టిక్టాక్ బ్యాన్, గంటకు లక్షల్లో దూసుకెళ్లిన చింగారీ: చైనాకు రూ.వందల కోట్ల నష్టం
సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో 59 చైనీస్ యాప్స్ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. దీంతో ఇండియాకు చెందిన చింగారి యాప్ దూసుకెళ్తోంది. ఇంతకుముందే జవాన్లు అమరులవడంతో టిక్టాక్ను కొందరు తమ ఫోన్స్ నుండి తొలగించారు. ఇప్పుడు ప్రభుత్వమే బ్యాన్ చేయడంతో చింగారీ యాప్కు డౌన్ లోడ్స్ పెరిగాయి. దేశంలో యాంటీ చైనా సెంటిమెంట్ కారణంగా చింగారీ యాప్ ఇటీవలి వరకు 25 లక్షల డౌన్లోడ్లు నమోదు చేసింది. టిక్ టాక్ బ్యాన్ తర్వాత 30 నిమిషాల్లో చింగారీ యాప్ 10 లక్షలకు పైగా డౌన్ లోడ్ అయ్యాయి.
చైనాకు చెక్: మూసివేత దిశగా చైనా వార్తల ఆప్ యూసీ న్యూస్
30 నిమిషాలకు 10 లక్షల డౌన్ లోడ్స్
చింగారీ యాప్ కో-ఫౌండర్ సుమిత్ ఘోష్ మాట్లాడుతూ... చింగారీ యాప్ డౌన్ లోడ్స్ గత రాత్రి నుండి చాలా ఫాస్ట్గా ఉన్నాయన్నారు. ఓ సమయంలో అరగంటకు 10 లక్షల డౌన్ లోడ్స్ అయ్యాయని తెలిపారు. గత రాత్రి గంటకు లక్ష డౌన్ లోడ్స్ అయినట్లు తెలిపారు. పెద్ద ఎత్తున డౌన్ లోడ్స్ కారణంగా గత రాత్రి సర్వర్ కూడా క్రాష్ అయినట్లు తెలిపారు. ఆ తర్వాత కాసేపటికి సమస్యను పరిష్కరించినట్లు తెలిపారు. గూగుల్ ప్లే స్టోర్లో చింగారీ యాప్ 4.7 రేటింగ్ ఉంది. టిక్ టాక్ తరహా చింగారీ యాప్ను బెంగళూరుకు చెందిన ప్రోగ్రామర్ బిస్వాత్మ నాయక్, సిద్ధార్థ గౌతమ్ తయారు చేశారు.2018 నవంబర్లో గూగుల్ ప్లేలో లాంచ్ చేసారు. 2019 జనవరిలో ఐవోఎస్లో లాంచ్ అయింది. ఈ యాప్ హిందీ, బంగ్లా, గుజరాతీ, మరాఠీ, కన్నడ, పంజాబీ, మలయాళం, తమిళ్, తెలుగు భాషల్లో ఉంది.
రూ.100 కోట్ల నష్టం
టిక్ టాక్ సహా 59 చైనీస్ యాప్స్ బ్యాన్ చేసిన నేపథ్యంలో డ్రాగన్ దేశ కంపెనీలకు కోట్లాది రూపాయల నష్టం వాటిల్లుతోందని చెబుతున్నారు. కేవలం టిక్ టాక్ యాప్ ద్వారా రూ.100 కోట్ల వరకు నష్టం ఉండవచ్చునని అంచనా. 2019 అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్లోనే రూ.23 కోట్ల నుండి రూ.25 కోట్ల ఆదాయం ఆర్జించిందని అంచనా. 2020 మార్చి నుండి మే మిడిల్ వరకు భారత్లో డౌన్ లోడ్ చేసిన టాప్ 10 మొబైల్ యాప్స్లలో 5 చైనావే. అందులో టిక్ టాక్, జూమ్, హెలో, యూవీడియో, యూసీ బ్రౌజర్ ఉన్నాయి. జూమ్ మినహా పై యాప్స్ను కేంద్రం నిషేధించింది.
టిక్ టాక్ రెవెన్యూ.. చైనా, అమెరికా టాప్
ఇదిలా ఉండగా, ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ ఓ ట్వీట్ చేశారు. అమెరికాలో 165 మిలియన్ల మంది టిక్ టాక్ను ఉపయోగిస్తున్నారని, దీని ద్వారా రూ.650 కోట్ల రెవెన్యూ వచ్చిందని, చైనాలో 197 మిలియన్ల మంది ఉపయోగిస్తున్నారని, రూ.2,500 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. టాప్ రెవెన్యూ జనరేట్ అవుతున్న దేశాల్లో భారత్ కనిపించలేదని పేర్కొన్నారు. డిసెంబర్ 2019 క్వార్టర్లో రూ.25 కోట్ల రెవెన్యూ నమోదు చేసినట్లు తెలిపారు.
అయితే భారత్లో 2019 డిసెంబర్ నాటికి 120 మిలియన్ల మందికి పైగా ఉపయోగిస్తున్నారు. క్రమంగా యూజర్లు పెరగడంతో రెవెన్యూ కూడా పెరిగింది. ఏదేమైనా ఒక్క టిక్ టాక్ ద్వారానే రూ.100 కోట్ల మేర చైనా కంపెనీలు ఆదాయం కోల్పోయినట్లేనని అంటున్నారు.
చైనాకే నష్టం.. స్పందించిన డ్రాగన్ కంట్రీ
చైనా యాప్స్ నిషేధం వల్ల చైనాకే ఎక్కువగా నష్టం వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం గతంలోనే ఈ చర్య తీసుకోవాల్సి ఉండెనని అంటున్నారు. చైనా యాప్స్ వల్ల భారతీయుల వ్యక్తిగత, ఆర్థిక డేటా నేరుగా చేనాకు చేరుకుంటోందని, దీనికి ముకుతాడు పడుతోుందన్నారు. ఈ కంపెనీల సర్వర్లు చైనాలో ఉన్నాయని, దీంతో ప్రజల సమాచారంతో పాటు జాతీయ భద్రతకు తీవ్రమైన ముప్పు అంటున్నారు. కాగా తమ దేశానికి చెందిన యాప్స్ నిషేధంపై చైనా ఆందోళన వ్యక్తం చేసింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియాన్ మీడియాతో మాట్లాడుతూ.. చైనా వ్యాపారుల హక్కులను భారత్ కాపాడాలన్నారు.
పెట్టుబడులనూ నిషేధించాలి
భారత స్టార్టప్స్లలో పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయని, ఇలాంటి పెట్టుబడులను ఆపేందుకు కూడా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలని సూచిస్తున్నారు. గత అయిదేళ్ల కాలంలో స్టార్టప్స్ల్లోకి చైనా కంపెనీల నుండి 8 బిలియన్ డాలర్లకు పైగా పెట్టుబడులు వచ్చినట్లు అంచనా.