మళ్లీ ఎగిసిపడిన బిట్కాయిన్, భారత్లో క్రిప్టోకు భలే డిమాండ్
క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్ మళ్లీ పరుగులు పెడుతోంది. ఈ కరెన్సీ వ్యాల్యూ బుధవారం 5 శాతం ఎగబాకి 50,942 పాయింట్లను క్రాస్ చేసింది. క్రితం సెషన్లో 2,426 డాలర్లకు పైగా లాభపడింది. ఈ ఏడాది జనవరి 4న 27,734 డాలర్లు పలికింది. నాటి నుండి నేటి వరకు 84 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత ఫిబ్రవరి 21వ తేదీన ఆల్ టైమ్ గరిష్టం 58,354 డాలర్లను తాకింది. అయితే ఆ తర్వాత దారుణంగా పతనమై 45,000 డాలర్ల దిగువకు చేరుకుంది. మళ్లీ పుంజుకొని ఇప్పుడు 51వేల డాలర్ల దిశగా సాగుతోంది.
బిట్ కాయిన్ కిందకు, పైకి
జనవరి, ఫిబ్రవరి నెలల్లో బిట్ కాయిన్ భారీగా లాభపడటానికి పలు కారణాలు ఉన్నాయి. బీఎన్వై మెలన్, మాస్టర్ కార్డ్, టెస్లా స్క్వేర్ ఇంక్ వంటి దిగ్గజ సంస్థలు బిట్ కాయిన్లో ఇన్వెస్ట్ చేశాయి లేదా ఈ క్రిప్టో కరెన్సీని అంగీకరిస్తున్నట్లు తెలిపాయి. దీంతో ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకింది. ఆ తర్వాత టెస్లా అధినేత చేసిన ట్వీట్ కారణంగా, అలాగే, బిట్ కాయిన్కు ఇప్పటికే హైజంప్ వచ్చిందనే వాదనల నేపథ్యంలో పడిపోయింది. తిరిగి మార్చి 3న 50వేల పాయింట్లను తాకింది. ఓ సమయంలో ఆల్ టైమ్ హై ఫిబ్రవరి 21 నాటి 58,354 డాలర్లతో 12 శాతం క్షీణించింది.
ఈ క్రిప్టో వ్యాల్యూ కూడా జంప్
మరో క్రిప్టోకరెన్సీ ఎథెర్ వ్యాల్యూ బుధవారం 7 శాతానికి పైగా ఎగిసింది. ఎథెరియమ్ బ్లాక్ చైన్ నెట్ వర్క్కు చెందిన ఎథేర్ క్రిప్టో నిన్న 1,595.64 డాలర్ల వద్ద ట్రేడ్ అయింది. క్రితం సెషన్లో 106.84 డాలర్లు ఎగిసింది. ఇటీవల ఇతర క్రిప్టో కరెన్సీ వ్యాల్యూ కూడా పెరుగుతోంది.
భారత్లో డబుల్
ఇదిలా ఉండగా, భారత్లో క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజ్ నెల ప్రాతిపదికన ఫిబ్రవరి నెలలో రెండింతలైంది. కేంద్ర ప్రభుత్వం ప్రయివేటు క్రిప్టోను బ్యాన్ చేయనుందనే వార్తల నేపథ్యంలోను పెరగడం గమనార్హం. డిసెంబర్ 2020లో క్రిప్టో ఎక్స్చేంజ్ ట్రేడింగ్ వ్యాల్యూ 500 మిలియన్ డాలర్లు కాగా, జనవరి 21న 1.4 బిలియన్ డాలర్లు, ఫిబ్రవరిలో 2.3 బిలియన్ డాలర్లకు పెరిగింది.