధకంగా కనిపిస్తోందని తెలిపింది. ఇదిలా ఉండగా... గతంలో చైనా లో వచ్చిన సార్స్ వైరస్ వల్ల జరిగిన ఉపద్రవం నుంచి పాఠాలు నేర్చుకోవాలని కృష్ణమూర్తి సుబ్రమణియన్ పేర్కొన్నారు. కానీ అప్పుడు దాని ప్రభావం ఇండియాపై కనిపించలేదన్నారు. కరోనా వైరస్ ను జాగ్రత్తగా గమనిస్తామన్న ఆయన... ఇప్పుడు కూడా అలాగే జరగాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.