లాకర్ల నిర్వహణ బాధ్యత బ్యాంకులదే, ఆరు నెలల్లో నిబంధనలు
బ్యాంకుల్లో లాకర్ సదుపాయం నిర్వహణకు సంబంధించి ఆరు నెలల్లో తగిన నిబంధనలు రూపొందించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)ని భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇప్పుడు సామాన్యుల జీవితాల్లో బ్యాంకింగ్ సేవలు కీలకంగా మారాయని, నగదు, బంగారం తమ ఇతరత్రా విలువైన ఆస్తులను ఇంట్లో ఉంచేందుకు భయపడుతున్నారని, కాబట్టి లాకర్లకు డిమాండ్ పెరిగిందని న్యాయస్థానం పేర్కొంది.
అందుకే పటిష్ట భద్రతతో కూడిన లాకర్లు, ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అవసరం ఉందని, అలాగే లాకర్లలో పెట్టినవాటి బాధ్యత బ్యాంకులదేనని తేల్చి చెప్పింది. లాకర్లలోని నగదు చెదలు పట్టిందని, నగలు దెబ్బతిన్నాయని ఇటీవల కస్టమర్లు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కోర్టు పైవిధంగా స్పందించింది.
లక్షలు పలుకుతున్న క్రిప్టో: గాలి బుడగనా.. భయాన్ని కలిగిస్తున్న బిట్కాయిన్!
పరిరక్షణ బాధ్యత బ్యాంకులదే
బ్యాంకు లాకర్లలోని వస్తువుల పరిరక్షణ బాధ్యత బ్యాంకులదేనని స్పష్టం చేసింది. లాకర్ల నిర్వహణ ఖాతాదారుల బాధ్యతేనని బ్యాంకులు తప్పించుకోవడం కుదరదని పేర్కొంది. లాకర్ల నిర్వహణకు సంబంధించి 6 నెలల్లో స్పష్టమైన నిబంధనలు జారీ చేయాలని ఆర్బీఐని ఆదేశించింది.
ప్రజలు తమ నగదును, బంగారు ఆభరణాలను ఇంటిలో దాచుకునేందుకు వెనకాడుతున్న నేపథ్యంలో లాకర్లకు ప్రాధాన్యత పెరిగిందని తెలిపింది. ప్రస్తుతం మనం నగదురహిత ఆర్థిక వ్యవస్థ దిశగా సాగుతున్నామని, ఈ సమయంలో ప్రజలు చరాస్తులను చేతుల్లో ఉంచుకునేందుకు ఇష్టపడటం లేదని తెలిపింది. ప్రజలకు బ్యాంకులు నాణ్యమైన సేవలు అందించాల్సిందేనని పేర్కొంది.
విదేశీయులు కూడా..
బ్యాంకు లాకర్లకుకు స్పందించి నిబంధనలు జారీ చేస్తే, ఈ సేవలను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకువస్తే స్వదేశీయులతో పాటు విదేశీయులు కూడా వీటిని ఉపయోగించుకునేందుకు ముందుకు వస్తారని పేర్కొంది. తాళం చెవులను ఉపయోగించేస్థాయి నుండి ఎలక్ట్రానిక్ విధానంలో లాకర్లు నిర్వహించే స్థాయికి వచ్చామని పేర్కొంది. పాస్ వర్డ్ లేదా పిన్ వంటి వాటి ద్వారా పాక్షికంగా లాకర్లను ఉపయోగించే సౌకర్యం తీసుకు రావాలని సూచించింది. ఎప్పటికప్పుడు అత్యుత్తమ టెక్నాలజీని అందుబాటులోకి తేవాలని పేర్కొంది. టెక్ ఫ్రాడ్స్టర్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపింది.
ఆ నిర్ణయం బ్యాంకులదే
బ్యాంకులు తమకు బాధ్యత లేదనడం సరికాదని సుప్రీం కోర్టు పేర్కొంది. అలా అయితే వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్ట నిబంధనలను ఉల్లంఘించడంతో పాటు ఇన్వెస్టర్ల నమ్మకాన్ని దెబ్బతీయడమేనని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో లాకర్లు, సేఫ్ డిపాజిట్ సదుపాయాల నిర్వహణకు సంబంధించి బ్యాంకులు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ సమగ్రమైన నిబంధనలను ఆర్బీఐ తీసుకురావాలని ఆదేశించింది.
ఇందుకు ఆరు నెలల సమయం ఇచ్చింది. లాకర్ల విషయమై కస్టమర్లకు ఏదైనా నష్టం జరిగితే బ్యాంకుల బాధ్యత ఏ మేరకు నిర్ణయించే అంశాన్ని ఆర్బీఐకే విడిచిపెట్టింది సుప్రీంకోర్టు.