Vizag: విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు.. సీఎం జగన్ పెట్టుబడుల ఆకర్షణ మంత్రం..
Vizag: త్వరలో ఉక్కునగరానికి పాలనను మార్చనున్నట్లు నేడు సీఎం జగన్ ప్రకటించారు. తాను కూడా స్వయంగా రాజధాని విశాఖ నుంచి పరిపాలన మెుదలుపెట్టనున్నట్లు స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆర్థిక రాజధానిగా విశాఖను బలోపేతం చేసే పనిలో సీఎం అండ్ టీం బిజిగా ఉన్నట్లు తెలుస్తోంది.
విశాఖలో సదస్సు..
ఏపీ ప్రభుత్వం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సదస్సు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం మార్చి 3, 4 తేదీల్లో సదస్సు నిర్వహించేందుకు ఉక్కునగరంలో ఏర్పాట్లు మెుదలయ్యాయి. ఇందుకోసం దిల్లీలోని లీలా ప్యాలెస్ హోటల్లో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ దేశాల ప్రతినిధులనుద్దేశించి సీఎం వైయస్ జగన్ మాట్లాడారు.
అపార అవకాశాలు..
ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులకు అత్యంత అనుకూలమైన రాష్ట్రమని వెల్లడించారు. ఇక్కడ ఇతర ప్రాంతాలు, రాష్ట్రాల కంటే భిన్నమైన అనుకూలతలు ఉన్నట్లు వెల్లడించారు. పెట్టుబడులతో రాష్ట్రానికి తరలివచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం ఉంటుందని సీఎం వెల్లడించారు. ఇప్పటికే అనేక అంతర్జాతీయ కంపెనీలు, సంస్థలు ఏపీ కేంద్రంగా తమ ఉత్పత్తుల తయారీ, ఎగుమతులను నిర్వహించటం రాష్ట్రానికి మంచి పేరు తెచ్చిపెట్టింది. కియా నుంచి క్యాడ్బరీ వరకు కంపెనీలు తమ వ్యాపారాలను సాఫీగా నిర్వహిస్తున్నాయి.
వేగంగా వృద్ధి చెందుతూ..
ప్రస్తుతం 11.43 శాతం జీడీపీతో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే శరవేగంగా వృద్ధి చెందుకున్న రాష్ట్రాల జాబితాలో ముందంజలో ఉంది. గడచిన 3 సంవత్సరాలుగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ మెుదటి స్థానంలో నిలవటం రాష్ట్ర ప్రగతికి, వ్యాపారులకు అనుకూలమైన వాతావరణాన్ని ప్రభుత్వం అందిస్తున్నట్లు రుజువు చేస్తోంది. దీని ద్వారా పరిశ్రమల స్ధాపనకు దేశంలో ఏపీ ఎంత అనుకూలమైన రాష్ట్రమో స్పష్టమవుతోంది.
రవాణా లాజిస్టిక్స్..
ఎక్కడైనా వ్యాపారాలు సాఫీగా సాగాలంటే కావాల్సింది మౌలిక సదుపాయాలు. 6 పోర్టులు, 974 కిలోమీటర్ల సముద్రతీరం, 6 విమానాశ్రయాలు, 3 పారిశ్రామిక కారిడార్లు గ్రోత్ ఇంజన్లుగా నిలుస్తున్నాయి. దీనికి తోడు 48 రకాల ఖనిజాలు లభించటం పెద్ద వ్యాపార వృద్ధికి దోహదపడుతున్నాయి. పైగా పరిశ్రమ ఏర్పాటుకు 21 రోజుల్లో అన్ని అనుమతులు మంజూరు చేస్తున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. రాష్ట్రంలో అనేక ఇండస్ట్రియల్, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లు, టాయ్ క్లస్టర్లు, పుడ్ ప్రాసెసింగ్, టెక్ట్స్టైల్, సిమెంట్ క్లస్టర్లు, మెడికల్ డివైసెస్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్, ఫార్మా, ఆటోమొబైల్ క్లస్టర్లు వ్యాపారులకు కావలసిన వసతులతో రెడీగా ఉన్నాయి. ఈ కార్యక్రమంలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ తో పాటు ఏపీ పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు.