అదను చూసి HDFC షేర్లు కొనుగోలు చేసిన చైనా బ్యాంకు, ఇండియన్స్ ఆందోళన!!
ప్రయివేటురంగ బ్యాంకింగ్ దిగ్గజం HDFC లిమిటెడ్లో 1.75 కోట్ల షేర్ల (1%)ను చైనా సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేసింది. జనవరి - మార్చి క్వార్టర్లో పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా ఈ వాటాలను కొనుగోలు చేసినట్లు ఎక్స్చేంజీ వివరాలు వెల్లడిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన పూర్తి ట్రాన్సాక్షన్స్ వివరాలు తెలియాల్సి ఉంది. చైనా కేంద్ర బ్యాంకు అయిన పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనా HDFC లిమిటెడ్లో తన వాటాను పెంచుకుంది.
HDFC లిమిటెడ్లో చైనా బ్యాంకుకు 17.5 మిలియన్ల షేర్లు ఉన్నాయి. కంపెనీ షేర్ క్యాపిటల్లో ఇది 1.01 శాతానికి సమానం. గత ఏడాది అక్టోబర్ - డిసెంబర్ క్వార్టర్లో ఎల్ఐసీ తమ వాటాను 4.21% నుంచి 4.67% పెంచుకుంది. ఫిబ్రవరి మొదటి వారం నుంచి HDFC షేర్ల విలువ 41% పతనమైంది. జనవరి 1వ తేదీన రూ.2,433.75 వద్ద ఉన్న HDFC షేర్ మార్చి 31 నాటికి రూ.1,630.45కు దిగి వచ్చింది.
Good News: ఉద్యోగాల తొలగింతనే కాదు.. కరోనా తర్వాత ఈ రంగాల్లో కొత్త అవకాశాలు
భారత్లో పెట్టుబడులకు చైనా బ్యాంకుల ఆసక్తి
కరోనా వైరస్ మహమ్మారి భయాలతో ప్రపంచమంతా అతలాకుతలం అవుతోంది. గత రెండు నెలల్లో సూచీలు గణనీయంగా దిద్దుబాటుకు గురవుతున్నాయి. ఇదే సమయంలో భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు చైనా బ్యాంకులు ఆసక్తి చూపిస్తున్నాయనే వార్తలు వస్తున్నాయి. ఏ ధర వద్ద షేర్లను కొనుగోలు చేసిందనే వివరాలు తెలియాల్సి ఉందని చెబుతున్నారు.
సమాచారం ఇవ్వాలి
చైనా సావరీన్ వెల్త్ ఫండ్ తరఫున కొనుగోలు చేస్తారని, కొనుగోలుదార్ల వాటా 1 శాతం కంటే పెరిగినప్పుడు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని హెచ్డీఎఫ్సీ బ్యాంకు చైర్మన్ దీపక్ పరేఖ్ అన్నారు.
గత మార్చిలో పెట్టుబడులు పెంచుకుంది
పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా (PBoC) HDFCలో పెట్టుబడిదారు అని, 2019లో 0.8 శాతం వాటాను కలిగి ఉందని, మార్చి 2020 నాటికి ఇది తన వాటాను 1 శాతానికి పెంచుకుందని HDFC చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, వైస్ చైర్మన్ కేకి మిస్త్రీ తెలిపారు. వారు నిష్క్రియాత్మక పెట్టుబడిదారులు అన్నారు.
షేర్ వ్యాల్యూ పడిపోయిన సమయంలో..
HDFC బ్యాంకు షేర్లు రెండు నెలల్లో భారీగా పడిపోయాయి. ఇదే సమయంలో మార్చి నెలలో తన వాటాను పెంచుకున్నట్లుగా చెబుతున్నారు.
FPIలు.. మార్కెట్ క్యాప్
HDFCలో మొత్తం పెట్టుబడుల ప్రాతిపదికన విదేశీ పోర్ట్ ఫోలియో ఇన్వెస్టర్ల వాటా 2019 డిసెంబర్ నెలలో 72.75 శాతం ఉండగా మార్చి 2020 నాటికి 70.88 శాతానికి తగ్గింది. HDFC షేర్లు గత వారం 13.6 శాతం పెరిగి రూ.1,633 వద్ద క్లోజ్ అయ్యాయి. సంవత్సరం ప్రాతిపదికన 29 శాతం పడిపోయాయి. ప్రస్తుతం ఈ బ్యాంకు మార్కెట్ వ్యాల్యూ రూ.2.95 ట్రిలియన్లుగా ఉంది.
ట్విట్టర్ ట్రెండింగ్
HDFC బ్యాంకు, HDFC మ్యూచువల్ ఫండ్స్, HDFC లైఫ్ ఇన్సురెన్స్ ఉన్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో మార్కెట్లు నష్టపోయిన సమయంలో చైనా సమయం చూసి షేర్లు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తోందని నెటిజన్లు సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో ఆదివారం హెచ్డీఎఫ్సీ ట్రెండింగ్లో నిలిచింది. ధరల దిద్దుబాటు సమయంలో ఇండియన్ బ్లూచిప్ కంపెనీలను చైనా కొనుగోలు చేసే ప్రయత్నాలు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇవి సహజమేనని మరికొందరు చెబుతున్నారు. పీపుల్స్ బ్యాంకు ఆఫ్ చైనాతో పాటు HDFCలో మరికొన్ని దేశాల బ్యాంకులకు వాటాలు ఉన్నాయి. సింగపూర్, నార్జెస్ బ్యాంకు, అబు దబి ప్రభుత్వం షేర్లు ఉన్నాయి.