పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి రావాలంటే మరింత సమయం
జీఎస్టీలో అత్యధిక స్లాబ్ రేటు 28 శాతం ఇక ముందు కూడా కొనసాగుతుందని రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్ అన్నారు. అదే సమయంలో పెట్రోల్, డీజిల్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి కొంత సమయం పడుతుందని తెలిపారు. ఈ మేరకు పరిశ్రమ వర్గాలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
పెట్రోల్, డీజిల్, గ్యాస్ వంటి చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావాలనే డిమాండ్ ఎప్పటి నుండో ఉన్నది. పారిశ్రామిక వర్గాలు కూడా మొదటి నుండి డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధాన ఆదాయ వనరు ఇది. వీటిని జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి పలు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించడం లేదు. దీనిపై తరుణ్ బజాజ్ మాట్లాడుతూ... చమురు ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకు రావడానికి కొన్ని ఇబ్బందులు ఉన్నాయని, అందుకే కాస్త సమయం పడుతుందని చెప్పారు. ఇందుకు మరికొంత కాలం వేచి చూడాలన్నారు.
అలాగే, 28 శాతం జీఎస్టీ గురించి ప్రస్తావించారు. విలాస వస్తువులు, హానికర ఉత్పత్తులపై విధిస్తున్న అత్యధిక జీఎస్టీ(28 శాతం) కొనసాగుతుందని తెలిపారు. మిగిలిన మూడు స్లాబ్స్ను కుదించాలనే అంశంపై చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. 5 శాతం, 12 శాతం, 18 శాతం స్లాబ్స్ను కుదించే అంశంపై చర్చిస్తున్నట్లు తెలిపారు.