Vegetable oils: గుడ్న్యూస్: ఈ మూడు రకాల వంటనూనె ధరలు భారీగా తగ్గుతాయ్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. ఇదివరకటి పరిస్థితులతో పోల్చుకుంటే.. దాని తీవ్రత చాలా తగ్గింది. రోజూ 30 నుంచి 40 వేలకు లోపే కొత్త కేసులు నమోదవుతున్నాయి. కరోనా వైరస్ మిగిల్చిన సంక్షోభ పరిస్థితుల ప్రభావం మాత్రం కొనసాగుతూనే ఉంది. కరోనా వైరస్ వల్ల విధించిన లాక్డౌన్ తరహా వాతావరణం లక్షలాది మందిని రోడ్డున పడేసింది. ఉపాధిని కోల్పోయేలా చేసింది. నిరుద్యోగులుగా చేసింది. అలాంటి స్థితిలో నిత్యావసర సరుకుల ధరలు ఆకాశాన్నంటేలా పెరగడం అదనపు భారాన్ని మోపింది.
ప్రత్యేకించి వంటనూనె ధరలు ఏ స్థాయిలో పెరిగాయో ప్రత్యేకించి చెప్పుకోనక్కర్లేదు. వంట చేసుకునే వీలులేకుండా తయారయ్యాయి. కరోనా వైరస్ ఓ కారణం కాగా..వంట నూనెలు ఉత్పత్తి చేసే దేశాలు విధించిన అధిక పన్నులు మరో కారణం అయ్యాయి. వంట నూనెల ధరలు భారీగా పెరిగాయి. కొన్ని నెలల వ్యవధిలో అన్ని రకాలకు చెందిన వంట నూనెలన్నీ అడ్డు అదుపు లేకుండా పెరిగాయి. వాటి ధరలు రెట్టింపు అయ్యాయి.
ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం14 మిలియన్ టన్నులకు పైగా వంట నూనెను దిగుమతి చేసుకుంటోంది. అందులో పామాయిల్ వాటా అధికం. ఇండోనేషియా, మలేషియాల నుంచి పామాయిల్ దిగుమతి ఎక్కువగా ఉంటుంది. ఈ రెండు దేశాల తరువాత థాయ్లాండ్, కొలంబియా, ఉన్నాయి. క్రూడాయిల్ తరహాలోనే కేంద్ర ప్రభుత్వం వంట నూనెలపై కూడా దిగుమతి సుంకం విధిస్తుంది. ఈ పన్నుల ద్వారా భారీ ఆదాయాన్ని చవి చూస్తోంది.
తాజాగా- వంటనూనెలపై విధించిన దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం తాజాగా తగ్గించింది. కొన్ని రకాలకు చెందిన వంటనూనెలపై మాత్రమే ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దక్షిణాసియా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వంటనూనెలకు మాత్రమే ఈ సుంకం తగ్గింపును వర్తింపజేసింది. బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ను తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ నోటిఫికేషన్ను విడుదల చేసింది. తాజాగా తీసుకున్న ఈ నిర్ణయంతో దక్షిణాసియా నుంచి దిగుమతి చేసుకుంటోన్న వంటనూనెల ధరలు తగ్గుతాయి.
సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్, పామాయిల్ దిగుమతులపై ఈ సుంకాన్ని తగ్గించింది. ముడి సోయా ఆయిల్ దిగుమతిపై ఇప్పటిదాకా కేంద్ర ప్రభుత్వం 10 శాతం మేర సుంకాన్ని విధించేది. దీన్ని 2.5 శాతానికి తగ్గించింది. అలాగే- క్రూడ్ సన్ఫ్లవర్ ఆయిల్పై 7.5 శాతం మేర దిగుమతి సుంకాన్ని వసూలు చేస్తోండగా.. దీన్ని కూడా 2.5 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ఈ మూడు రకాలకు చెందిన వంటనూనెల బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్ ఇప్పటిదాకా 37.5 శాతం ఉండగా.. దాన్ని 32.5 శాతానికి తగ్గించింది.
బేస్ ఇంపోర్ట్ ట్యాక్స్తో పాటు ఇతరత్రా పన్నులను కూడా తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. దీనివల్ల మొత్తంగా ఆ మూడు రకాలకు చెందిన వంటనూనెలపై వసూలు చేస్తోన్న పన్ను 24.75 శాతానికి తగ్గినట్టయింది. పామాయిల్ను ఇండోనేషియా, మలేసియా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోండగా.. సోయా, సన్ఫ్లవర్ ఆయిల్ దిగుమతులు అర్జెంటీనా, బ్రెజిల్, ఉక్రెయిన్, రష్యాల నుంచి అధికంగా ఉంటోంది. కరోనా సమయంలో భారీగా ఉత్పత్తి తగ్గడం వల్ల వాటి ధరలు పెరిగాయనేది మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తోన్నాయి. తాజా తగ్గింపుతో పామాయిల్, సోయా ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ ధరలు తగ్గడానికి అవకాశం కల్పించినట్టయిందని చెబుతున్నాయి.