కొత్త ఏడాదిలో సేవింగ్స్ పథకాల కోసం వెతుకుతున్నారా? అయితే వీటిని పరిశీలించవచ్చు
కొత్త ఏడాది. అన్నీ కొత్తగా చేయాలనే సంకల్పం తీసుకుని అందుకు అనుగుణంగా ప్రయత్నాలు చేసే సమయమిది. ముఖ్యంగా సేవింగ్స్ కోసం చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు కొత్త కొత్త పథకాల కోసం వెతుకుతుంటారు. ఏ పథకంలో ఇన్వెస్ట్ చేస్తే బెటర్... ఏది ఎంత మేరకు రిటర్న్స్ ఇస్తుంది అని రీసెర్చ్ చేస్తుంటారు. అలాంటి ఇన్వెస్టర్ల కోసమే ఈ కథనం. 2020 లో మీ పెట్టుబడులను కాస్త కొత్త పంథాలో మదుపు చేసేందుకు ఎంపిక చేసిన కొన్ని ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ ను ది ఎకనామిక్ టైమ్స్ ప్రతిపాదిస్తోంది.
ఇవన్నీ మ్యూచువల్ ఫండ్ పథకాలే. వీటిలో మదుపు చేస్తే అటు పెట్టుబడుల రాబడి తో పాటు ఇన్కమ్ టాక్స్ నుంచి మినహాయింపులు కూడా లభిస్తాయి. ఇన్కం ట్యాక్స్ ఆక్ట్ లోని సెక్షన్ 80 సి కింద మీకు రూ 1,50,000 వరకు పెట్టుబడి అవకాశం ఉంది. ఈ మొత్తం పెట్టుబడిపై ఎలాంటి పన్నూ వర్తించదు. అందుకనే... వేతన జీవులు, దీర్ఘకాలిక పెట్టుబడి లక్ష్యాలు ఉన్న వారు ఈ సరికొత్త సేవింగ్స్ స్కీమ్స్ ని ఎంపిక చేసుకోవచ్చు.
గుడ్ న్యూస్: గృహ కొనుగోలుదారులకు ఎస్బీఐ బంపర్ ఆఫర్
పెర్ఫార్మన్స్....
ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్ పథకాల్లో కొన్నేళ్లుగా మెరుగైన రాబడులు అందించే పథకాలనే ఇక్కడ ఎంపిక చేశారు. గతేడాది అంతగా పనితీరు కనబరచని కొన్ని పథకాలను జాబితా నుంచి తొలగించారు. ఎందుకంటే... ఇన్వెస్టర్ల కు మెరుగైన రాబడులను క్రమం తప్పకుండ అందించే ఏర్పాటులో భాగంగా ఈటీ ఒక కసరత్తు చేసింది. ఇందుకోసం అనేక పరిమితులను కొలమానంగా తీసుకొని, జాగ్రత్తగా పథకాలను ఎంపిక చేసింది. అయితే, ఈక్విటీ ఆధారిత పెట్టుబడులు ఎప్పుడు కూడా మార్కెట్ రిస్క్ కు లోబడి ఉంటాయి కాబట్టి... మీ వంతుగా మీరు కూడా పెట్టుబడికి ముందు కొంత కసరత్తు చేయాలి. అలాగే ఈ అంశాల్లో సర్టిఫైడ్ ఫైనాన్సియల్ అడ్వైజర్ సలహాలు పాటించాలి. అప్పుడే మీ పెట్టుబడికి తగిన భరోసా లభిస్తుంది.
5-7 ఏళ్లకు బెటర్...
ఈక్విటీ లింక్డ్ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్లు నిర్ధారిత లాక్ ఇన్ పీరియడ్ ను కలిగి ఉంటాయి. అంటే మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనీసం మూడేళ్ళ పాటు మీ పెట్టుబడిని అదే పథకంలో కొనసాగించాల్సి ఉంటుంది. ఆ తర్వాత అవసరమైతే పెట్టుబడిని వెనక్కు తీసుకోవచ్చు. కానీ మెరుగైన రాబడులను ఆశించే వారు కనీసం 5 ఏళ్ళ నుంచి 7 ఏళ్ళ వరకు వేచి చూస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదే సమయంలో లాకిన్ పీరియడ్ కేవలం మూడేళ్లు ఉంటుంది కాబట్టి... ఆ తర్వాత వెంటనే మనకు లాభాల తో కూడిన రాబడి లభిస్తుంది అనే ఆలోచనతో కూడా చాలా మంది ఇన్వెస్టర్లు ఉంటారు. కానీ అది సమంజసం కాదు. ఎందుకంటే... మీరు పెట్టుబడి పెట్టిన మూడేళ్లు పూర్తైన ఏడాదే స్టాక్ మార్కెట్లు కుదేలైతే పరిస్థితి మరోలా తయారవుతుంది. రాబడి అటుంచి మీ పెట్టుబడి కూడా కొంత తరిగిపోయే అవకాశం ఉంటుంది. అందుకే ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
పరిశీలనకు ఆరు పథకాలు...
పైన ఉదహరించిన అన్ని అంశాలను పరిగణన లోకి తీసుకొని రిస్క్ తీసుకోగలిగిన రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆరు ఈక్విటీ ఆధారిత సేవింగ్స్ స్కీమ్స్ ని ఎంపిక చేశారు. పెట్టుబడికి ముందు మరో సారి జాగ్రత్తగా నిపుణుల సలహాలు తీసుకుని ఈ కింది పథకాల్లో కొత్త ఏడాదిలో పెట్టుబడులు పెట్టె అంశాలను పరిశీలించవచ్చు.
- మోతిలాల్ ఓస్వాల్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
- ఆదిత్య బిర్లా సన్ లైఫ్ టాక్స్ రిలీఫ్ 96
- ఇన్వెస్కో ఇండియా టాక్స్ ప్లాన్
- ఆక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్
- మీరా అసెట్ టాక్స్ సేవర్
- డీఎస్పీ టాక్స్ సేవర్
(గమనిక: ఈ పథకాల్లో పెట్టుబడులకు వ్యాసకర్త ఎటువంటి గ్యారంటీ ఇవ్వరు. ఇది కేవలం పెట్టుబడి అవగాహన కోసం ది ఎకనామిక్ టైమ్స్ కథనం ఆధారంగా రాసిన వ్యాసం మాత్రమే)