సంపాదనలో జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ను దాటిన గౌతమ్ అదానీ
ఇండియన్ టైకూన్ గౌతమ్ అదానీ సంపద 2021లో ఇప్పటి వరకు ప్రపంచ కుబేరుల కంటే ఎక్కువగా పెరిగింది. అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా ఇంక్ అధినేత ఎలాన్ మస్క్ ఆదాయం కంటే జంప్ కావడం గమనార్హం. అదానీ గ్రూప్కు చెందిన వివిధ రంగాల షేర్లు ఇటీవల పుంజుకున్నాయి. దీంతో 2021లో అతి తక్కువ సమయంలో ఎక్కువ సంపదను ఆర్జించిన వ్యక్తిగా నిలిచారు అదానీ. ఈ కొత్త ఏడాదిలో సంపాదనలో మస్క్, బెజోస్ కంటే ముందున్నారు.
16.2 బిలియన్ డాలర్లుగా ఉన్న అదానీ నికర ఆస్తి వ్యాల్యూ 2021లో 50 బిలియన్ డాలర్లకు చేరుకున్నట్లు బ్లూమ్బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ పేర్కొంది. ఆసియా కుబేరుడు, రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ సంపద ఇదే సమయంలో 8.1 బిలియన్ డాలర్లు పెరిగింది. అదానీ గ్రూప్కు చెందిన షేర్లు ఒకటి మినహా అన్నీ కనీసం 50 శాతం మేర దూసుకెళ్లడంతో ఈ ఏడాది అదానీ సంపద పెరిగింది.
అదానీ పోర్ట్స్, ఎయిర్ పోర్ట్, కోల్ మైన్స్, పవర్ ప్లాంట్స్ వంటి వివిధ రంగాల్లో వ్యాపారాలు ఉన్నాయి. ఇటీవల 1 గిగావాట్ సామర్థ్యం కలిగిన డేటా సెంటర్ను దేశంలో ఏర్పాటు చేసేందుకు అదానీ ఎంటర్ ప్రైజెస్ ముందుకు వచ్చింది. తద్వారా టెక్నాలజీ రంగంలో అడుగు పెట్టింది. ఈ ఒక్క ఏడాదిలో అదానీ టోటల్ గ్యాస్ లిమిటెడ్ షేర్లు 96 శాతం మేర పెరిగాయి.
అదానీ ఎంటర్ ప్రైజెస్ స్టాక్స్ 90 శాతం, అదానీ ట్రాన్స్మిషన్ 79 శాతం మేర దూసుకెళ్లాయి. అదానీ పవర్ లిమిటెడ్, అదానీ పోర్ట్స్ & స్పెషల్ ఎకనమిక్ జోన్స్ లిమిటెడ్ స్టాక్స్ 52 శాతం రాణించాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ మాత్రమే 12 శాతం వృద్ధి చెందింది. గత ఏడాది ఈ షేర్ 500 శాతం పెరిగింది.