హిందూస్తాన్ జింక్లో ప్రభుత్వ వాటా విక్రయం, రూ.38,000 కోట్ల సమీకరణ
హిందూస్తాన్ జింగ్(HZL)లో ప్రభుత్వానికి ఉన్న 29.5శాతం వాటాను విక్రయించాలనే ప్రతిపాదనకు ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటైన కేంద్ర మంత్రివర్గ సంఘం (CCEA) ఆమోదం తెలిపింది. 29.5 శాతం వాటాకు సమానమైన 124.96 కోట్ల షేర్లను విక్రయించడం ద్వారా ప్రభుత్వానికి రూ.38,000 కోట్లు సమకూరే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా రూ.65000 కోట్లు సమీకరించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు ప్రభుత్వానికి ఇది ఉపయోగపడుతుంది.
హిందూస్తాన్ జింక్ విక్రయం వార్త నేపథ్యంలో బుధవారం ఈ స్టాక్ 3.14 శాతం లాభపడి రూ.305.05 వద్ద ముగిసింది. అయితే నేడు మాత్రం అంతకుమించి నష్టపోయింది. ఈ రోజు మధ్యాహ్నం సమయానికి 4.50 శాతం నష్టపోయి రూ.300 వద్ద ట్రేడ్ అయింది. ప్రభుత్వం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్టుబడుల ఉపసంహరణ, వ్యూహాత్మక వాటాల విక్రయం ద్వారా రూ.65,000 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
2002 వరకు హిందూస్తాన్ జింక్ ప్రభుత్వ యాజమాన్యంలో ఉంది. 2002 ఏప్రిల్ నెలలో 26 శాతం వాటాను ప్రభుత్వం స్టెరిలైట్ ఆపర్చునిటీస్ అండ్ వెంచర్స్కు రూ.445 కోట్లకు విక్రయించింది. ఆ తర్వాత మార్కెట్ నుండి 20 శాతం వాటాను, 18.92 శాతం వాటాను ప్రభుత్వం నుండి 2003లో వేదాంత గ్రూప్ కొనుగోలు చేసి తన మొత్తం వాటాను 65.92 శాతానికి పెంచుకుంది. దీంతో యాజమాన్య నియంత్రణాధికారం సాధించింది. హిందూస్తాన్ జింక్కు ప్రస్తుతం అనిల్ అగర్వాల్ నేతృత్వంలోని వేదాంత లిమిటెడ్ ప్రమోటర్గా ఉంది. హిందూస్తాన్ జింక్లో 5 శాతం వాటాను వేదాంత కొనుగోలు చేసేందుకు సిద్ధపడింది.