స్విగ్గి, జొమాటొ సహా: ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థకు కేంద్రం డెడ్లైన్..కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మొన్నటికి మొన్న హోటళ్లు, రెస్టారెంట్లల్లో వసూలు చేసే సర్వీస్ ఛార్జీలపై కన్నెర్ర చేసిన కేంద్రప్రభుత్వం.. ఇప్పుడు మరో అడుగు ముందుకేసింది. హోటళ్లు, రెస్టారెంట్లల్లో వసూలు చేస్తోన్న సర్వీస్ ఛార్జీలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. దీన్ని నియంత్రించే దిశగా అడుగులు వేసింది. త్వరలోనే మార్గదర్శకాలను తీసుకుని రానుంది.
ఇప్పుడు తాజాగా కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్స్ కార్యకలాపాలపై దృష్టి సారించింది. స్విగ్గి, జొమాటొ, డుంజో, ఫుడ్ పండా, ఉబేర్ ఈట్స్, బాక్స్8, ఫ్రెష్ మెనూ, ఫాసో, స్కూట్సీ.. వంటి ఆన్లైన్ ఫుడ్ డెలివరీలపై వినియోగదారుల నుంచి పెద్ద ఎత్తున అందిన ఫిర్యాదులపై స్పందించింది.
వినియోగదారుల నుంచి అందిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎలాంటి చర్యలను తీసుకున్నారో.. క్షున్నంగా వివరించాలని ఆదేశించింది. ఫిర్యాదులను పరిష్కరించడానికి ఎలాంటి ఫ్రేమ్వర్క్స్ను అనుసరిస్తున్నారో తెలియజేయాలని పేర్కొంది. దాన్ని మెరుగుపర్చుకోవడానికి తీసుకుంటున్న చర్యల గురించి వివరించాలని సూచించింది.
దీనికి డెడ్లైన్ సైతం విధించింది కేంద్ర ప్రభుత్వం. 15 రోజుల్లోగా ఈ ప్రతిపాదనలను సమర్పించాల్సి ఉంటుందని తెలిపింది. ఫిర్యాదులను పరిష్కరించడానికి అనుసరిస్తోన్న విధానాలపై త్వరలోనే ఓ సమావేశాన్ని నిర్వహిస్తామని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ తెలిపారు.
ఫుడ్ ఆపరేటర్స్ అసోసియేషన్ ప్రతినిధులతో నిర్వహించిన సమావేశం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఏడాది కాలంలో నేషనల్ కన్జూమర్ హెల్ప్లైన్కు వేల సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. స్విగ్గీ- 3,631, జొమాటో-2,828 ఫిర్యాదులు అందాయి. మిగిలిన ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ఆపరేటర్లపైనా పెద్ద ఎత్తున కంప్లైట్స్ వచ్చాయి.
డెలివరీతో పాటు ప్యాకేజింగ్ చార్జీలను వసూలు చేయడం, అదనపు పన్నులను వినియోగదారులకు తెలియజేసేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి ఆర్డరుపై 20 శాతం కమీషన్ను తీసుకుంటున్నాయని, డెలివరీ ఛార్జీలను ఇష్టానుసారంగా బిల్లింగ్లో వేస్తున్నాయంటూ ఫిర్యాదులు అందినట్లు వివరించారు.