కనకానికీ కరోనా సెగ... ఈ నెలలో డిమాండ్ ఎలావుంటుందో తెలుసా?
చైనాలో ఉద్భవించిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. వేలాది మంది ప్రాణాలను హరించి వేస్తోంది. మరి కొన్ని వేల మందికి వ్యాపిస్తోంది. కరోనా వైరస్ మూలంగా చైనాలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. దీంతో పలు రకాల ఉత్పత్తుల ప్రొడక్షన్ తగ్గిపోతోంది. వినియోగం కూడా తగ్గుతోంది. కరోనా సెగ ఇప్పుడు బంగారం ధరలకు కూడా తాకుతోంది. దీని మూలంగా ఈ నెలలో బంగారం డిమాండ్ తగ్గడానికి అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. బంగారం ధరలు అధికంగా ఉండటం వల్ల ఇప్పటికే బంగారం డిమాండ్ పై ప్రభావం పడుతోంది.
ఎంత తగ్గవచ్చంటే?
ప్రస్తుతం దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర దాదాపు 42,000 రూపాయల స్థాయిలో ఉంది. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో గత జనవరితో పోల్చితే డిమాండ్ 20-25 శాతం వరకు తగ్గవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. అయితే కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో రానున్న కాలంలో ధరలు పెరగవచ్చని కూడా కొంత మంది భావిస్తున్నారట. ఇలాంటి తరుణంలో మార్కెట్లో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నాయి. కాగా ప్రస్తుతం బంగారానికి డిమాండ్ ఆశించిన స్థాయిలో లేని కారణంగా కొంత మంది వ్యాపారస్తులు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నారని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం డిమాండ్ ఇప్పటికే తగ్గుముఖం పట్టిందని, బంగారం కొనుగోలు చేసేందుకు వినియోగదారుల చేతుల్లో అదనంగా డబ్బులు లేవని పరిశీలకులు చెబుతున్నారు.
ధర పెరగవచ్చు...
కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ఇన్వెస్టర్లలో ఆందోళన పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్టాక్ మార్కెట్లు నష్టాల బాటలో పడుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు భద్రతను ఇచ్చే బంగారం పై ద్రుష్టి సారిస్తున్నారు. ఒకవేళ కరోనా వైరస్ విస్తృతి ఇలాగే ఉంటే. మార్చి మధ్యకాలం నాటికే పది గ్రాముల బంగారం ధర 44,000 రూపాయల స్థాయికి చేరుకోవచ్చని అఖిల భారత జెమ్ అండ్ జువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ చైర్మన్ అనంత పద్మనాభన్ అంచనా వేస్తున్నారు. అయితే ప్రజలు బంగారం కొనుగోలు చేసేందుకు ముందుకువచ్చినా వారు కొనుగోలు చేసే పరిమాణం మాత్రం తక్కువగా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర 1,586 డాలర్ల స్థాయిలో ఉంది.
పెట్టుబడుల డిమాండ్
ఈ మధ్యకాలంలో బంగారంలో పెట్టుబడులు పెరుగుతున్నాయి. గోల్డ్ ఎక్స్చేంజి ట్రేడెడ్ ఫండ్స్ కు డిమాండ్ ఏర్పడుతోంది. గత ఏడాది కాలంలో బంగారంపై మంచి రిటర్న్ వచ్చింది. దీన్ని దృష్టిలో ఉంచుకొని పసిడిలో పెట్టుబడులు పెరగవచ్చని మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు.