అగ్రిసెస్ వేసినా పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవు, ఎందుకంటే: నిర్మలా సీతారామన్ క్లారిటీ
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు కొద్ది రోజులుగా పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి చివరి వారం నుండి డిమాండ్ పడిపోయి అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు పడిపోయాయి. ఆ తర్వాత ఇటీవలి కాలంలో ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. దీంతో దేశీయ చమురురంగ కంపెనీలు కూడా అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా ధరలను సవరిస్తున్నాయి.
అయితే తాజాగా 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను నిర్మలా సీతారామన్ ప్రకటించిన బడ్జెట్లో పెట్రోల్, డీజిల్ పైన కేంద్రం అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ధరలు మరింత పెరుగుతాయని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీంతో నిర్మలమ్మ క్లారిటీ ఇచ్చారు.
బడ్జెట్కు సంబంధించిన మరిన్ని కథనాలు.. చదవండి
అగ్రిసెస్
పెట్రోల్, డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం అగ్రి ఇన్ఫ్రా సెస్ విధించింది. పెట్రోల్పై రూ.2.50, డీజిల్పై రూ.4 అగ్రి ఇన్ఫ్రా సెస్ విధిస్తున్నట్టు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం సందర్భంగా తెలిపారు. ఈ సెస్ రేపటి నుంచే అమలులోకి వస్తోంది. దీంతో ధరలు పెరుగుతాయని భావిస్తున్నారు. కానీ అగ్రి ఇన్ఫ్రా సెస్తో చమురు ఉత్పత్తుల ధరల్లో మార్పు ఏమీ ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. దీనికి సంబంధించి నిర్మలా సీతారామన్ స్పష్టతనిచ్చారు.
అందుకే ధరలు పెరగవు...
అగ్రిసెస్ వల్ల పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవని నిర్మలా సీతారామన్ మధ్యాహ్నం మీడియా సమావేశంలో వెల్లడించారు. అగ్రికల్చరల్ సెస్ వేసినా ధరలు మారవన్నారు. 4 శాతం అగ్రిసెస్ వేసినా ఎక్సైజ్ సుంకాల్లో మినహాయింపు ఇస్తున్నట్లు తెలిపారు. దీంతో పెట్రోల్ ఉత్పత్తులు యథాతథంగా ఉంటాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగవన్నారు. కేంద్రానికి వచ్చే సుంకాలను మినహాయించి ఈ సెస్ వేస్తున్నట్లు తెలిపారు. కాబట్టి అగ్రిసెస్ వల్ల వినియోగదారుడికి అందే ధరల్లో మార్పు ఉండదన్నారు. వ్యవసాయం కోసం ప్రత్యేక నిధిని కేటాయించేందుకే అగ్రిసెస్ అన్నారు.
వీటిపై అధిక ఖర్చు
నిర్మలమ్మ ఇంకా మాట్లాడుతూ... బడ్జెట్లో మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యమిచ్చినట్లు తెలిపారు. వైద్య, ఆరోగ్య రంగాలపై ఎక్కువగా దృష్టి సారించామన్నారు. కరోనా సమయంలో వైద్య పరీక్షలకు సౌకర్యాలు లేక ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయని, అందుకే ల్యాబ్స్, వైరాలజీ సంస్థల ద్వారా మౌలిక వసతులు కల్పించనున్నట్లు వెల్లడించారు. రోడ్లు, బ్రిడ్జిలు, విద్యుదుత్పత్తి, ఓడ రేవులపై అధికంగా ఖర్చు చేస్తామన్నారు.