5 రోజుల బ్యాంకింగ్, వేతనం... 8న సమ్మె: బ్యాంకు సేవలు, ఏటీఎంలకు అంతరాయం!
ప్రభుత్వం లేబర్ పాలసీలను నిరసిస్తూ ఈ నెల 8వ తేదీన ఆరు బ్యాంకుల ఎంప్లాయీస్ యూనియన్లు సమ్మెకు పిలుపునిచ్చాయి. AIBEA, AIBOA, BEFI, INBEF, INBOC, BKSM యూనియన్లు జనవరి 8న సమ్మెకు దిగనున్నట్లు నోటీసు ఇచ్చాయి. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ సమ్మె సమాచారాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి అందించింది. అయితే పై యూనియన్లలో తమ బ్యాంకుకు చెందిన ఉద్యోగులు చాలా తక్కువగా ఉన్నారని, కాబట్టి ప్రభావం చాలా తక్కువ ఉంటుందని SBI తెలిపింది.
రైళ్లలో దూరం ప్రయాణిస్తున్నారా?: సూపర్ ఆఫర్.. రూ.50 శాతం డిస్కౌంట్!
అందరూ సమ్మెలో పాల్గొనాలి
ఆరు యూనియన్ల సమ్మె నేపథ్యంలో సాధారణ బ్యాంకింగ్ సేవలు, ఏటీఎం కార్యకలాపాలకు బుధవారం అంతరాయం కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే నెట్ బ్యాంకింగ్ సేవలు, సంబంధిత ట్రాన్సాక్షన్స్కు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఒక్కరోజు సమ్మెలో అందరూ పాల్గొనాలని, బుధవారం విధులకు ఎవరూ హాజరు కావొద్దని అఖిల భారత బ్యాంక్ ఉద్యోగుల సంఘం (AIBEA), బ్యాంకు ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (BEFI) తమ సభ్యులను కోరాయి.
డిమాండ్లు ఇవే...
ఈ సమ్మెకు వివిధ సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు మద్దతిస్తున్నాయని AIBEA ప్రధాన కార్యదర్శి సిహెచ్ వెంకటాచలం చెప్పారు. ఉద్యోగ భద్రత, శాలరీ హైక్, ఉపాధి కల్పనలకు పెద్దపీట వేయాలని, కార్మిక చట్టాల్లో సవరణలు, బ్యాంకుల విలీనాలను ఆపాలని కోరుతూ ఈ సమ్మెకు ఉద్యోగులు సిద్ధమయ్యారు.
5 రోజుల బ్యాంకింగ్, వేతన రివిజన్
బ్యాంకు ఉద్యోగులు, అధికారుల వేతన రివిజన్ ఆలస్యమవుతోందని, ఏప్రిల్ 2010 తర్వాత జాయిన్ అయిన ఉద్యోగులు పెన్షన్ ప్రయోజనాలను కోల్పోతారని చెబుతున్నారు. అలాగే, వారానికి 5 రోజులే పని అనే తమ ప్రధాన డిమాండును విస్మరిస్తున్నారని చెబుతున్నారు. ఉద్యోగులు, అధికారులు పని భారంతో ఆందోళన చెందుతున్నారని, బ్యాంకుల్లో తగిన నియామకాలు కూడా లేవన్నారు.
ప్రభావముండదు
ఇదిలా ఉండగా, 8వ తేదీన బ్యాంకింగ్ సేవలు సజావుగా సాగేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు ప్రభుత్వరంగ బ్యాంకింగ్ సంస్థ సిండికేట్ బ్యాంక్ శనివారం తెలిపింది. తమ బ్యాంకులో ఆయా యూనియన్ల వారు ఎక్కువగా లేనందున పెద్దగా ప్రభావం ఉండదని ఎస్బీఐ తెలిపింది.