ఒప్పో, షియోమీ సహా చైనా మొబైల్ కంపెనీ కార్యాలయాలపై ఐటీ దాడులు
పన్ను ఎగవేత ఆరోపణలకు సంబంధించి చైనాకు చెందిన నాలుగైదు ప్రముఖ మొబైల్ కంపెనీల కార్యాలయాలపై దేశవ్యాప్తంగా ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. చైనాకు చెందిన ఒప్పో, షియోమీ, వన్ ప్లస్, వివో, రియల్మీ సహా పలు చైనా కంపెనీలు భారత్లో మొబైల్స్ను విక్రయిస్తున్నాయి. ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, గ్రేటర్ నోయిడా, కోల్కతా, గౌహతి, ఇండోర్తో సహా వివిధ నగరాల్లో 24కు పైగా ఈ కంపెనీల వెండార్లు, డిస్ట్రిబ్యూటర్ల కార్యాలయాలపై సోదాలు జరిగాయి.
మంగళవారం ప్రారంభమైన సోదాలు బుధవారం వరకు కొనసాగాయని, మొబైల్ కంపెనీ ప్రతినిధులను కూడా ఐటీ అధికారులు విచారించారని తెలుస్తోంది. ఆయా కంపెనీలు పెద్ద ఎత్తున పన్ను ఎగవేశాయనే నిఘా వర్గాల సమాచారం మేరకు సోదాలు జరిపారని తెలుస్తోంది. ఐటీ శాఖ ఈ కంపెనీలపై చాలాకాలంగా కన్నేసిందని, పన్ను ఎగవేతలపై పక్కా సమాచారం లభించడంతో సోదాలు జరిపిందని చెబుతున్నారు. సోదాల్లో భాగంగా పన్నులకు సంబంధించిన డిజిటల్ డేటా డిస్క్లను జఫ్తు చేశారని తెలుస్తోంది..
ఉత్పత్తుల సరఫరా, విక్రయం, ఆర్థిక సేవల్లో ఉన్న కొన్ని కంపెనీలు కూడా ఈ జాబితాలో ఉన్నట్లుగా సమాచారం. పన్ను ఎగవేసినట్టు నిరూపించే డిజిటల్ సమాచారాన్ని గుర్తించి, సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. ఐటీ అధికారులకు సహకరిస్తున్నట్టు ఒప్పో, షియోమీ వెల్లడించింది. భారతీయ చట్టాలకు అనుగుణంగా వ్యాపారం చేస్తున్నామని తెలిపాయి. ఈ ఏడాది ఆగస్ట్ నెలలో టెల్కో పరికరాల విక్రయంలో ఉన్న చైనాకు చెందిన జడ్టీఈపైనా ఐటీ తనిఖీలు జరిగాయి.