కరోనా దెబ్బ: మార్బుల్ ఇండస్ట్రీ కుదేలు..ఆర్ధిక సంక్షోభంలో మార్బుల్ మైనింగ్
కరోనా లాక్ డౌన్ తో మార్బుల్ ఇండస్ట్రీ దెబ్బ తింది. తీవ్ర ఆర్ధిక సంక్షోభంలో కూరుకుపోయింది. లక్షలాది కార్మికులు పని లేక ఇబ్బంది పడుతున్నారు . నిత్యం కోట్ల వ్యాపారం జరిగే మార్బుల్ మైనింగ్ పరిశ్రమ కరోనా లాక్ డౌన్ దెబ్బకు మూత పడింది. ఎక్కడా ఎలాంటి వ్యాపారాలు కొనసాగక పోవటంతో నష్టాలను చవి చూస్తున్న పరిస్థితి .ఒకప్పుడు ఆసియాలో అతిపెద్ద మార్బుల్ మార్కెట్గా పిలువబడే రాజస్థాన్లోని కిషన్ఘర్ లాక్ డౌన్ తో బిజినెస్ లేక ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది .
కరోనావైరస్ లాక్డౌన్ మార్బుల్ పరిశ్రమపై తీవ్ర ప్రభావం
మార్బుల్ ప్రాసెసింగ్ యూనిట్లు మరియు ఫ్యాక్టరీ లతో ఎప్పుడూ కిటకిటలాడుతూ కార్మికులు పని చేసిన చోట, రహదారులపై ఒక్క వ్యక్తి కూడా కనిపించని పరిస్థితి నెలకొంది .
కిషన్ఘర్ కోవిడ్ -19 రెడ్ జోన్ అయిన అజ్మీర్ జిల్లాలో ఉంది . కరోనావైరస్ లాక్డౌన్ మార్బుల్ పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది, విధించిన ఆంక్షల కారణంగా అన్ని కార్యకలాపాలను నిలిపివేయటంతో కార్మికులు రోడ్డున పడ్డారు .ఈ కర్మాగారాల్లో పనిచేసిన వలస కూలీలకు పరిస్థితి మరింత ఘోరంగా ఉంది.
కిషన్ఘర్ లోని మార్బుల్ కర్మాగారాల్లో 25,000 మందికి పైగా కార్మికులు
రెండు నెలల పని లేకపోవడంతో, చాలా మంది కార్మికులు తమ సొంత గ్రామాలకు బయలుదేరారు, కాని ఇప్పటికీ చాలా మంది పట్టణంలో చిక్కుకొని, ఫ్యాక్టరీ ప్రాంగణంలోని ఇరుకైన క్వార్టర్స్లో తినటానికి తిండి లేక ఇబ్బందులు పడుతున్నారు. కిషన్ఘర్ లోని మార్బుల్ కర్మాగారాల్లో 25,000 మందికి పైగా కార్మికులు పని చేస్తున్నారు. కిషన్ ఘర్ లో మార్బుల్ మరియు గ్రానైట్ పరిశ్రమ 40 కిలోమీటర్లలో 1,100 యూనిట్లుగా విస్తరించి ఉంది .
ఒక్క కిషన్ ఘర్ లోనే రోజుకు 9 కోట్ల వ్యాపారం నష్టం .. ఇప్పటికి నష్టం 500కోట్ల పైమాటే
కోవిడ్ -19 లాక్ డౌన్ కంటే ముందు , ప్రతిరోజూ 9 కోట్ల రూపాయల వ్యాపారం చేసింది. కరోనా లాక్ డౌన్ తో ఇప్పటికి నష్టం 500 కోట్ల పైమాటే . గత కొన్నేళ్లుగా,మార్బుల్ పరిశ్రమ అనేక ఎదురుదెబ్బలను ఎదుర్కొంది - 2015 లో డీమోనిటైజేషన్ మరియు 2016 లో ఓపెన్ జనరల్ లైసెన్స్ అమలు చేయడం స్థానిక పాలరాయి ప్రాసెసింగ్పై ప్రభావం చూపించింది ఇప్పుడు తాజాగా కరోనావైరస్ లాక్డౌన్ మూలిగే నక్క మీద తాటికాయ పడిన చందంగా మారింది. కరోనా ప్రభావంతో ప్రస్తుతం మరింత కుదేలైన మార్బుల్ ఇండస్ట్రీని ఆదుకోవటానికి కేంద్ర , రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని కోరుతున్నారు పారిశ్రామిక వర్గాలు .