రికవరీకి 3 సానుకూలతలు, ప్రభుత్వానికి సవాలే: దువ్వూరి సుబ్బారావు
భారత ఆర్థిక వ్యవస్థ రికవరీ ప్రధానంగా మూడు అంశాలపై ఆధారపడి ఉందని ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అన్నారు. కరోనా అనంతరం ఎన్పీఏలు భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. కాబట్టి బ్యాడ్ బ్యాంక్ ఐడియా అమలుపై వేగవంతంగా పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆర్థిక రికవరీ కోసం భారత్ చర్యలు చేపట్టాల్సి ఉందన్నారు. తుమ్మల కిషోర్ రచించిన మాంద్యం ముంగిట దేశం అనే పుస్తకానికి దువ్వూరి సుబ్బారావు ముందుమాట రాసారు.
కరోనాకు ముందే ఆర్థిక కష్టాలు
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, శక్తివంతమైన ఫెడరలిజం, భారీ వినియోగం ఈ మూడు భారత్కు సానుకూలతలు అని సుబ్బారావు అన్నారు. కరోనా, లాక్డౌన్ వల్ల చరిత్రలోనే కనివిని ఎరుగని తిరోగమనాన్ని భారత్ నమోదు చేసింది. ఈ అంశాన్ని సృశిస్తూ సుబ్బారావు ముందుమాట రాశారు. ఆర్థిక వ్యవస్థను తిరిగి వృద్ది పథంలోకి తీసుకురావడం, త్వరిత వృద్ధి ఫలాలు అల్పాదాయ గృహాలకు కూడా విస్తరించేలా సమ్మిళిత వృద్ధిని సాధించడం రాబోయే కాలంలో ప్రభుత్వం ముందున్న సవాళ్లు కరోనా కన్నా ముందే వాస్తవానికి ఆర్థిక వ్యవస్థల్లో కష్టాల్లో ఉందని తెలిపారు.
వీ షేప్ కనిపిస్తోంది కానీ
ఇప్పుడు వీ షేప్ రికవరీ కనిపిస్తోందని చెబుతున్నారని, కానీ ఉత్పాదకత స్థాయిలు కూడా అదే రీతిలో పెరిగాయని అర్ధం కాదన్నారు. 2021-22లో ఉత్పత్తి స్థాయిలు 2019-20 నాటి కన్నా తక్కువ స్థాయిలోనే ఉంటాయని అభిప్రాయపడ్డారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం పరిధి విస్తరణ తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్న వారికి జీవం కల్పించిందని, అలాగే మహిళలు, పెన్షన్దారులు రైతులకు ముందస్తు నగదు బదిలీ వంటి అంశాలు డిమాండ్ పుంజుకోవడానికి దోహదపడిందన్నారు. ఎఫ్సీఐ కొనుగోళ్లు పెంచడంతో రైతుల ఆదాయాలు పెరిగాయన్నారు. జీఎస్టీ పరిహారం విషయంలో ప్రభుత్వాల మధ్య విబేధాలు ఉన్నప్పటికీ అందుకు అతీతంగా కరోనా నిర్మూలనకు అందరూ చేసిన సంఘటిత కృషి ఫెడరలిజం అన్నారు.
కొద్ది నెలలు సవాల్
రానున్న కొన్ని నెలలు, సంవత్సరాలు ప్రభుత్వానికి సవాల్ అన్నారు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు వృద్ధి ప్రతిఫలం అందేలా చూడాలన్నారు. ఉపాధి హామీ పథకం వల్ల చాలామందికి జీవనోపాధి లభించిందన్నారు. 135 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశంలో తలసరి ఆదాయం కేవలం 2000 డాలర్లేనని, కాబట్టి ఆదాయం ఏమాత్రం పెరిగినా వినియోగంలోకి మారుతుందని చెప్పారు.