ఉద్యోగులకు యాక్సిస్ బ్యాంకు గుడ్న్యూస్, 12% వరకు వేతనాల పెంపు
భారత మూడో అతిపెద్ద ప్రయివేటు యాక్సిస్ బ్యాంకు తమ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఓ వైపు కరోనా వైరస్ నేపథ్యంలో వివిధ రంగాలు, కంపెనీలు ఈసారి వేతనాల పెంపును నిలిపివేశాయి. కానీ కొన్ని సంస్థలు వేతనాలను పెంచుతున్నాయి. తాజాగా యాక్సిస్ బ్యాంకు ఉద్యోగుల వేతనాలు పెంచుతోంది. ఇదివరకు ఐసీఐసీఐ బ్యాంకు ఉద్యోగులకు శాలరీస్ పెంచింది. సమాచారం మేరకు యాక్సిస్ బ్యాంకు ఉద్యోగుల వేతనాలను 4 శాతం నుండి 12 శాతం మేర పెంచుతోంది. అక్టోబర్ 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుంది.
భారత బ్యాంకుల నష్టాలు తగ్గించాలంటే అది కీలకం: ఫిచ్, ప్రభుత్వ హామీపై..
పనితీరు ఆధారంగానే...
పనితీరు ఆధారంగా యాక్సిస్ బ్యాంకు తమ ఉద్యోగుల వేతనాలను నాలుగు శాతం నుండి పన్నెండు శాతం వరకు పెంచుతోంది. దేశంలో ముంబై కేంద్రంగా పని చేస్తోన్న ఈ బ్యాంకుకు 76,000 మంది ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల తమ సిబ్బందికి బోనస్ చెల్లించింది. అసెట్స్ పరంగా దేశంలో హెచ్డీఎఫ్సీ అతిపెద్ద బ్యాంకు. ఏప్రిల్లో వేతనాలు పెంచడంతో పాటు బోనస్ ఇచ్చింది. రెండో అతిపెద్ద ప్రయివేటు బ్యాంకు ఐసీఐసీఐ జూలై నుండితమ లక్షమంది ఉద్యోగుల్లో 80 శాతం మందికి వేతనాలు పెంచింది. బోనస్ ఇచ్చింది.
క్లిష్ట పరిస్థితుల్లో వేతనాల పెంపు
మహమ్మారి నేపథ్యంలో దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంస్థలు ఇటీవలి వరకు ఉద్యోగాల కోత, వేతనాల కోత చేపట్టాయి. కానీ ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకు వంటివి వేతనాలు పెంచడం గమనార్హం. ప్రస్తుత పరిస్థితుల్లో బ్యాంకులు ఖర్చులను తగ్గించాలని నిర్ణయించాయి. భారత నాలుగో అతిపెద్ద బ్యాంకు కొటక్ మహీంద్ర బ్యాంకు రూ.25 లక్షల వార్షిక వేతనం కలిగిన ఎగ్జిక్యూటివ్స్కు 10 శాతం వేతన కోత విధించగా, సీనియర్ మేనేజ్మెంట్ స్ధానాల్లో ఉన్న వారికి వేతనాల్లో 15 శాతం కోత విధించింది.
900 కోట్ల డాలర్లు సమీకరణ
కరోనాతో ఆర్థిక వ్యవస్థ సంక్షోభంలో కూరుకుపోవడంతో భవిష్యత్తులో తమ వ్యాపారాలు ప్రభావితం కాకుండా యాక్సిస్ బ్యాంక్, కొటాక్ మహీంద్రా బ్యాంకు, ఐసీఐసీ బ్యాంకులు ఈక్విటీ మార్కెట్ల ద్వారా 900 కోట్లడాలర్లు సమీకరించాయి. బ్యాడ్ లోన్స్ పెరిగితే ఇవి ఉపయోగపడనున్నాయి. ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ జూన్ మాసంలో యాక్సిస్ బ్యాంకు రేటింగ్ను ఇన్వెస్ట్మెంట్ గ్రేడ్ కంటే తగ్గించింది.