బ్రాంచీలు పెరుగుతున్నాయ్: ATMలు తగ్గుతున్నాయ్, బ్యాంకుల ప్లాన్ ఇదేనా?
మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తో పాటు అనేక రకాల యాప్ లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించేందుకు బ్యాంకు శాఖలతో పని తక్కువ ఉంటుందని అందరూ భావించారు. ఇక బ్యాంకులు తమ శాఖల సంఖ్యను తగ్గించుకునే అవకాశం ఉండవచ్చన్న అంచనాలు వెలువడ్డాయి. కానీ అందుకు భిన్నంగా బ్యాంకులు తమ శాఖల సంఖ్యను పెంచుకుంటున్నాయి. కస్టమర్ల సంఖ్యతోపాటు వ్యాపారం పెంచుకోవాలని బ్యాంకులు ఈ వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తోంది. బ్యాంకుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.
అందుకే కస్టమర్లకు మరింత చేరువ కావడానికి శాఖలు దోహదపడతాయని బ్యాంకులు భావిస్తున్నట్టున్నాయి. ఆన్ లైన్, యాప్ లద్వారా లావాదేవీలు నిర్వహించుకునే అవకాశం ఉన్నప్పటికీ కొన్ని రకాల లావాదేవీలకు బ్యాంకు శాఖలకు తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తుంది. డీడీ తీయాలన్న, చెక్ డిపాజిట్ చేయాలన్న, చెక్ ను విడిపించుకోవాలన్నా, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయాలన్నా, బ్యాంక్ లాకర్ తదితర సేవలను వినియోగించుకోవాలన్న బ్యాంకు శాఖకు వెళ్ళవలసిందే. వీటితో పాటు బ్యాంకులు బీమా కంపెనీల తరపున బీమా ఉత్పత్తులను విక్రయిస్తున్నాయి. ఇలాంటి వాటిని దృష్టిలో ఉంచుకొనే బ్యాంకులు శాఖల విస్తరణపై ద్రుష్టి పెట్టినట్టు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.
మీరు అకౌంట్ తెరవండి... మేము ఒక మొక్కను నాటుతాం..
పెద్ద పట్టణాలకు అధిక ప్రాధాన్యం
* భారత రిజర్వ్ బ్యాంకు తాజాగా వెల్లడించిన నివేదిక ప్రకారం బ్యాంకులు కొత్త శాఖల ప్రారంభానికి ప్రథమ, ద్వితీయ శ్రేణీ పట్టణాలకు అధిక ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ నగరాల్లోనే బ్యాంకులు సగం శాఖలను తెరిచాయి.
* 2018-19 ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు 4,518 శాఖలను ప్రారంభించాయి. అంతకు ముందు ఆర్ధిక సంవత్సరంలో బ్యాంకులు ప్రారంభించిన శాఖల సంఖ్య 3,938గా ఉంది. బ్యాంకులు పెద్ద పట్టణాల్లో శాఖల ఏర్పాటు ద్వారా వ్యాపారం పెంచుకునే అవకాశం ఉంటుందని భావిస్తున్నాయి. చిన్నపట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో బిజినెస్ కరస్పాండెంట్ల ద్వారా లావాదేవీలు నిర్వహిస్తున్నాయి.
ఏటీఎం లు తగ్గుతున్నాయి..
* బ్యాంకులు కొత్త ఏటీఎం ల ఏర్పాటు విషయంలో వెనకడుగు వేస్తున్నాయి. ఏటీఎం ల నిర్వహణ భారంగా మారడం ఇందుకు కారణమని తెలుస్తోంది.
* ఏటీఎం లను ఏర్పాటు చేయడానికి సరైన ప్రదేశం దొరకాలి. ఇలాంటి ప్రాంతంలో అద్దెలు ఎక్కువగా ఉంటాయి. కెమెరాలు వంటివి ఏర్పాటు చెబుతున్న కొన్ని చోట్ల సెక్యూరిటీ గార్డులను ఏర్పాటు చేయాల్సి వస్తుంది. ఏటీఎం ల భద్రతకు సంభందించి కొత్త నిబంధనలు పాటించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో బ్యాంకులు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.
* 2018 మార్చి చివరినాటికి ఏటీఎం లు 2,22,247 ఉండగా 2019 మార్చి నూటికీ వీటి సంఖ్య 2,21,579కి తగ్గిపోయింది.
* వైట్ లేబుల్ ఏటీఎం లు పెరుగుతున్నాయి. వీటిని ప్రవేట్ కంపెనీలు ఏర్పాటు చేయవచ్చు. వీటి ఏర్పాటుకు సంభందించిన నిబంధనలను సానుకూలంగా మార్చడం వల్ల ఈ సంస్థలకు ప్రయోజనం కలుగుతోంది.
ప్రయివేట్ బ్యాంకులే ముందు..
* ఏటీఎం లను ఏర్పాటు చేయడంలో ప్రయివేట్ బ్యాంకులు ముందుంటున్నాయి. 2018 మార్చి నాటికి ఈ బ్యాంకుల ఏటీఎం లు 60,145 ఉండగా 2019 మార్చి చివరి నాటికి 63,340కి పెరిగాయి. ఇవే కాలంలో ప్రభుత్వ రంగ బ్యాంకుల ఏటీఎం లు 1,45,968 నుంచి 1,36,098కి తగ్గాయి.
* ఐడీబీఐ బ్యాంకు ను ప్రైవేట్ బ్యాంకుగా పునర్ వర్గీకరణ చేయడం వల్ల ప్రభుత్వ బ్యాంకుల ఏటీఎం లు తగ్గినట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే వైట్ లేబుల్ ఏటీఎం ల సంఖ్య 15,195 నుంచి 19,507కు పెరిగింది.
* ఏటీఎం జరిగే లావాదేవీలు, వాటి పరిమాణం తగ్గుతోందట. అయినప్పటికీ ఇవి నగదు తీసుకోవడానికే కాకుండా ఇతర లావా దేవీలు నిర్వహించడానికి చాలా ఉపయోగపడుతున్నాయి.