వర్క్ ఫ్రమ్ హోంతో రూ.5,500 నుండి రూ.10,000, గం.2 ఆదా, కంపెనీలకు లాభం!
చైనాలో పుట్టిన కరోనా వైరస్ కారణంగా ప్రపంచ ప్రజానీకం జీవనస్థితిగతుల్లో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా ఐటీ రంగం నుండి వివిధ రంగాలు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయుడికి చాలా వరకు సమయం, డబ్బు ఆదా అవుతుందని ఓ సర్వేలో వెల్లడైంది. ఈ మేరకు ప్రముఖ కో-వర్కింగ్ స్పేస్ ప్రొవైడర్ awfis సర్వేలో ఈ మేరకు ఆదా అయిందనే అంశంపై సర్వే నిర్వహించింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.
టీసీఎస్, ఇన్ఫోసిస్ సహా ఐటీ కంపెనీలకు అలా మంచి ఛాన్స్!
నెలకు రూ.5,520, 2 గంటలు ఆదా
సగటు భారతీయ ఉద్యోగి నెలకు దాదాపు రూ.5,520ను ఆదా చేస్తున్నారు. డబ్బుతో పాటు నెలకు సగటున గం.1.47 నిమిషాల సమయాన్ని కూడా ఆదా చేస్తున్నాడని తేలింది. కార్యాలయానికి వెళ్లే సమయం తప్పింది. ఇంటి నుండే పని వల్ల ప్రయాణ సమయం లేకపోవడంతో దాదాపు రెండు గంటలు ఆదా అవుతోందట. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల సగటు భారతీయులకు ఈ మేరకు ప్రయోజనం చేకూరిందని ఈ సర్వే వెల్లడించింది.
రూ.10,000 వరకు ఆదా చేస్తున్నాం
సర్వేలో పాల్గొన్నవారిలో 74 శాతం మంది ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా తాము నెలకు రూ.5,000 నుండి రూ.10,000 ఆదా చేస్తున్నామని 20 శాతం మంది చెప్పగా, రూ.10,000కు పైన ఆదా చేస్తున్నామని 19 శాతం మంది చెప్పారు. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల దాదాపు ప్రయాణం లేకుండా పోయింది. 40 శాతం మంది ఉద్యోగులు ప్రయాణం తగ్గినట్లు చెప్పారు.
అదనపు పని దినాలు... కంపెనీలకు లాభం..
వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల ఏడాదికి సగటు భారతీయుడు ఆదా చేసే సమయం దాదాపు 44 రోజులుగా ఉంటుందని awfis వ్యవస్థాపకులు, సీఈవో అమిత్ రమణి అన్నారు. ఏడాదికి దాదాపు 44 రోజులు అంటే 100 మంది ఉద్యోగులు ఉన్న ఓ సంస్థకు 18 పూర్తి రోజులతో సమానం. అంటే కంపెనీలకు ఎలాంటి అదనపు ఖర్చు లేకుండా వీరిని ఉపయోగించుకుంటే ఈ మేరకు ఖర్చు తప్పి, ప్రయోజనం పెరుగుతుందని చెప్పవచ్చు. ఒక ఉద్యోగి సగటున రోజుకు 8 గంటలు వర్క్ చేస్తాడు.
ఉద్యోగులకు కొన్ని చిక్కులు
అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ కారణంగా కొంతమంది ఉద్యోగులు సమస్యలు కూడా ఎదుర్కొంటున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. 27 శాతం మంది ఒంటరితనాన్ని, 23 శాతం మంది వర్క్-లైఫ్ బ్యాలెన్స్ పరంగా ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. కొన్ని కంపెనీలు ఇప్పటికీ టెక్నికల్ సమస్యలు ఎదుర్కొంటున్నాయి. కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ అనివార్యం. కాబట్టి ఈ దిశగా అడాప్ట్ అవుతున్నారు. ఉత్పాదకతపై రాజీపడకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ సాధ్యమని తేలిపోయిందని, రానున్న అయిదేళ్లలో ఇంటి నుండి పని పెరుగుతుందని అమిత్ రమణి అన్నారు. 43 శాతం మంది వర్క్-లైఫ్ను బ్యాలెన్స్ చేయలేకపోతున్నందున, రిమోట్ వర్కింగ్ విషయంలో వర్క్-లైఫ్ బ్యాలెన్స్కు సంబంధించి విధానాలు రూపొందించుకోవాల్సి ఉందన్నారు.
కాగా, ఈ సర్వేను దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో 1000 మంది ఉద్యోగులతో నిర్వహించారు. వివిధ రంగాల్లోని ఉద్యోగుల నుండి సమాచారం సేకరించారు. ఈ సర్వే ప్రకారం 75 శాతం కంటే ఎక్కువమంది ఉద్యోగులు తమ సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగిస్తున్నారు. ఈ సర్వేలో ఉద్యోగుల జవాబుదారీతనం, కంపెనీల నుండి ఉద్యోగులకు నమ్మకాన్ని సంపాదించి పెట్టినట్లు తెలిపింది.