'డిపాజిట్లపై వడ్డీ రేటును అంతకుమించి తగ్గించలేం, చౌక రుణాలు ఇవ్వాలంటే..'
న్యూఢిల్లీ: డిపాజిట్లపై వడ్డీ రేట్లను ఒక పరిమితికి మించి తగ్గించలేమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) చైర్మన్ రజనీష్ కుమార్ అన్నారు. భారత్లో సామాజిక భద్రతా పథకాలు తక్కువగా ఉండటమే ఇందుకు కారణమని చెప్పారు. అదే సమయంలో ఎగవేత అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయన్నారు. కాబట్టి కార్పోరేట్లకు కూడా తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వలేని పరిస్థితులు బ్యాంకులకు ఉన్నాయని చెప్పారు.
బ్యాంకుల వడ్డీ రేట్లు తక్కువగా ఉన్నప్పుడు అందరూ వాటి గురించి మాట్లాడుతుంటారని, కానీ పెరిగినప్పుడు మాత్రం వీటి గురించి ఎవరూ మాట్లాడరని వ్యాఖ్యానించారు. రెపో రేటు ఆరేళ్ల కనిష్టానికి చేరుకున్న సమయంలో కూడా రుణ గ్రహీతలకు వడ్డీ రేట్లు ఆ నిష్పత్తిలో పెరగలేదని ఆయన గుర్తు చేశారు.
2013లో రెపో రేటు దాదాపు 10 శాతంగా ఉందని, నాటి నుంచి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రెపో, వినియోగదారులకు బ్యాంకు వడ్డీ రేట్లు పూర్తిగా అలైన్డ్ మ్యానర్లో కదులుతున్నాయన్నారు. నేడు తమ బ్యాంకు డిపాజిట్లలో 90 శాతం రిటైల్ డిపాజిట్స్ ఉన్నాయని, చౌకగా రుణాలు ఇవ్వాలనుకుంటే డిపాజిటర్లకు తక్కువగా చెల్లించవలసి ఉంటుందని చెప్పారు.
అలాగే, మన దేశంలో సీనియర్ సిటిజన్స్ జనాభా ఎక్కువగా ఉందని, సామాజిక భద్రతా పథకాలు ఎక్కువగా లేనప్పుడు, డిపాజిట్లపై వడ్డీ సంపాదించాలని అన్నారు. కాగా, ప్రస్తుతం బ్యాంకులు డిపాజిట్లపై 3 శాతం నుంచి 4 శాతం మధ్య ఇస్తుండగా, రుణాలపై 8 శాతం, ఆపైన ఉంది.