టిక్టాక్ సహా చైనీస్ యాప్స్: టాప్ యాప్స్ ఆదాయం, ఉద్యోగులు మరిన్ని వివరాలివీ..
కేంద్ర ప్రభుత్వం ఇటీవల టిక్టాక్, హెలో, యూసీ బ్రౌజర్, షేరిట్ సహా 59 చైనీస్ యాప్స్ను బహిష్కరించిన విషయం తెలిసిందే. దేశ సార్వభౌమత్వానికి, జాతి భద్రతకు ప్రమాదకరమని భావించి ఈ యాప్స్ను కేంద్రం నిషేధించింది. ఇలా బ్యాన్ చేయబడిన వాటిలో టిక్టాక్, హెలో, యూసీ బ్రౌజర్, కామ్ స్కానర్, షేరిట్ వంటివి ఉన్నాయి. వీటిలో కొన్ని భారతీయులు ఎక్కువగా ఉపయోగించి, కంపెనీకి భారీ ఆదాయం సమకూర్చేవి కావడం గమనార్హం. హెలో వంటివాటికి మన దేశంలో ఉద్యోగులు కూడా చాలా ఎక్కువే ఉన్నారు. నిషేధించిన కొన్ని యాప్స్లలో విస్తృతంగా ఉపయోగించే వాటిని తెలుసుకుందాం..
టిక్టాక్ బ్యాన్, గంటకు లక్షల్లో దూసుకెళ్లిన చింగారీ: చైనాకు రూ.వందల కోట్ల నష్టం
టిక్టాక్, హెలో.. రెవెన్యూలో భారత్ ఆ తర్వాతే,
టిక్టాక్, హెలో యాప్స్ మాతృసంస్థ బైట్డ్యాన్స్ టెక్నాలజీ ప్రయివేట్ లిమిటెడ్. ఈ రెండు యాప్స్కు కలిపి మన దేశంలో 170 మిలియన్ల వరకు యాక్టివ్ యూజర్లు ఉన్నారు. టిక్టాక్కు భారత్ ప్రధాన మార్కెట్ 611 మిలియన్ల డౌన్ లోడ్స్ జరిగాయి. వీడియో మార్కెట్లో మూడింట ఒక వంతును కైవసం చేసుకుంది. చైనా, అమెరికా తర్వాత ఎక్కువ డౌన్లోడ్స్ భారత్వే. ఈ యాప్స్ ద్వారా కంపెనీలకు భారీ ఆదాయం వచ్చే దేశాల్లో.. చైనా, అమెరికా తర్వాతనే భారత్ ఉంది. 2019లో అమెరికాలో టిక్టాక్ డౌన్లోడ్స్ 165 మిలియన్లు కాగా రెవెన్యూ 86.5 మిలియన్ డాలర్లు(రూ.650 కోట్లు), చైనా యూజర్లు 197 మిలియన్లు కాగా, రెవెన్యూ 331 మిలియన్ డాలర్లు (రూ.2,500 కోట్లు)గా ఉంది. ఇండియా నుండి గత ఏడాది రూ.43.6 కోట్లు రాగా, ఆదాయ లక్ష్యాన్ని 100 కోట్లుగా పెట్టుకుంది.
భారత్లో టిక్టాక్.. వెయ్యిలోపు ఉద్యోగులు
ఈ సంస్థ మన దేశంలో ఎనిమిది నగరాల్లో ఉనికిని కలిగి ఉంది. వెయ్యి మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు. కార్పోరేట్ స్ట్రక్చర్ ప్రకారం బైక్ డ్యాన్స్ కంపెనీ కేమన్ దీవుల్లో రిజిస్టర్ అయింది. దీనికి 5 అనుబంధంగా ఉన్నాయి. ఇందులో టిక్టాక్ ఒకటి. ఇది కూడా కేమన్ దీవుల్లోనే రిజిస్టర్ అయింది. భారత్, ఆగ్నేయాసియా నుండి పని చేసే కంపెనీలు టిక్టాక్ ప్రయివేటు లిమిటెడ్ కింద నమోదు చేయబడ్డాయి. బైట్ డ్యాన్స్ గత మూడేళ్ల కాలంలో భారత్లో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టింది.
