Bangladesh Crisis: శ్రీలంక బాటలో బంగ్లాదేశ్.. ఆకాశానికి పెట్రోల్ ధరలు.. బంకుల వద్ద జనం బారులు..
Bangladesh Fuel Crisis: ఇంధన సంక్షోభం సుడిగుండంలో ఇప్పుడు బంగ్లాదేశ్ చిక్కుకుంది. గతంలో ద్వీపదేశం శ్రీలంకలో చూసిన పరిస్థితులే ప్రస్తుతం కనిపిస్తున్నాయి. ఎందుకంటే చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇంధన ధరలను ఒక్కసారిగా 52 శాతానికి పెంచింది. ఇది ఆ దేశ చరిత్రలోనే అత్యధికమని తెలుస్తోంది.
|
స్వాతంత్ర్యం తర్వాత..
ప్రభుత్వం ఇంధన ధరలను దాదాపు 52% పెంచిన తర్వాత బంగ్లాదేశ్లో నిరసనలు చెలరేగాయి. 1971లో బంగ్లాదేశ్ కు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇది అత్యధిక స్థాయి అని ఫ్రీ ప్రెస్ జర్నల్ తన కథనంలో తెలిపింది. బంగ్లాదేశ్ పెట్రోలియం కార్పొరేషన్ (BPC) ఒక ప్రకటనలో తక్కువ ధరలకు ఇంధనాన్ని విక్రయించడం ద్వారా ఫిబ్రవరి నుంచి జూలై మధ్య భారీగా నష్టపోయినట్లు లెక్కలు చెబుతున్నాయి.
కొత్త రేట్ల ప్రకటనతో..
బంగ్లాదేశ్ ప్రభుత్వం కొత్త రేట్లను ప్రకటించంటంతో అనేక మంది వాహనదారులు పెట్రోల్ బంకులకు క్యూ కట్టారు. తన వాననాల్లో ఇంధనాన్ని ట్యాంక్ ఫుల్ చేయింకునేందుకు తహతహలాడుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న వీడియోలలో, ప్రభుత్వం కొత్త ధరలను ప్రకటించినప్పుడు శుక్రవారం రాత్రి వేలాది మంది గ్యాస్ స్టేషన్ల చుట్టూ తమ ట్యాంకులను నింపడానికి తహతహలాడడం కనిపించింది.
మూతపడిన పెట్రోల్ బంకులు..
ఇంతలో ఢాకాలోని మహ్మద్పూర్, అగర్గావ్, మాలీబాగ్ తో పాటు మరిన్ని ప్రాంతాల్లోని అనేక పెట్రోల్ బంకులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశాయి. పెట్రోలు ధర లీటరుకు 51.7% పెరిగి 135 టాకాలకు చేరుకుంది. అదే సమయంలో కిరోసిన్, డీజిల్ ధర శనివారం నుంచి 42.5% పెరగటంపై ప్రజలు ఆందోళన చేస్తున్నారు.
వీధుల్లోకి జనం..
ప్రభుత్వ నిర్ణయంతో ఆగ్రహించిన ప్రదర్శనకారులు దేశవ్యాప్తంగా వీధుల్లోకి వస్తున్నారు. భారీగా ధరల పెంపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. రష్యా అంతర్జాతీయ మార్కెట్లకు చమురు, గ్యాస్ అతిపెద్ద ఎగుమతిదారు. అయితే ఉక్రెయిన్ పై దాడి మెుదలు పెట్టిన తరువాత అంతర్జాతీయ సమాజం ఆంక్షలతో సరఫరా దెబ్బతింది. ప్రస్తుతం ఇది ప్రపంచ దేశాల్లో ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తోంది.