Small saving Schemes: మళ్లీ నిరాశ పరిచిన కేంద్రం.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు..
Small saving Schemes: స్టాక్ మార్కెట్లలో అస్తిరత, క్రిప్టోకరెన్సీల పెట్టుబడిదారుల పరిస్థితి దారుణంగా ఉన్నందున అనేక మంది సాంప్రదాయ పెట్టుబడి మార్గాల వైపు చూస్తున్నారు. అటువంటి పరిస్థితిలో.. పెట్టుబడిదారులపై రాబడి గురించి చిన్న ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత సంవత్సర కాలంలో ప్రభుత్వ బాండ్లపై రాబడులు పుంజుకున్నప్పటికీ.. చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు కూడా పెరుగుతాయని అందరూ ఆశించారు. ప్రస్తుతం ఉన్న ద్రవ్యోల్బణం సమయంలో రాబడి చాలా ముఖ్యమైన అంశం. ఈ సమయంలోనే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ సేవింగ్ సర్టిఫికేట్, సుకన్య సమృద్ధి యోజన విషయంలో కూడా అదే జరుగుతుందని అందరూ ఆశించారు. కానీ కేంద్రం ఈ విషయంలో మెుండి చేయి చూపించింది.
ప్రభుత్వం ప్రకటన:
ఎన్ఎస్సీ, పీపీఎఫ్ తో పాటు ఇతర చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లను స్థిరంగానే కొనసాగించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం నిన్న వెల్లడించింది. 2020-21 మొదటి క్వార్టర్ నుంచి ఈ చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లలో ఎటువంటి మార్పు లేదు. ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక నోటిఫికేషన్లో.. "చిన్న పొదుపు పథకాల వడ్డీ రేట్లు జూలై 1, 2022 నుంచి ప్రారంభమై సెప్టెంబర్ 30, 2022తో ముగిసే రెండవ క్వార్టర్ లోనూ పాత రేట్లే ఉంచబడ్డాయి. ఈ రేట్లు మొదటి త్రైమాసికానికి ప్రకటించిన స్థాయిలోనే ఉంటాయి" అని పేర్కొంది.
వడ్డీ ఫార్ములా..
చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు పెరుగుతాయని ప్రజలు ఊహించారు. నిజానికి చిన్న పొదుపు పథకాల వడ్డీకి సంబంధించి గోపీనాథ్ కమిటీ 2011లో ఫార్ములాను సూచించింది. ప్రభుత్వ బాండ్ల రాబడి పెరిగితే చిన్న మొత్తాల పొదుపు పథకాలపై కూడా వడ్డీ పెంచాలని ఆ ఫార్ములాలో సూచించింది. ఈ పొదుపు పథకాల వడ్డీని ఏ కాలంలోనైనా ప్రభుత్వ సెక్యూరిటీల సగటు రాబడి కంటే 0.25 నుంచి 1 శాతం ఎక్కువగా ఉంచాలని కమిటీ సిఫార్సు చేసింది. కానీ ఇప్పుడు వాటిని పాటిస్తున్నట్లు కనిపించటం లేదు.
పెరుగుతున్న ఆసక్తి..
గత ఒక సంవత్సరంలో బెంచ్మార్క్ 10 సంవత్సరాల బాండ్ ఈల్డ్ 6.04 శాతం నుంచి 7.46 శాతానికి పెరిగింది. ఏప్రిల్-జూన్ క్వార్టర్ లో దీని సగటు 7.31 శాతంగా ఉంది. గోపీనాథ్ కమిటీ సిఫారసుల మేరకు వడ్డీ రేట్లు నిర్ణయిస్తే.. పీపీఎఫ్పై వడ్డీ 7.81 శాతానికి పెరిగి ఉండేది. అయితే.. ఇప్పుడు కూడా పీపీఎఫ్పై వడ్డీ 7.10 శాతం చొప్పున మాత్రమే కొనసాగుతోంది. అదేవిధంగా.. సుకన్య సమృద్ధి యోజన (SSY), సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీమ్ల వడ్డీ రేట్లు 8 శాతానికి మించి పెరుగుతాయని అంచనా వేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మాత్రం మార్పులు చేయలేదు.