Ethanol blend: చమురు దిగుమతులకు చెక్ పెట్టనున్న కేంద్రం.. ఎలాగో తెలుసా ?
Ethanol blend: పెట్రోల్, డీజిల్ నుంచి క్రమంగా జీవ ఇంధనాలు, గ్రీన్ ఎనర్జీ వైపు మారాలని మోడీ ప్రభుత్వం ఎప్పటి నుంచో ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా పెట్రోల్ లో 10 శాతం ఇథనాల్ కలుపుతోంది. కాగా ఇప్పుడు దీనిని మరింత పెంచాలని చూస్తోంది. ప్రస్తుత వినియోగానికి రెట్టింపు స్థాయిలో ఇథనాల్ ను డోప్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. మొదటి దశలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమలుచేస్తున్నారు. 15 నగరాల్లో ఎంపిక చేసిన 84 ప్రభుత్వ యాజమాన్యంలోని రిటైల్ పెట్రోల్ బంకుల ద్వారా విక్రయించనున్నారు.
1.5 నుంచి 20 శాతానికి..
సోమవారం నుంచి 20 శాతం ఇథనాల్ తో కూడిన పెట్రోల్(E-20) ను వినియోగదారులకు అందిస్తున్నారు. 2014లో 1.5 శాతంతో మొదలుపెట్టి, క్రమేపి 10 శాతానికి ఇప్పుడు 20 శాతం బ్లెండింగ్ దిశగా పురోగమిస్తున్నట్లు ప్రదాని మోడీ తెలిపారు. 2025 నాటికి దేశ వ్యాప్తంగా పూర్తిస్థాయిలో E-20 వినియోగాన్ని అందుబాటులోకి తేవాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. 2023 ఏప్రిల్ నుంచి 20 శాతానికి మారాలని లక్ష్యంగా పెట్టుకున్నా, రెండు నెలలు ముందుగానే ఈ రకం పెట్రోల్ ను ప్రధాని విడుదల చేశారు.
డిమాండ్ కు తగినట్లు ముందుగానే..
"వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థగా భారత్ ను ప్రపంచ దేశాలు గుర్తించాయి. రాబోయే రెండు దశాబ్దాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఇంధన డిమాండ్ విపరీతంగా పెరుగుతుందని అంచనాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్త డిమాండ్ లో ఇండియా వాటా 28 శాతం వరకు ఉంటుందని భావిస్తున్నాం. అందుకు సిద్ధంగా ఉండేందుకే గతేడాది జూన్ లోనూ.. అనుకున్న సమయానికి 5 నెలలు ముందుగానే 10 శాతం ఇథనాల్ కలపడం మొదలు పెట్టాం" అని చమురుశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు.
కర్భన ఉద్గారాలకు చెక్:
ప్రస్తుతం దేశీయ చమురు అవసరాల్లో 85 శాతం దిగుమతులపై ఆధారపడుతున్నాం. ప్రపంచంలో మూడవ అతిపెద్ద చమురు వినియోగదారు, దిగుమతి దారు ఇండియానే. ఇందుకోసం భారీ మొత్తంలో ఖర్చు చేస్తున్నా, కర్భన ఉద్గారాలు సైతం అధికంగా విడుదల అవుతున్నాయి. సాధారణ పెట్రోల్ తో పోలిస్తే E20ని ఉపయోగించడం వల్ల ద్విచక్ర వాహనాల్లో 50 శాతం, నాలుగు చక్రాల వాహనాల్లో దాదాపు 30 శాతం కార్బన్ మోనాక్సైడ్ ఉద్గారాలు తగ్గించవచ్చని అంచనా. హైడ్రోకార్బన్ ఉద్గారాలూ 20 శాతం తగ్గుతాయని భావిస్తున్నారు.
ఒకే దెబ్బకు రెండు పిట్టలు:
2021-22 ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు దిగుమతి కోసం మనదేశం 120 బిలియన్ డాలర్లు పైగా ఖర్చు చేసింది. ప్రస్తుత ఏడాది మొదటి 9 నెలల్లో 125 బిలియన్లు డాలర్లు వెచ్చించాం. కేవలం 10 శాతం ఇథనాల్ కలపడం వల్ల దాదాపు 54 వేల కోట్లు ఇండియాకు మిగిలినట్లు గణాంకాలు చెబుతున్నాయి. విదేశీమారక ద్రవ్య నిల్వలు ఆదా అవడంతో పాటు రైతులకూ ప్రయోజనం కలుగుతుంది. ఇథనాల్ సరఫరాదారులు దాదాపు 82 వేల కోట్లు, రైతులు 49 వేల కోట్లు ఆర్జించినట్లు లెక్కలు చెబుతున్నాయి. 318 లక్షల టన్నుల కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు తగ్గినట్లు అంచనా.