బెజోస్, మస్క్ 2020 ఆదాయంతో 10 కోట్లమంది అమెరికన్లకు 2000 డాలర్ల చొప్పున పంచవచ్చు
బ్లూమ్బర్గ్ నివేదిక ప్రకారం 2020 క్యాలెండర్ ఏడాదిలో అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఏడాదిలో వీరికి పెరిగిన సంపదతో 10 కోట్ల మంది అమెరికన్లకు ఒక్కొక్కరికి 2,000 డాలర్ల చెక్కులు ఇవ్వవచ్చునని అంచనా వేసింది. ప్రపంచ టాప్ 500 కుబేరుల సంపద గత ఏడాది 31 శాతం పెరిగింది. గత ఎనిమిదేళ్ల కాలంలో కుబేరులకు ఇదే అత్యధికమని బ్లూమ్బర్గ్ వెల్లడించింది.
ఆదాయ పన్ను క్యాలెండర్ 2021: ముఖ్యమైన ఈ తేదీలు గుర్తుంచుకోండి..
వారి ఆదాయంతో 10కోట్ల మందికి
కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా సామాన్యులపై భారీగా ప్రభావం పడింది. ఈ నేపథ్యంలో అమెరికా ఇటీవల ఆర్థిక ప్యాకేజీకి ఆమోదం తెలిపింది. అమెరికన్లకు ఏ మేరకు, ఎలా సాయం అందుతుందనే అంశం చర్చలో ఉండగానే, అమెరికా కుబేరుల సంపద 2020లో రికార్డ్ స్థాయిలో పెరగడం గమనార్హం. కేవలం జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్ సంపద 217 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది పది కోట్లమంది అమెరికన్లకు 2000 డాలర్ల చొప్పున పంచితే వచ్చే దాంతో సమానం.
2020లో మస్క్ సంపద జూమ్
బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం ప్రపంచంలోని అత్యంత ధనవంతుడైన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ సంపద 190 బిలియన్ డాలర్లు. టెస్లా సీఈవో మస్క్ సంపద 170 బిలియన్ డాలర్లు. వీరు ప్రపంచ టాప్ తొలి, రెండో స్థానాల్లో నిలిచారు. ఎలాన్ మస్క్ సంపద 2020లో హఠాత్తుగా భారీగా పెరిగింది. ప్రధానంగా టెస్లా షేర్లు పెరగడంతో ఆయన ఆదాయం 75 శాతం వరకు పెరిగింది.
అమెరికా ప్యాకేజీ
కరోనా, లాక్ డౌన్, ఆర్థిక అస్తవ్యస్థత కారణంగా అమెరికాలో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు. అమెరికన్ కాంగ్రెస్ కరోనా ప్యాకేజీలో భాగంగా అమెరికన్లకు 1200 డైరెక్ట్ పేమెంట్ను గత మార్చిలో ప్రకటించింది. ఆ తర్వాత రెండో ఆర్థిక ప్యాకేజీకి అమెరికన్లు 9 నెలలు వేచి చూడాల్సి వచ్చింది. డిసెంబర్ నెలలో రెండో కరోనా ప్యాకేజీకి ఆమోదం లభించింది.