Budget 2020: రైతులకు ఆదాయ మార్గాలి ఇలా.., మహిళలకు ధాన్యలక్ష్మి స్కీం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేశారు. వ్యవసాయ రంగానికి, అనుబంధ ఇరిగేషన్ సెక్టార్కు భారీ మొత్తాన్ని ఈ పద్దులో కేటాయించారు. రూ.2.83 లక్షల కోట్లు వ్యవసాయ, అనుబంధ రంగాలకు కేటాయించారు. చేపల ఉత్పత్తిని 200 లక్షల టన్నులకు పెంపొందించడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. నిర్మలా సీతారామన్ ఏం చెప్పారంటే..
మొదటి ప్రాధాన్య అంశాల్లో వ్యవసాయం
భారత్ ప్రపంచంలోనే అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ. మొదటి ప్రాధాన్య అంశంగా వ్యవసాయం, సాగునీరు, గ్రామీణాభివృద్ధి. రెండో ప్రాధాన్య అంశంగా ఆరోగ్యం, పారిశుద్ధ్యం, తాగునీరు. మూడో ప్రాధాన్య అంశంగా విద్య, చిన్నారుల సంక్షేమం. పప్పుధాన్యాల సాగు విస్తీర్ణం పెంచడంపై దృష్టి. కృషి సించాయి యోజన ద్వారా సూక్ష్మ సాగునీటి విధానాలకు ప్రోత్సాహం. గ్రామీణ సడక్ యోజన, ఆర్థిక సమ్మిళిత విధానాల ద్వారా రైతులకు మేలు.
రైతులకు ఇలా ఆదాయం...
రైతులకు సోలార్ పంప్ సెట్ల పథకాన్ని అమలు చేసి 20 లక్షల రైతులకు విస్తరిస్తారు. సాగులోని భూముల్లో సోలార్ కేంద్రాలతో రైతులకు ఆదాయం తీసుకు రాడం. వేల సంవత్సరాల క్రితమే తమిళ మహాకవి అవ్వయ్యార్ నీటి సంరక్షణ, భూమి వినియోగం గురించి చెప్పారు.
నాబార్డు ద్వారా నిధులు
ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు నాబార్డు ద్వారా ఎస్ఎస్జీలకు సాయం. కూరగాయల సరఫరాకు కృషి ఉడాన్ యోజన. వర్షాభావ జిల్లాలకు అదనంగా నిధులు కేటాయింపు. వర్షాభావ జిల్లాలకు సాగునీటి సౌకర్యం. రసాయన ఎరువుల నుంచి రైతులకు విముక్తి కల్పించడమే ప్రభుత్వం లక్ష్యం. భూసార పరిరక్షణకు అదనపు సాయం. రైతులకు సహాయంగా గిడ్డంగుల నిర్మాణం. దీనికి నాబార్డు ద్వారా సాయం. పీపీపీ పద్ధతిలో FCI, కేంద్ర గిడ్డంగుల సంస్థ సంయుక్తంగా నిర్మాణం చేస్తాయి.
ధాన్యలక్ష్మి స్కీం
మహిళల స్వయం సహాయక సంఘాల ద్వారా ధాన్యలక్ష్మి స్కీంను అమలు చేస్తారు. రైతులకు 20 లక్షల వరకు సోలార్ పంపు సెట్లు. పాల ఉత్పత్తుల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కృషి చేస్తాం. 3400 సాగర్ మిత్రల ఏర్పాటు. వ్యవసాయ రుణాలకు రూ.15 లక్షల కోట్లు ప్రకటించారు.