Budget 2020: చైనా కంటే వెనకబడిన భారత్
అమెరికా-చైనా మధ్య వాణిజ్య యుద్ధం నడిచిన సమయంలో అక్కడి నుంచి పలు కంపెనీలు ఇతర దేశాలకు క్యూ కట్టాయి. వీటిని ఆకర్షించడంలో భారత్ అంతగా సఫలం కాలేదు. ఇప్పుడు అగ్రదేశాల మధ్య సానుకూల ధోరణి ఉంది. కాబట్టి ఇక మరింత కష్టమే. ప్రస్తుత పరిస్థితులు విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించేలా లేవని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఆ దిశగా ఈ బడ్జెట్లో చర్యలు ఉండాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
పెట్టుబడుల పెరుగుదల తగ్గుతోంది..
2018లో చైనా 107 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులను ఆకర్షించింది. భారత్ మాత్రం 55 బిలియన్ డాలర్లకే పరిమితమైంది. 2014-15లో జీడీపీ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అంతకుముందు ఏడాది కంటే 25 శాతం పెరిగాయి. 2018-19 నాటికి ఈ పెరుగుదల 2 శాతంగా మాత్రమే ఉంది. గత ఏడాది సెప్టెంబర్ నెలలో కార్పోరేట్ ట్యాక్స్ తగ్గించిన నేపథ్యంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో భారత్ 63వ ర్యాంకుకు ఎగబాకింది. అయినా పెట్టుబడులు ఆశించిన మేర రావడం లేదు. చైనా కంటే వెనుకబడి ఉన్నాం. దీనిని అధిగమించాల్సి ఉంది.
ఎగుమతుల ప్రోత్సాహం కోసం..
మన ఎగుమతులను కొన్నింటిని చైనా, ఐరోపా దేశాలు అడ్డుకుంటున్నాయి. ఏ దేశానికి ఆ దేశం... ఇతర దేశాల ఉత్పత్తులు సాధ్యమైనంతగా తమ వద్దకు రాకుండా అడ్డుకుంటున్నాయి. ఈ కారణంగా మనకు ఎగుమతులు తగ్గాయి. మోడీ ప్రభుత్వం కూడా మేకిన్ ఇండియా అంటూ దూసుకెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఎగుమతులపై ప్రభావం చూపే పోటీతత్వ ఇండెక్స్లో భారత్ 10 స్థానాలు దిగజారి 68గా ఉంది. ఈ తరుణంలో ఎగుమతుల ప్రోత్సాహానికి ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.
ఆదాయం కంటే ఖర్చు పెరిగింది
2025 నాటికి 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదగాలని మోడీ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది సాధించాలంటే 9 శాతం నుంచి 11 శాతం వృద్ధిని నమోదు చేయాలి. ప్రస్తుతం 5 శాతాంగా మాత్రమే ఉంది. గత ఆరేళ్లుగా ప్రభుత్వ ఆదాయంలో 11 శాతానికి పైగా వృద్ధి నమోదయింది. అదే సమయంలో ప్రభుత్వ వ్యయం కూడా పెరిగింది. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా పెరిగింది. దీనికి తోడు కార్పోరేట్, ఆదాయపు పన్ను, జీఎస్టీ వసూళ్లు తగ్గాయి. పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యానికి అందనంత దూరంలో ఉంది.