కాగ్నిజెంట్ Q1 నెట్ ఇన్కం 38% జంప్, ఈ ఏడాది 9 శాతం అంచనా
అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీ సంస్థ గురువారం జనవరి - మార్చి త్రైమాసిక ఫలితాలు ప్రకటించింది. ఏడాది ప్రాతిపదికన కన్సాలిడేటెడ్ నెట్ ఆదాయం 37.60 శాతం పెరిగి 505 మిలియన్ డాలర్లుగా నమోదయింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో 7 శాతం నుండి 9 శాతం రెవెన్యూ గ్రోత్ ఉంటుందని అంచనా వేస్తోంది. గత ఏడాది మార్చి త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ నెట్ ఇన్కం 367 మిలియన్ డాలర్లు కాగా, ఇప్పుడు 505 మిలియన్ డాలర్లకు పెరిగింది.
డిజిటల్ రెవెన్యూ
కాగ్నిజెంట్ డిజిటల్ రెవెన్యూ ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగింది. డిజిటల్ రెవెన్యూ వాటా ఆదాయంలో 44 శాతానికి చేరుకుంది. అంతకుముందు ఇదే త్రైమాసికంలో ఈ వాటా 39 శాతంగా ఉంది. 2021లో రెవెన్యూ గ్రోత్ 7 శాతం నుండి 9 శాతంగా ఉంటుందని అంనచా వేసింది. జూన్ త్రైమాసికం రెవెన్యూ గ్రోత్ 10.5 శాతం నుండి 11.5 శాతం ఉంటుందని అంచనా వేస్తున్నారు.
వ్యూహం విజయవంతం
2021 క్యాలెండర్ ఏడాది మొదటి త్రైమాసికంలో డిజిటల్ స్వీకరణ, అంతర్జాతీయ విస్తరణలో భాగంగా పెట్టుబడులు పెట్టడం, కాగ్నిజెంట్ బ్రాండ్ పునస్థాపన అనే తమ వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేశామని, క్లౌడ్ మైగ్రేషన్, డిజిటల్ స్వీకరణ రాబోయే సంవత్సరాల్లో కాగ్నిజెంట్కు మరింత అవకాశాన్ని కల్పిస్తాయని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ బ్రియాన్ హంఫ్రీస్ అన్నారు.
భారత్కు అండగా
ముఖ్యంగా భారత్లో సంక్షోభం తీవ్రంగా ఉందని, ఈ సమయంలో భారత్కు అవసరమైన మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశామన్నారు. మద్దతులో భాగంగా తాము అనేక పెట్టుబడులు పెట్టామని చెప్పారు. కాగ్నిజెంట్ సొంత ఖర్చుతో వ్యాక్సీన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు.