టిక్టాక్ భారత్లోకి రీఎంట్రీ ఇస్తుందా... కీలక నిర్ణయాల దిశగా ఆ సంస్థ...
ఇటీవల భారత్లో నిషేధానికి గురైన చైనీస్ యాప్ టిక్టాక్ తమ కార్పోరేట్ స్ట్రక్చర్ను మార్చే యోచనలో ఉంది. టిక్టాక్ ఎదుగుదలకు 'చైనా' ట్యాగ్ అడ్డురావద్దని దాని మాతృసంస్థ బైట్డ్యాన్స్ భావిస్తోంది. ఇందుకోసం టిక్టాక్ హెడ్ క్వార్టర్స్ను చైనా నుంచి వేరే దేశానికి మార్చాలని భావిస్తోంది. యాప్ కార్యకలాపాలకు చైనాతో ఎలాంటి సంబంధం లేకుండా చేయగలిగితే గ్లోబల్ మార్కెట్లో అడ్డంకులు తొలగిపోతాయని భావిస్తోంది. ఈ మేరకు కొత్త మేనేజ్మెంట్ బోర్డును కూడా ఏర్పాటు చేసేందుకు బైట్డ్యాన్స్ సీనియర్ ఎగ్జిక్యూటివ్స్ చర్చలు జరుపుతున్నారని వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది.
'టిక్టాక్ను ముందుకు తీసుకెళ్లేందుకు సరైన మార్గం కోసం చూస్తున్నాం. ఈ క్రమంలో బైట్డ్యాన్స్ సంస్థ టిక్టాక్ కార్పోరేట్ స్ట్రక్చర్లో మార్పులపై దృష్టి పెట్టింది. యూజర్ల ప్రైవసీ,డేటా రక్షణకు మేము ఎప్పటికీ కట్టుబడి ఉంటాం. మా లక్ష్యం యూజర్స్లో క్రియేటివిని ప్రోత్సహించడం,వాళ్లకు సంతోషం కలిగించడం.' అని టిక్టాక్ ఒక ప్రకటనలో వెల్లడించింది. యూజర్స్,ఉద్యోగులు,ఆర్టిస్టులు,క్రియేటర్స్,భాగస్వాములు,పాలసీ మేకర్స్.. వీరందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని టిక్టాక్ నిర్ణయాలు ఉంటాయని సంస్థ తెలిపింది.
భారత్ నిషేధం విధించిన 59 చైనా యాప్స్లో బైట్డ్యాన్స్కి చెందిన టిక్టాక్,హలో ఉన్న సంగతి తెలిసిందే. టిక్టాక్కి ఒక్క భారత్లోనే 200 మిలియన్ల యూజర్స్ ఉన్నారు. హలో యాప్కి కూడా 50 మిలియన్ల పైనే యూజర్స్ ఉన్నారు. భారత్లో టిక్టాక్పై నిషేధం తర్వాత అమెరికాలోనూ దాన్ని నిషేధించాలన్న డిమాండ్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లో నిలదొక్కుకోవాలంటే చైనా ముద్రను తొలగించుకోవాలని ఆ సంస్థ భావిస్తోంది. ఈ నేపథ్యంలో మున్ముందు టిక్టాక్ కార్పోరేట్ స్ట్రక్చర్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉంది.