Budget 2022: ఉద్యోగులు ఈ బడ్జెట్లో ఏం కోరుకుంటున్నారు?
వచ్చే బడ్జెట్సో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ నుండి భారత శాలరైడ్ క్లాస్ ఎన్నో అంచనాలు పెట్టుకుంది. నిర్మలమ్మ 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ను ఫిబ్రవరి 1న లోకసభలో ప్రవేశ పెడుతున్నారు. గత ఏడాది బడ్జెట్ సందర్భంగా పన్నుకు సంబంధించి పెద్ద ఊరట దక్కలేదు. ఈ నేపథ్యంలో ఇన్కం ట్యాక్స్ పేయర్స్ ఈ బడ్జెట్ పైన ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి, ఆదాయపు పన్ను, పీపీఎఫ్ పెట్టుబడులు, వర్క్ ఫ్రమ్ హోమ్ అలవెన్స్, హోమ్ లోన్ బయ్యర్స్ కోసం వెసులుబాటు వంటి ఎన్నో ఆశలు ఉన్నాయి.
స్టాండర్డ్ డిడక్షన్ పెంపు
ప్రస్తుత కరోనా క్లిష్ట పరిస్థితుల్లో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్ష వరకు పెంచాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. నిర్మలమ్మ దీనిని 30 శాతం నుండి 35 శాతానికి పెంచవచ్చునని భావిస్తున్నారు. కరోనా నేపథ్యంలో ఖర్చులు పెరిగాయి. కాబట్టి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలని కోరుతున్నారు. 2019లో రూ.40వేలుగా ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పీయూష్ గోయల్ రూ.50వేలకు పెంచారు. ఇప్పుడు కనీసం రూ.75వేలకు పెంచాలని కోరుతున్నారు.
రూ.5 లక్షలకు కాస్త దాటితే..
రూ.5 లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించవలసిన అవసరం లేదు. కానీ రూ.5 లక్షలు దాటితే మాత్రం పన్ను చెల్లించాలి. వార్షిక ఆదాయం రూ.5లక్షలు దాటితే రూ.13వేల పన్ను చెల్లించవలసి ఉంటుంది. వచ్చే బడ్జెట్లో రూ.5 లక్షల కంటే కాస్త ఆదాయం ఎక్కువ ఉన్నవారు (ఉదాహరణకు రూ.5,00,100) కూడా పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా బడ్జెట్లో ప్రొవిజన్స్ తీసుకు రావాలని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ మాట.
కేంద్రం కూడా సానుకూలంగా ఉందని సమాచారం. అప్పుడు రూ.5 లక్షల కంటే కొద్దిగా ఆదాయం పెరిగితే వారు రూ.13 వేల పన్ను చెల్లింపు చేయకుండా ఉండేలా ఊరట దక్కే అవకాశం కనిపిస్తోంది.
వర్క్ ఫ్రమ్ హోమ్...
కరోనా కారణంగా అన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి. కాబట్టి ఉద్యోగులకు ఇంటి వద్ద ఖర్చులు పెరిగాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల మొబైల్ బిల్లు, టెలిఫోన్ బిల్లు వంటి యుటిలిటీ ఛార్జీలు పెరుగుతున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ సెటప్ కోసం అదనపు ఖర్చు. వీటిని పరిగణలోకి తీసుకొని వర్క్ ఫ్రమ్ హోంకు అదనపు డిడక్షన్ రూ.50వేలు ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే, ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 16 కింద ప్రస్తుతం ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని రూ.50వేల నుండి రూ.1 లక్షకు పెంచాలని కోరుతున్నారు.
పీఎఫ్ రెండింతలు
ఉద్యోగుల నుండి ప్రొఫెషనల్స్ వరకు పీపీఎఫ్ ఇన్వెస్ట్మెంట్ పరిమితిని డబుల్ చేయాలని కోరుతున్నారు. ఉద్యోగుల కంటే వ్యాపారం చేసేవారికి, ప్రొఫెషనల్స్కు ఆదాయపు పన్ను సేవింగ్స్కు పీఎఫ్ ఉత్తమ మార్గం. సెక్షన్ 80సీ కింద వచ్చే మినహాయింపు రూ.1.5 లక్షలుగా ఉంది. దీనిని రూ.3 లక్షలు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది.