వ్యాక్సీన్ ఖర్చు రూ.50,000 కోట్లు, అన్నయోజనతో కలిపి రూ.1.45 లక్షల కోట్ల భారం
అర్హులైన ప్రజలందరికీ కేంద్రమే ఉచితంగా కరోనా వ్యాక్సీన్ అందిస్తుందని, దేశవ్యాప్తంగా పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ జూన్ 21 నుండి ఉచితంగా టీకాను అందిస్తామని ప్రధాని నరేంద్ర మోడీ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు వ్యాక్సీన్ డోసులను రాష్ట్రాలకు పంపిస్తామన్నారు. ఆయన దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. రాష్ట్రాల వాటా అయిన 25% వ్యాక్సీన్ను కేంద్రం సేకరించి, రాష్ట్రాలకు పంపిణీ చేస్తుందన్నారు.
ఈ ప్రక్రియ పూర్తి కావడానికి కేంద్రానికి, రాష్ట్రాలకు 2 వారాల సమయం పడుతుందన్నారు. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన ద్వారా దేశవ్యాప్తంగా 80 కోట్ల మంది ప్రజలకు ఉచిత రేషన్ను దీపావళి వరకు పెంచుతున్నట్లు తెలిపారు. మోడీ ప్రకటన నేపథ్యంలో వ్యాక్సీన్కు అయ్యే ఖర్చు గురించి చర్చ సాగుతోంది.
సరిపడా నిధులు
దేశంలో పద్దెనిమిదేళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా టీకాలు వేయించే బాధ్యత కేంద్రానిదేనని ప్రధాని మోడీ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రాలపై పైసా భారం పడదన్నారు. అయితే ఈ ఉచిత వ్యాక్సీన్ విధానం వల్ల కేంద్రంపై దాదాపు రూ.50 వేలకోట్ల వరకు అదనపు భారం పడుతుందని ఆర్థికశాఖ వర్గాలు అంచనా. తమ వద్ద నిధులు ఉన్నట్లు చెప్పాయి. ఈ కొత్త వ్యాక్సీన్ విధానానికి దాదాపు రూ.50వేల కోట్ల మేర ఖర్చు కానుందని, ప్రభుత్వం వద్ద సరిపడా నిధులు ఉన్నాయని, కాబట్టి అదనపు నిధుల కోసం వెళ్లవలసిన అవసరం లేదని చెబుతున్నాయి.
ఈ మూడు వ్యాక్సీన్లు
విదేశీ వ్యాక్సీన్ కోసం ఎదురు చూడవలసిన అవసరం లేదని, ప్రస్తుతానికి దేశీయ తయారీ సంస్థలు అవసరానికి తగిన టీకాలను సరఫరా చేయగలవని చెబుతున్నాయి. మన దేశంలో భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, సీరమ్ తయారు చేసిన కోవిషీల్డ్, రష్యా స్పుత్నిక్ వ్యాక్సీన్ వినియోగానికి అనుమతి ఉందని, అయితే స్పుత్నిక్ వీ వ్యాక్సీన్ ఇంకా విస్తృతంగా అందుబాటులోకి రాలేదని తెలిపారు. మరో 30 కోట్ల వ్యాక్సీన్ డోసుల కోసం మరో దేశీయ సంస్థ బయోలాజికల్-ఈతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. ఇందుకు పదిహేను వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్గా చెల్లించింది.
మొత్తం రూ.1.45 కోట్లు
మరోవైపు, ఉచిత వ్యాక్సీన్, రేషన్ కోసం కేంద్రం దాదాపు రూ.1.45 లక్షల కోట్ల వరకు ఖర్చు చేయనుందని ఆర్థిక శాఖ వర్గాల అంచనా. పద్దెనిమిది ఏళ్లు దాటిన వారికి ఉచిత టీకాకు రూ.50వేల వరకు ఖర్చు కానుంది. కరోనా నిర్వహణ కోసం ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించిన రూ.35వేల కంటే ఇది ఎక్కువ.
ఇక ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన పథకం కింద దాదాపు 80 కోట్ల మందికి దీపావళి వరకు ప్రతి నెలా 5 కిలోల బియ్యం, కేజీ పప్పులను ఉచితంగా అందిస్తామని ప్రధాని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి దాదాపు రూ. 1.1లక్షల కోట్ల నుంచి రూ. 1.3లక్షల కోట్ల వరకు ఖర్చు కానుంది. మొత్తంగా వ్యాక్సీన్, రేషన్ కలిపి దాదాపు రూ. 1.45లక్షల కోట్ల మేర కేంద్రంపై అదనపు భారం పడనుంది.