మాకొద్దు ఈ అదనపు భారం.. ఈఎంఐలు చెల్లిస్తాం: ముందే మారటోరియం నుండి వెనక్కి
కరోనా మహమ్మారి కారణంగా దాదాపు మూడు నెలల పాటు లాక్ డౌన్ ఉండటంతో ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. దీంతో ఆదాయం లేకపోవడంతో ప్రజలకు ఊరటనిచ్చేందుకు తొలుత మూడు నెలల పాటు ఆ తర్వాత మరో మూడు నెలలు ఈఎంఐలపై మారటోరియం అవకాశం కల్పించింది ఆర్బీఐ. వ్యాపారాలు లేనివారు, చేతికి శాలరీ రాని ఉద్యోగులు దీనిని ఉపయోగించుకున్నారు. అయితే గత నెల రోజులుగా అన్-లాక్ నడుస్తోంది. ఆర్థిక కార్యకలాపాలు తిరిగి తెరుచుకున్నాయి.
జూలై 1 నుండి మారిన బ్యాంకు రూల్స్! ఇవి గుర్తుంచుకోండి, జరిమానా ఇలా తప్పించుకోవచ్చు
ఈఎంఐ చెల్లిస్తాం.. మారటోరియం వద్దు, నిలిపివేయండి
ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభంకావడంతో కొంతమంది ఈఎంఐ మారటోరియం వెసులుబాటును వెనక్కి తీసుకుంటున్నారు. తమ బ్యాంకు రుణగ్రహీతల్లో కేవలం 30 శాతం మంది ఉద్యోగులు మాత్రమే మారటోరియం వెసులుబాటును ఉపయోగించుకుంటున్నారని, మిగతా 70 శాతం మంది తమ ఎంఐలు కొనసాగిస్తున్నారని పంజాబ్ నేషనల్ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎస్ మల్లికార్జున రావు చెప్పారు. తమ బ్యాంకు అందరికీ మారటోరియం వెసులుబాటును కల్పించిందని గత నెలలో చెప్పారు. తాత్కాలికంగా మారటోరియంను ఇటీవలి వరకు ఉపయోగించుకున్న వారు కూడా ఇప్పుడు మళ్లీ ఈఎంఐలలోకి మారుతున్నారని, తమకు మారటోరియం అవసరం లేదని, ఈఎంఐ చెల్లిస్తామని కొంతమంది కోరుతున్నారని పబ్లిక్ సెక్టార్ రంగ బ్యాంకు అధికారులు వెల్లడిస్తున్నారు.
అన్-లాక్... నగదు చేతుల్లోకి వస్తోంది
జూన్ నెల నుండి అన్-లాక్ ప్రారంభమైందని, నగదు క్రమంగా చేతుల్లోకి వస్తోందని చెబుతున్నాయి. రుణగ్రహీతల చేతుల్లోకి నగదు వస్తుండటంతో ఈఎంఐ తాత్కాలిక నిషేధాన్ని నిలిపివేస్తున్నట్లు బ్యాంకులు చెబుతున్నాయి. ఈఎంఐలపై మారటోరియం ఆగస్ట్ నెల వరకు ఉంది. మొదట మూడు నెలలు, ఆ తర్వాత మూడు నెలలు పొడిగింపు.. మొత్తం 6 నెలలు వెసులుబాటు కల్పించారు. కానీ కొంతమంది కస్టమర్లు ఈఎంఐలు తిరిగి చెల్లించడం ప్రారంభించారని సుర్యోదయ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ ఆర్ భాస్కర్ బాబు పీటీఐతో అన్నారు.
80 శాతం మంది హోంలోన్ రుణగ్రహీతలు నో
అసలు 80 శాతం మంది హోంలోన్ కస్టమర్లు మారటోరియం ఆప్షన్ను ఉపయోగించుకోలేదని చెబుతున్నారు. తమ కస్టమర్లలో 54 శాతం మంది మారటోరియం ఆప్షన్ వినియోగించుకున్నారని, ఇప్పుడు ఆర్థిక వ్యవస్థలు తిరిగి కోలుకోవడంతో ఈ సంఖ్య తగ్గుతుందని భావిస్తున్నట్లు భాస్కర్ బాబు అన్నారు. కరోనా కారణణంగా ఏర్పడిన ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి, నగదు లభ్యత పెరుగుతుండటంతో రుణాల చెల్లింపుకు ముందుకు వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు.
తాత్కాలిక నిషేధం భారమే
కంటైన్మెంట్ జోన్లు మినహా అంతటా జూన్ నుంచి లాక్ డౌన్ నిబంధనల సడలింపు మొదలయ్యాయి. అన్ని పారిశ్రామిక, వ్యాపార రంగాల్లో క్రమంగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఫలితంగా పలువురు రుణగ్రహీతలు మారటోరియం నుంచి బయటకు వస్తున్నారని బ్యాంకర్లు చెబుతున్నారు. ముఖ్యంగా సూక్ష్మ రుణగ్రహీతలకు నగదు లభ్యత పెరిగిందని, అందుకే వారు మారటోరియంను వద్దనుకుంటున్నారంటున్నారు. కాగా, మారటోరియం కారణంగా వడ్డీ భారంతో ఈఎంఐల సంఖ్య లేదా ఈఎంఐ భారం పెరుగుతుందని నిపుణులు సూచిస్తోన్న విషయం తెలిసిందే. దీంతో చేతిలో నగదు ఉంటే చెల్లించడానికి ఎక్కువమంది మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే చాలామంది మారటోరియంను ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆర్థిక కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో రెండు నెలల ముందు నుండే ఈ భారం కంటే ఈఎంఐ చెల్లింపు బెట్టర్ అని భావిస్తున్నారు.