టిక్టాక్ లాంటి యాప్ తయారీ కష్టం కాదు కానీ, రెవెన్యూ లేకున్నా చైనా యాప్స్ వెనుక..: నీలేకని
59 చైనీస్ యాప్స్ను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన అనంతరం భారత్లో అలాంటి స్టార్టప్స్పై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. మనమే తయారు చేయాలనే ఆలోచనతో పాటు ఇప్పటికే టిక్ టాక్ వంటి వాటికి ప్రత్యామ్నాయాలు వచ్చాయి. ఇలాంటి తరుణంలో ఇన్ఫోసిస్ సహవ్యవస్థాపకులు నందన్ నీలేకని కీలక వ్యాఖ్యలు చేశారు. టిక్ టాక్ తరహా యాప్స్ తయారీ పెద్ద ఇబ్బంది కాదని, కానీ అలాంటి బలమైన వ్యాపార నమూనా అమలు సవాల్ అన్నారు.
మన రూల్స్ అన్నీ ఔట్ డేటెడ్, రెండేళ్లలో 60%: చైనాకు వ్యతిరేకంగా గడ్కరీ
ఇది సవాల్
భారత్ పెద్ద డిజిటల్ అడ్వర్టయిజింగ్ మార్కెట్ కాదని, టిక్ టాక్ వంటి యాప్స్ ఎక్కువగా ప్రకటనల పైనే ఆధారపడి ఉన్నాయని నీలేకని చెప్పారు. మనం కచ్చితంగా టిక్ టాక్ సహా బ్యాన్ చేసిన ఇతర యాప్స్ వంటి వాటిని తయారు చేసుకోగలమని, కానీ ఇక్కడ అసలు సవాల్ ఏమిటంటే ఈ అప్లికేషన్స్ బిజినెస్ మోడల్ను అర్థం చేసుకోవడమే అన్నారు. ఫేస్బుక్, గూగుల్, టిక్ టాక్ వంటి వాటికి ప్రధాన ఆదాయవనరు ప్రకటనలు అన్నారు. గత ఏడాది బైట్ డ్యాన్స్ ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్ డాలర్ల లాభంతో 17 బిలియన్ డాలర్లను ఆర్జించిందన్నారు. ప్రధానంగా చైనా, అమెరికా మార్కెట్ ద్వారా వచ్చిందని చెప్పారు.
రెవెన్యూ తక్కువ.. అసలు కారణం యూజర్ బేస్
చైనా, అమెరికా వలె భారత్ పెద్ద అడ్వర్టయిజింగ్ మార్కెట్ కాదని నీలేకని చెప్పారు. టీవీ, ప్రింట్, డీజిటల్ మాధ్యమాల ప్రకటనల ఖర్చు 10 నుండి 12 బిలియన్ డాలర్లు అని చెప్పారు. ఇందులో డీజిటల్ స్పేస్కు ప్రకటనల ఆదాయం 2 నుండి 3 బిలియన్ డాలర్లు ఉందని చెప్పారు. కాబట్టి మన దేశంలో ఈ ఉత్పత్తులు చాలా వరకు ఆదాయాన్ని ఆర్జించలేవని, కానీ వారికి (చైనా సంస్థలకు) వ్యూహాత్మక కారణాలు ఉన్నాయని, అది యూజర్ బేస్ను నిర్మించాలని భావించడం అన్నారు. ప్రస్తుతం యూజర్లను పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో డబ్బును ఆర్జించవచ్చునని చెప్పారు.
చైనా, అమెరికా ఆదాయంతో..
చైనా, అమెరికా వంటి దేశాలలో తమ యాప్స్కు వచ్చే ఆదాయం ద్వారా భారత్ వంటి దేశాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయని, భవిష్యత్తులో మంచి ఆర్జన కోసం ఇప్పుడు ఖర్చులు చేస్తున్నాయని అభిప్రాయపడ్డారు. వాట్సాప్ వంటి యాప్స్కు మన దేశంలో400 మిలియన్ల మంది యూజర్లు ఉండవచ్చునని, దాని నుండి ఎక్కువ ఆదాయం రావాల్సిన అవసరం లేదన్నారు. భారత ఉత్పత్తులు అయితే ఇతర దేశాల నుండి రెవెన్యూ వచ్చే అవకాశం లేదన్నారు. కాబట్టి సాంకేతిక సమస్య కంటే బిజినెస్ మోడల్ పెద్ద సవాల్ అని భావిస్తున్నట్లు చెప్పారు. ప్రకటన మార్కెట్ను ఎలా పెంచగలమన్నారు.