ఇండిగో కో ఫౌండర్ రాజీనామా: దేశీయ విమానయాన సంస్థల్లో ఏం జరుగుతోంది?
ముంబై: దేశీయ విమానయాన సంస్థ ఇండిగో ఎయిర్లైన్స్ సహ వ్యవస్థాపకుడు రాకేష్ గంగ్వాల్.. రాజీనామా చేయడం కార్పొరేట్ సెక్టార్లో హాట్ డిబేట్గా మారింది. భారత్కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఇది. రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా సంయుక్తంగా దీన్ని నెలకొల్పారు. ప్రమోటర్లుగా వ్యవహరిస్తోన్నారు. 2005లో ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్ పేరుతో ఈ సంస్థ ఏర్పాటైంది. మిగిలిన ఎయిర్లైన్స్తో పోల్చి చూస్తే- కాస్త తక్కువ ఛార్జీలను వసూలు చేస్తుందనే గుర్తింపు తెచ్చుకుంది. లోకాస్ట్ క్యారియర్ (ఎల్సీసీ)గా పేరుంది.
ఇప్పుడీ సంస్థ నుంచి రాకేష్ గంగ్వాల్ తప్పుకొన్నారు. బోర్డు పదవికి రాజీనామా చేశారు. నాలుగు పేరాలతో కూడిన రాజీనామా పత్రాన్ని ఆయన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లకు అందజేశారు. అక్కడితో ఆగలేదాయన. దశలవారీగా సంస్థలో ఉన్న తన వాటాలను కూడా తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయనే వార్తలొస్తున్నాయి. హఠాత్తుగా గంగ్వాల్ సంస్థ నుంచి తప్పుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పుడున్న పోటీ వాతావరణంలో లోకాస్ట్ క్యారియర్గా సుదీర్ఘకాలం పాటు సేవలను అందించలేమని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా, వారి తరఫున ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్ లిమిటెడ్లో ఇన్వెస్ట్ చేసిన వారి మొత్తం వాటాల శాతం 77.4 శాతంగా ఉంటోంది. ఇందులో గంగ్వాల్ హోల్డింగ్స్ 36.61 శాతం. భాటియా స్టేక్స్ 37.8 శాతం. ఇప్పుడు ఈ వాటాలను వచ్చే అయిదు సంవత్సరాల కాలంలో దశలవారీగా తగ్గించుకుంటానని గంగ్వాల్ తన రాజీనామా లేఖలో స్పష్టం చేశారు. ప్రమోటర్లలో ఒకరు తమ వాటాలను విక్రయించాల్సిన పరిస్థితి తలెత్తితే మరో ప్రమోటర్ దాన్ని నిరాకరించే వీలు లేదని, ఆమోదించాల్సి ఉంటుందని ఇండిగో బోర్డు గత ఏడాది డిసెంబర్లో తీర్మానించింది.
రాకేష్ గంగ్వాల్, రాహుల్ భాటియా మధ్య విభేదాలు తలెత్తాయని, అందుకే ఈ రకమైన తీర్మానాన్ని బోర్డు తప్పనిసరి పరిస్థితుల్లో ఆమోదించాల్సి వచ్చిందనే అభిప్రాయాలు అప్పట్లో వ్యక్తం అయ్యాయి. దాన్ని నిజం చేసేలా ఇప్పుడు తాజాగా గంగ్వాల్- ఇండిగో నుంచి తప్పుకొన్నారు. కార్పొరేట్ అడ్మినిస్ట్రేషన్ విషయాలపై దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తూ 2019 జులైలో గంగ్వాల్ ఏకంగా సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డ్కు లేఖ రాయడమే- ఈ విభేదాలకు దారి తీసిందనే అభిప్రాయాలు లేకపోలేదు.
రాకేష్ గంగ్వాల్ రాజీనామా చేసిన ప్రభావం ఇండిగో షేర్లపై తీవ్రంగా పడింది. వాటి షేర్లు క్షీణించాయి. రెండు శాతం మేర నష్టాన్ని చవి చూశాయి. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్, బోంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లల్లో నష్టంతో ట్రేడ్ అయ్యాయి. 2,168 రూపాయలతో ఇంట్రాడే కొనసాగినప్పటికీ- రాజీనామా వార్తల తరువాత దిగజారింది. ఒకదశలో 2,091 వరకు ఇండిగో షేర్లు పతనం అయ్యాయి. కొద్దిగా పుంజుకుని, 2,113 రూపాయల వద్ద ట్రేడ్ అయ్యాయి.