దేశంలో మళ్లీ ఫైజర్: బెట్టు వీడి..మెట్టు దిగిన మోడీ సర్కార్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ రోజువారీ తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఇదివరకు నాలుగు లక్షలకు పైగా నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య.. ఇటీవలి కాలంలో మూడున్నర లక్షలకు పరిమితమైంది. పాజిటివిటీ రేటు క్రమంగా నేల చూపులు చూస్తోంది. అయినప్పటికీ- మరణాల్లో మాత్రం అదే తీవ్రత కొనసాగుతోంది. రోజువారీ కరోనా మరణాలు మూడున్నర నుంచి నాలుగు వేలకు తగ్గట్లేదు. అదే బెంచ్ మార్క్తో కరోనా మరణాల్లో ఉధృతి నెలకొంటూనే ఉంది. తాజా బులెటిన్ ప్రకారం..దేశవ్యాప్తంగా 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,26,098 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 3,890 మరణాలు రికార్డయ్యాయి.
Akshaya Tritiya: పదేళ్ల పసిడి రేట్ల ప్రస్థానం ఇలా: పడుతూ లేస్తూ..స్థిరంగా:
టీకాలు దొరక్క..
ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల లోటు.. యాక్టివ్ కేసులకు అనుగుణంగా ఆక్సిజన్, పడకలు అందుబాటులో లేకపోవడం, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరత వంటివి మరణాలు రేటు పెరగడానికి కారణమౌతోందనేది బహిరంగ రహస్యంగా మారింది. ఈ పరిణామాల మధ్య దేశంలో కొనసాగుతోన్న వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా నెమ్మదిస్తోంది. మూడోదశ వ్యాక్సినేషన్ను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినపప్టికీ.. టీకాల కొరత వెంటాడుతోంది. ఫలితంగా- అనేక రాష్ట్రాలు మూడోదశ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నాయి. టీకాల లభ్యత ఉన్నంత మేర కొన్ని రాష్ట్రాలు మూడోదశను కొనసాగిస్తోన్నాయి.
త్వరలో ఫైజర్ కూడా..
వ్యాక్సినేషన్ కోసం వినియోగిస్తోన్న కోవిషీల్డ్, కోవ్యాక్సిన్ టీకాలకు అదనంగా స్పుత్నిక్ వీ కూడా వచ్చి చేరింది. ఒకట్రెండు రోజుల్లో దీన్ని వ్యాక్సినేషన్ కార్యక్రమంలోకి పూర్తిస్థాయిలో అనుమతించబోతోంది కేంద్ర ప్రభుత్వం. దీనికితోడు- అమెరికాకు చెందిన ఫైజర్ వ్యాక్సిన్ను కూడా అనుమతి ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఆ కంపెనీకి షరతులతో కూడిన నష్ట పరిహారాన్ని అందించడానికి కేంద్రం అంగీకరించిందని బిజినెస్ న్యూస్ పోర్టల్ ది ఎకనమిక్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. షరతులతో ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అనుమతిస్తామంటూ కేంద్ర ప్రభుత్వ అధికారులను తన కథనంలో ఉటంకించిందా పోర్టల్.
అతి కొద్దిరోజుల్లోనే అందుబాటులోకి..
అతి కొద్దిరోజుల్లోనే ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి కేంద్రం ఆమోదముద్ర వేసే అవకాశాలు లేకపోలేదని అధికారులు వెల్లడించినట్లు తెలిపింది. ఇదివరకు ఫైజర్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఆల్బర్ట్ బౌర్లా సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించిన విషయం తెలిసిందే. భారత్లో తమ వ్యాక్సిన్ వినియోగానికి అవసరమైన అనుమతుల కోసం ఆ దేశ ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిజానికి- అన్నీ అనుకున్నట్టుగా జరిగి ఉంటే ఈ పాటికి ఫైజర్ వ్యాక్సిన్ భారత్లో ఎంట్రీ ఇచ్చి ఉండేదే.
ఫైజర్ ఎఫీషియన్సీపై
అదనపు సమాచారం కావాలంటూ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఇచ్చిన సూచనలకు ఫైజర్ అప్పట్లో అంగీకరించలేదు. డీసీజీఐకి దాఖలు చేసుకున్న తన దరఖాస్తులను సైతం వెనక్కి తీసుకుంది. అమెరికా ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమం కోసం ఫైజర్ టీకానే పెద్ద ఎత్తున వినియోగిస్తోంది. మోడెర్నా సైతం వినియోగంలో ఉన్నప్పటికీ.. మెజారిటీ వాటా ఫైజర్దే. దాని ఎఫీషీయన్సీ కూడా అధికంగా ఉంటోంది. డబుల్ డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వారు ఇక మాస్కుల్లేకుండా స్వేచ్ఛగా తిరగొచ్చని కూడా అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ ప్రకటించారంటే.. దాని సామర్థ్యంపై ఉన్న విశ్వాసమే.