చైనా-అమెరికా మధ్య ఆర్థిక దూరం వాస్తవం కాదు, ఏ లాభంలేదు: డ్రాగన్ కంట్రీ కీలక వ్యాఖ్య
గత కొన్నాళ్లుగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది. 2020 ప్రారంభంలో ఇరుదేశాల మధ్య వాణిజ్య ఒప్పందం సానుకూల దిశగా కనిపించినప్పటికీ కరోనా మహమ్మారి కారణంగా మళ్లీ పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి వచ్చింది. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య యుద్దం ఇతర దేశాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. తాజాగా వాణిజ్య, ఆర్థికంగా అమెరికా వేరు పడుతోందన్న ప్రచారంపై చైనా స్పందించింది. అదే జరిగితే ఇరువైపులా నష్టమని చైనా సీనియర్ అధికారి ఒకరు శుక్రవారం అన్నారు. అది ఇరుదేశాలకు, ప్రపంచానికి... ఎవరికీ ప్రయోజనం కలిగించదన్నారు.
టాటాల నుండి రూ.1.75 లక్షల కోట్లు రావాలి: షాపూర్జీ పల్లోంజీ, TCS నుండి లక్ష కోట్లకు పైగా!
అమెరికా-చైనా బంధం బలపడాలని...
ఫైనాన్షియల్ అండ్ ఎకనమిక్ అఫైర్స్ సెంట్రల్ కమిషన్ ఆఫీస్ డిప్యూటీ డైరెక్టర్ హాన్ వెన్ష్యూ మాట్లాడారు. ఇరుదేశాల ఆర్థిక సంబంధాలు స్వేచ్ఛా వాణిజ్యంతో ఏర్పడినవన్నారు. రెండు దేశాల మధ్య ఆర్థిక బంధం ముగియాలని చాలా తక్కువ మంది కోరుకుంటున్నారని, ఈ బంధం బలపడాలని కోరుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పారు. చైనా-అమెరికాలో మధ్య ఆర్థిక దూరం నిజం కాదన్నారు
ప్రపంచానికి ఎలాంటి లాభంలేదు
పూర్తిగా విడిపోవడం ఇరుదేశాలకు నష్టదాయకమేనని, దీని వల్ల రెండు దేశాలకు ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం ఉండదని హాన్ వెన్ష్యూ అన్నారు. ఇరుదేశాల మధ్య వాణిజ్యం ప్రతి సంవత్సరం పెరుగుతోందన్నారు. అమెరికా - చైనా మధ్య దూరం ప్రపంచానికి ఎలాంటి ప్రయోజనం కలిగించదని చెప్పారు. ప్రపంచంలోని రెండు అగ్ర ఆర్థిక వ్యవస్థల మధ్య సంబంధాలపై అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. దూరం వాస్తవికమైనది కాదని, ఇది ఓడిపోయే ప్రణాళిక అన్నారు.
పెరుగుతున్న వాణిజ్య పరిమాణం
మూడో త్రైమాసికంలో అమెరికా-చైనా వాణిజ్య పరిమాణం ఏడాది ప్రాతిపదికన16 శాతం పెరిగినట్లు తెలిపారు. కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ వాణిజ్యం తీవ్రంగా దెబ్బతిన్నదని గుర్తు చేశారు. శాంతి, అభివృద్ధి, సహకారం, విన్-విన్ కొనసాగించాలన్నారు. గత రెండేళ్లుగా అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం సాగుతోంది. ఒక దేశంపై మరో దేశం సుంకాలు పెంచుకుంటున్నాయి. ఇది వాణిజ్య సంబంధాలను దెబ్బతీశాయి. ఈ సమయంలో హాన్ వెన్ష్యూ కీలక వ్యాఖ్యలు చేశారు.