మేమెంతో చేశాం: భారత్ FDI కీలక సవరణలపై చైనా అసహనం
భారత్ ఇటీవల తీసుకువచ్చిన ఫారన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ (FDI) నిబంధనలను చైనా తప్పుబట్టింది. ఇది ప్రపంచ వాణిజ్య సంస్థ నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. భారత్ అన్ని విదేశాల పెట్టుబడులను సమానంగా చూడాలని పేర్కొంది. భారత్ బహిరంగ సరసమైన, సమానమైన వ్యాపార వాతావరణాన్ని పెంపొందించుకోవాలని సూచించింది. ఇటీవలి కొత్త ఎఫ్డీఐ నిబంధనలు ఇందుకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.
ఇప్పటికైనా కళ్ళు తెరిచారు... చైనాకు కళ్లెం వేయాల్సిందే.. లేకుంటే అంతే!
మా పెట్టుబడులు మీ అభివృద్ధికి తోడ్పడ్డాయి
భారత్ తాజా FDI నిబంధనలు WTO మార్గదర్శకాలను ఉల్లంఘించేలా ఉన్నాయని చైనా పేర్కొంది. చైనా పెట్టుబడులు ఎప్పుడు కూడా భారత పరిశ్రమ అభివృద్ధికి దోహదపడ్డాయని పేర్కొంది. ఈ మేరకు ఇండియాలోని చైనీస్ ఎంబసీ అధికార ప్రతినిధి జీ రోంగ్ భారత కొత్త ఎఫ్డీఐ నిబంధనలను తప్పుబట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి కేంద్రం ఇటీవల కొన్ని సవరణలు చేసిన విషయం తెలిసిందే.
ఇదీ కొత్త విధానం
భారత్తో సరిహద్దు ఉన్న దేశాలు ఆటోమెటిక్గా టేకోవర్ తీసుకోవడం కుదరదని కేంద్రం స్పష్టం చేసింది. భారత్లో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలంటే దానికి ఆటోమెటిక్ టేకోవర్ విధానం కుదరదని, కేంద్రం అనుమతితోనే సరిహద్దు దేశాలు పెట్టుబడులు పెట్టాలని సూచించింది. అవకాశవాదంగా మారిన ఎఫ్డీఐ విధానాన్ని అడ్డుకోవాలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం తీసుకున్నట్లు భారత్ పేర్కొంది.
అన్ని పెట్టుబడులను సమానంగా చూడాలి
ఈ కొత్త FDI విధానాన్ని చైనా తప్పుపట్టింది. కొత్త విధానం స్వేచ్ఛ వాణిజ్యానికి వ్యతిరేకంగా ఉందని చైనా అధికారులు తెలిపారు. ఈ కొత్త విధానంలో చైనా గురించి స్పష్టంగా చెప్పకపోయినప్పటికీ దాని ప్రభావం మాత్రం తమ పెట్టుబడిదారులపై స్పష్టంగా కనిపిస్తోందని చైనా ఎంబసీ ప్రతినిధి తెలిపారు. వివక్ష పూరిత నూతన విధానాలను భారత్ మారుస్తుందన్న ఆశాభావాన్ని చేశారు. వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను సమంగా చూడాలన్నారు.
కేంద్ర ప్రభుత్వం రక్షణ చర్యలు
భారత సరిహద్దుల్లోని దేశాల నుంచి వచ్చే FDIలకు ఇక నుండి తప్పనిసరి. ఇందుకు FDI నిబంధనలను సవరించినట్లు పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక డిపార్టుమెంట్ (డీపీఐఐటీ) ఇటీవల తెలిపింది. ప్రస్తుత లేదా భవిష్యత్ FIDలకు సంబంధించి దేశీయ కంపెనీల యాజమాన్య హక్కుల బదిలీకి సైతం ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేసింది. కరోనా సంక్షోభ సమయంలో ఇదే అదనుగా చైనా కంపెనీలు మన సంస్థలను బలవంతంగా టేకోవర్ చేయకుండా రక్షణాత్మక చర్యలు చేపట్టింది భారత్ ప్రభుత్వం. చైనాతో పాటు బంగ్లాదేశ్, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, మయన్మార్, ఆఫ్ఘనిస్థాన్ దేశాలు భారత్తో సరిహద్దులు పంచుకుంటున్నాయి.
ఇప్పటి వరకు పాకిస్తాన్కు.. ఇక నుండి
ఇదివరకు పాకిస్తాన్ FDIలకు మాత్రమే ఈ ఆంక్షలు ఉండేవి. పాక్కు చెందిన వ్యక్తి లేదా కంపెనీ భారత్లో కొన్ని రంగాల్లో మాత్రం పెట్టుబడులు పెట్టేందుకు అవకాశముంది. అది కూడా కేంద్రం అనుమతితో. భారత స్టార్టప్స్లలో చైనాకు చెందిన టెక్ ఇన్వెస్టర్లు ఇప్పటివరకు 400 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టారు. దేశంలోని 30 యూనికార్న్ (100 కోట్ల డాలర్లకు పైగా విలువ చేసే) స్టార్టప్స్లలో 18 చైనా ఫండింగ్ కలిగినవే. DPIIT డేటా ప్రకారం 2000 ఏప్రిల్ నుంచి 2019 డిసెంబరు వరకు చైనా నుంచి 234 కోట్ల డాలర్ల పెట్టుబడులు మన దేశంలోకి వచ్చాయి.