యూసీ బ్రౌజర్, యూసీ న్యూస్లో 100లోపు ఉద్యోగులు
అలీబాబా గ్రూప్ ప్లాట్ ఫామ్స్ను యూసీ వెబ్ మొబైల్ ప్రయివేటు లిమిటెడ్ అంటారు. మన దేశంలో గూగుల్ క్రోమ్ తర్వాత అత్యధికంగా వినియోగిస్తున్న మొబైల్ ఇంటర్నెట్ బ్రోజర్ యూసీ బ్రౌజర్. క్రోమ్ మార్కెట్ షేర్ 70 శాతంగా ఉంటే యూసీ బ్రౌజర్ మార్కెట్ షేర్ 22 శాతం ఉంది. యూసీ వెబ్ మొబైల్లో మన దేశంలో ఉద్యోగులు 100 లోపు ఉంటారు. కానీ 2018-19 ఏడాదిలో రూ.226.68 కోట్ల రెవెన్యూ సాధించింది. ముఖ్యంగా ప్రకటనల ద్వారా ఆదాయం వస్తోంది. రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ (RoC) ప్రకారం ఇది అలీబాబా గ్రూప్ డిజిటల్ మీడియో అండ్ ఎంటర్టైన్మెంట్ విభాగం. మార్చి 31, 2019తో ముగిసిన క్యాలెండర్ ఇయర్లో 3.59 బిలియన్ల ఏకీకృత ఆదాయాన్ని నమోదు చేసింది.
రెవెన్యూ లేని షేరిట్
భారత్లో 400 మిలియన్ల యాక్టివ్ యూజర్లు ఉన్నారు షేరిట్కు. అత్యంత ప్రాచుర్యం పొందిన ఫైల్ షేరింగ్ యాప్స్లో ఇది ఒకటి. ప్రపంచవ్యాప్తంగా 1.8 బిలియన్ యూజర్లు ఉన్నారు. అయితే షేరిట్ టెక్నాలజీ ఇండియా ప్రయివేటు లిమిటెడ్ 2018-19లో కేవలం 14.73కోట్లు మాత్రమే ఆర్జించింది. ఆదాయపరంగా భారత్ వాటా 15 శాతం నుండి 20 శాతం ఉంటుంది. 2018లో ఈ సంస్థ ఎంటర్టైన్మెంట్ ప్లాట్ ఫామ్ ఫాస్ట్పిల్మ్జ్ను సొంతం చేసుకుంది. షేరిట్ టెక్నాలజీస్ ఇండియా వాటాలో 99.99 శాతం హాంగ్కాంగ్కు చెందిన ,షేరిట్ హెచ్కే టెక్నాలజీ లిమిటెడ్ పైన ఉంది.
క్లబ్ ఫ్యాక్టరీలో 90 మంది ఉద్యోగులు
భారత మూడో అతిపెద్ద ఈ-కామర్స్ కంపెనీ క్లబ్ ఫ్యాక్టరీ. 30,000 మంది సెల్లర్స్ ఈ ప్లాట్ఫాంలో ఉన్నారు. దీని భారత మాతృసంస్థ గ్లోబ్ మ్యాక్స్ కామర్స్ ఇండియా ప్రయివేట్ లిమిటెడ్. హాంగ్కాంగ్కు చెందిన అన్బీటెన్ ప్రైస్ లిమిటెడ్ పేరుతో ఇందులో 99.99 శాతం వాటా ఉంది. 2018-19లో గ్లోబ్ మాక్స్ కామర్స్ రెవెన్యూ 172.14 కోట్లుగా ఉంది. క్లబ్ ఫ్యాక్టరీలో 90 మంది ఉద్యోగులు ఉన్నారు.
షేరిన్లో 50 ఉద్యోగులు
ఫ్యాషన్, లైఫ్ స్టైల్ ఉత్పత్తులపై దృష్టి సారించిన సంస్థ షేరిన్. గుర్గావ్ కేంద్రంగా ఇది కార్యకలాపాలు నిర్వహిస్తోంది. XIYIN ఇండియా ప్రయివేటు లిమిటెడ్ పేరుతో నిర్వహిస్తున్నారు. ఈ కంపెనీ ఇండియాలోని టైర్ 2, టైర్ 3 నగరాలను లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో 50 మంది వరకు ఉద్యోగులు ఉన్నారు. దేశంలో దీనికి 1 మిలియన్కు పైగా వినియోగదారులు ఉన్నారు. గత ఏడాది దిగుమతి సుంకం ఎగవేత ఆరోపణలపై కస్టమ్స్ డిపార్టుమెంట్ చర్యలతో అప్పటి నుండి కార్యకలాపాలు పాక్షికంగా నిలిపివేయబడ్డాయి. మొత్తంగా ఈ కంపెనీల్లో వేలల్లోనే ఉద్యోగులు ఉన్నారు.