పన్ను భారం తగ్గించండి, మొబైల్ ప్రోత్సాహకాలు ఎందుకు తగ్గించారు: నిర్మలకు సూచనలు
న్యూఢిల్లీ: 2020-21 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సన్నాహాలను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం పారిశ్రామికవర్గాలతో భేటీ ఆయ్యారు. ఆర్థిక మందగమనం నేపథ్యంలో వృద్దిని పరుగు పెట్టించేలా, డిమాండ్ పెంచేలా బడ్జెట్ను రూపొందించాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం వివిధ రంగాలకు చెందిన నిపుణులు, పారిశ్రామికవేత్తల అభిప్రాయాలను సేకరిస్తున్నారు సీతారామన్.
అదే నిజమైతే ఉద్యోగుల్ని ఎప్పుడో తొలగించేవాళ్లం: టాటా మోటార్
ఐటీ, డిజిటల్, పన్నులపై అభిప్రాయాలు
ఐటీ, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, ఫిన్టెక్, స్టార్టప్స్, మొబైల్ తయారీ, ఆర్థిక రంగం - క్యాపిటల్ మార్కెట్ రంగాలకు చెందిన ప్రతినిధులతో భేటీ అయ్యారు. SMEలకు బిగ్ డేటా టెక్నాలజీ, ప్రజా పాలన కోసం బిగ్ డేటా వినియోగం, డిజిటల్ మౌలిక వ్యవస్థలు, డిజిటల్ చెల్లింపుల్లో గోప్యత, కఠిన నియంత్రణ, వ్యాపారాల నిర్వహణను సులభతరం చేయడం, పన్నులపై అభిప్రాయాలు తెలిపారు.
పన్ను భారం తగ్గించండి
పన్నుల భారం ఎక్కువగా ఉందని, దీనిని తగ్గించాలని పరిశ్రమ ఆర్థికమంత్రికి విజ్ఞప్తి చేసింది. మందగమనం నేపథ్యంలో వ్యాపారం లేదని, అధిక పన్ను రేట్లు తగ్గించాలన్నారు. ముఖ్యంగా స్టార్టప్స్, మొబైల్ డివైజ్, ఐటీ రంగాల ప్రతినిధులు పన్ను భారం తగ్గించాలన్నారు.
ఐటీ రంగం.. 15 శాతం కార్పోరేట్ పన్ను
ప్రత్యేక ఆర్థిక మండళ్లలోని సేవారంగ సంస్థలకు 15% కార్పొరేట్ పన్నును ఉంచాలని సాఫ్టువేర్ పరిశ్రమ కోరింది. టెక్నాలజీ స్టార్టప్స్, క్లస్టర్స్ ఏర్పాటుకు వీలుగా ఓ నిధిని ఏర్పాటు చేయాలని నాస్కామ్ విజ్ఞప్తి చేసింది. పన్ను నిర్మాణాన్ని హేతుబద్ధం చేయాలని ఐటీ హార్డ్వేర్, మొబైల్ తయారీదారులు కోరారు. డిజైన్ నుంచి తయారీ సామర్థ్యాలను ఒకేచోట ప్రదర్శించేలా ప్రత్యేక క్లస్టర్స్ కోరింది.
ఎగుమతి ప్రోత్సాహకాలు తగ్గిస్తే...
ఎగుమతి ప్రోత్సాహకాల్లో ఇటీవలి తగ్గింపులపై స్పష్టత కావాలని కూడా పారిశ్రామికవర్గాలు కోరాయి. మొబైల్ ఎగుమతులకు ప్రోత్సాహకం 4 శాతం నుంచి 2 శాతానికి తగ్గిస్తున్నట్లు విదేశీ డైరెక్టరేట్ జనరల్ జారీ చేసిన ఆదేశాలపై స్పష్టత కావాలని కోరాయి. అంతర్జాతీయంగా పోటీ పడాలంటే ప్రోత్సాహకం 8 శాతానికి పెంచాలని, మొబైల్స్ రూ.1200 లోపు వాటికి 5 శాతం జీఎస్టీ, ఎక్కువ వ్యాల్యూ కలిగిన వాటికి కస్టమ్స్ సుంకం గరిష్టంగా రూ.4,000 చేయాలని కోరాయి. ఎగుమతి ప్రోత్సాహకాలు తగ్గితే పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని భారతీయ సెల్యులార్, ఎలక్ట్రానిక్స్ సంఘం చైర్మన్ ఆందోళన వ్యక్తం చేశారు.
రుణాల జారీ పెంచాలి
ఆర్థిక రంగ సంస్థలు కూడా టర్మ్ ఇన్సూరెన్స్ పైన జీఎస్టీ తగ్గింపును డిమాండ్ చేశాయి. పీజే నాయక్ కమిటీ సిఫార్సులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పాలనాపరమైన మార్పుల కోసం చర్యలు తీసుకోవాలని ఆర్థిక రంగ ప్రతినిధులు, క్యాపిటల్ మార్కెట్ వర్గాల సూచించాయి. బ్యాంకుల రుణాల జారీ పెంచాలని కోరాయి. విధాన నిర్ణయాల్లో స్పష్టత, స్థిరత్వం కావాలని, దీంతో అంతర్జాతీయ పెట్టుబడిదారులకు విశ్వాసం పెరుగుతుందని పెట్టుబడిదారులు సూచించారు.
భేటీలో వీరు...
ఈ భఏటీలో నిర్మలా సీతారామన్తో పాటు ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ కుమార్, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతాను చక్రవర్తి, రెవెన్యూ కార్యదర్శి అజయ్ భూషణ్ పాండే, టెలికం కార్యదర్శి అన్షు ప్రకాశ్, ఎలక్ట్రానిక్స్ ఐటీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నిలు పాల్గొన్నారు. ఆయా రంగాల నుంచి నాస్కాం సీనియర్ డైరెక్టర్ ఆశిష్ అగర్వాల్ (ఐటీ రంగం), ప్రయివేటు ఈక్విటీ - వెంచర్ క్యాపిటల్ అసోసియేషన్ అధ్యక్షులు రజత్ టాండన్ (పెట్టుబడులు), రిలయన్స్ జియో ఉపాధ్యక్షులు విశాఖ సైగల్ (డేటా, ఇండియన్ సెల్యూలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ చైర్మన్ పంకజ్ మహీంద్రో, యాపిల్ ఇండియా ఎండీ విరాట్ బాటియా, లావా మొబైల్స్ సీఎండీ హరిఓం రాయ్ (మొబైల్) పాల్గొన్నారు.