వీఎల్సీసీ సహా పతంజలి గ్రూప్ నుంచి త్వరలో పబ్లిక్ ఇష్యూలు
ముంబై: వచ్చే రెండు వారాల్లో భారీ కంపెనీలు ఐపీఓలకు రానున్నాయి. పబ్లిక్ ఇష్యూలను జారీ చేయనున్నాయి. దీనికి సంబంధించిన సన్నాహాలు పూర్తవుతున్నాయి. ఏస్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్ఝున్వాలాకు చెందిన స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఈ వారమే పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఈ నెల 30వ తేదీన ఐపీఓ జారీ అవుతుంది. మైనింగ్ అనుబంధ యంత్రాలు, ఇతర పరికరాలను తయారు చేసే తేగా ఇండస్ట్రీస్ డిసెంబర్ 1న పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది.
స్టార్ హెల్త్ ఇన్స్యూరెన్స్..
ఇన్వెస్టర్ల నుంచి 10 వేల కోట్ల రూపాయలకు పైగా మొత్తాన్ని సమీకరించాలనేది ఈ రెండు కంపెనీల టార్గెట్. స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పటికే తన ప్రైస్ బ్యాండ్ సహా ఇతర వివరాలన్నింటినీ విడుదల చేసింది. ఈ నెల 30వ తేదీన పబ్లిక్ ఇష్యూ ఓపెన్ అవుతుంది. డిసెంబర్ 3వ తేదీన ముగుస్తుంది. ఈ పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్ 870 నుంచి 900 రూపాయలు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 16 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 8,000 కోట్ల రూపాయలను స్టార్ హెల్త్ సమీకరించనుంది.
తేగా ఇండస్ట్రీస్..
తేగా ఇండస్ట్రీస్ పబ్లిక్ ఇష్యూ డిసెంబర్ 1వ తేదీన ఓపెన్ అవుతుంది. 3వ తేదీన ముగుస్తుంది. దీని ప్రైస్ బ్యాండ్ 443 నుంచి 453 రూపాయలు. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 33 షేర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. మొత్తంగా 619.22 కోట్ల రూపాయలను సమీకరించనుంది. ఈ రెండు ప్రస్తుతం మార్కెట్లో ఆసక్తి కలిగించేవిగా మారాయి. ఈ రెండు కంపెనీలకు సంబంధించిన గ్రే మార్కెట్ ప్రీమియం కూడా ఆకర్షణీయంగా ఉంటోన్నాయి. ప్రత్యేకించి- తేగా ఇండస్ట్రీస్ గ్రే మార్కెట్ ప్రీమియం 650 రూపాయలకు పైగా ఉంటోంది.
సెబీ నుంచి అనుమతి..
కాగా- డిసెంబర్ రెండో వారంలో మరో రెండు కంపెనీలు పబ్లిక్ ఇష్యూకు రానున్నాయి. ఇందులో ఒకటి వీఎల్సీసీ. వెల్నెస్, బ్యూటీ ప్రొడక్ట్స్ కంపెనీ ఇది. ఏపీ, తెలంగాణ సహా అన్ని రాష్ట్రాల్లోనూ వీఎల్సీసీ అవుట్లెట్స్ ఉన్నాయి. వీఎల్సీసీ హెల్త్కేర్ లిమిటెడ్ పబ్లిక్ ఇష్యూను జారీ చేయడానికి అవసరమైన అనుమతులను వెలువడ్డాయి. ఈ కంపెనీ అందజేసిన రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్కు సెక్యూరిటీ ఎక్స్ఛేంజ్ బోర్డు ఆమోదముద్ర వేసింది.
మరిన్న అవుట్లెట్ల కోసం..
ఈ రెడ్ హర్రెంట్ ప్రాస్పెక్టస్ ప్రకారం వీఎల్సీసీ 300 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అలాగే- ఆఫర్ ఫర్ సేల్ను ఆధారంగా చేసుకుని మరో 89.22 లక్షల షేర్లను విక్రయిస్తుంది. వందన లూథ్రా, ముఖేష్ లూథ్రా ఈ కంపెనీ ప్రమోటర్లుగా వ్యవహరిస్తోన్నారు. అలాగే ఓఐహెచ్ మారిషస్, లియోస్ ఇంటర్నేషనల్స్ పేర్ల మీద ఈ కంపెనీలో ఈక్విటీలు ఉన్నాయి. దేశంలో కొత్తగా మరిన్ని అవుట్లెట్లను ఏర్పాటు చేయడం, బ్యూటీ అండ్ కాస్మటిక్స్ ప్రొడక్ట్స్ వాల్యూమ్ను పెంచడం వంటి కార్యకలాపాల కోసం వీఎల్సీసీ ఈ మొత్తాన్ని కేటాయిస్తుంది.
రుచిసోయా..
అదే నెల రుచి సోయా పబ్లిక్ ఇష్యూను జారీ చేయనుంది. ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్కు చెందిన సెగ్మెంట్ కావడం వల్ల దీనిపై మార్కెట్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. పైగా పతంజలి గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో ఇదీ ఒకటి. పతంజలి గ్రూప్ను బాబా రామ్దేవ్, బాలకృష్ణన్ ప్రమోట్ చేస్తోన్న విషయం తెలిసిందే. కాగా- రుచి సోయా పబ్లిక్ ఇష్యూ ప్రైస్ బ్యాండ్, లాట్ సైజ్.. ఎంత మొత్తాన్ని సమీకరించడానికి పబ్లిక్ ఇష్యూను జారీ చేస్తోన్నారనేది ఇంకా తెలియరావాల్సి ఉంది. త్వరలోనే దీనికి సంబంధించిన వివరాలు వెల్లడి కానున్నాయి.