ధనిక దేశంలో ఇంధన సంక్షోభం.. గ్యాస్ బిల్లులు చెల్లించేందుకూ అవస్థలు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం వల్ల యూరప్ సహా ఇతర దేశాలు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. అక్కడ శీతాకాలం కావడంతో ఇంధన కొరత విపరీతంగా వేధిస్తోంది. పెరిగిన ఖర్చుల వల్ల గ్యాస్, విద్యుత్ బిల్లులు చెల్లించడానికి సైతం బ్రిటన్ ప్రజలు కష్టపడుతున్నారు. పలు ప్రత్యామ్యాయ మార్గాలు వెదికినా పూర్తిస్థాయిలో ఫలితం లేకుండా పోయింది. ఎనర్జీ అంబుడ్స్ మన్ కు ఎన్నడూ లేని స్థాయిలో ఈ ఏడాది లక్షకు పైగా ఫిర్యాదులు అందాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
రెండేళ్లతో పోలిస్తే 50 శాతం ఎక్కువ:
ఎనర్జీ అంబుడ్స్ మన్ కు గతేడాది మొత్తంలో లక్షా 5 వేలకు పైగా ఫిర్యాదులు అందినట్లు బ్రిటిష్ బ్రాడ్ కాస్టింగ్ కార్పొరేషన్(BBC) తెలిపింది. రెండేళ్ల క్రితంతో పోలిస్తే 50 శాతంకు పైగా నమోదైనట్లు BBC రేడియో 4 మనీ బాక్స్ ప్రోగ్రామ్ 2022లో పేర్కొంది. బిల్లింగ్ లో లోపాలు, పేలవమైన కస్టమర్ సర్వీస్, సరఫరాదారులను మార్చడం సహా ఇతర సమస్యలపై ఎక్కువ మంది ఫిర్యాదు చేసినట్లు అందులో వెల్లడించింది. కాగా వాటిలో 75 శాతం పరిష్కరించబడినట్లు చెప్పింది.
భారీగా పెరిగిన ఖర్చులు:
"రోజువారీ ఖర్చులు పెరగడంతో లక్షలాది ప్రజలు ఇంధన బిల్లులు చెల్లించడానికి కష్టపడుతున్నారు. తమకు సహాయం చేయమంటూ గతంతో పోలిస్తే ఎక్కువ సంఖ్యలో సరఫరాదారులను సంప్రదిస్తున్నారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులు నాలుగు రెట్లు పెరిగాయి. సంక్లిష్ట సమస్యలపై సాధ్యమైనంత త్వరగా స్పందించడానికి మా వంతు కృషి చేస్తున్నాము. మా కస్టమర్ కేర్ బృందాలు ఫిర్యాదులను పరిష్కరించడానికి అవిశ్రాంతంగా పని చేస్తున్నాయి. ఏదైనా కారణం వల్ల వారి ద్వారా పరిష్కారం లభించకపోతే అప్పుడు అంబుడ్స్ మన్ కీలక పాత్ర పోషిస్తారు" అని UK ఎనర్జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎమ్మా పించ్ బెక్ తెలిపారు.
ముందస్తు చెల్లింపుల కోసం బలవంతం:
బ్రిటీష్ గ్యాస్ సబ్ కాంట్రాక్టర్లు కొందరి ఇళ్లలోకి చొరబడ్డారని టైమ్స్ వార్తాపత్రిక జరిపిన పరిశోధనలోనూ ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ముందస్తు చెల్లింపుల కోసం ఉద్దేశించబడిన 'పే యాజ్ యూ గో' మీటర్లకు మారాలని వినియోగదారులను బలవంతం చేసినట్లు ఆ సంస్థ వెల్లడించింది. అంగీకరించని వారికి గ్యాస్ సరఫరా నిలిపివేసినట్లు పేర్కొంది. ఈ ఉద్రిక్తతల మధ్య.. వినియోగదారులు, ఇంధన సరఫరాదారుల మధ్య వివాదాలను స్వతంత్రంగా పరిష్కరించడానికి UK రెగ్యులేటర్ Ofgem(బ్రిటన్ లో గ్యాస్, విద్యుత్ పంపిణీని నియంత్రించే సంస్థ) అంబుడ్స్ మన్ కు అధికారం కల్పించింది.
ధరలు మరింత పెరుగుతాయి..
ఈ ఫిర్యాదుల అనంతరం.. ముందస్తు చెల్లింపు మీటర్లను బలవంతంగా అమర్చడాన్ని నిలిపివేయమని అన్ని ఇంధన కంపెనీలను Ofgem ఆదేశించింది. అయితే ఈ విధానాన్ని అధికారులు పూర్తిగా నిషేధించాలనుకుంటున్నారా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇంధన బిల్లులు వసూళ్లపై ఉదారంగా వ్యవహరిస్తే, ఇదే అలవాటు దేశం మొత్తం వ్యాపిస్తుందని Ofgem మాజీ అధికారి డెర్మోట్ నోలన్ అభిప్రాయపడ్డారు. తద్వారా ధరల పెరుగుదలకు దారి తీస్తుందని హెచ్చరించారు.