2009 తర్వాత.. ఈసారి వేతన పెంపు ఎంత ఉందంటే: 2021లో శాలరీ పెంచే కంపెనీలు 87%
భారత్లో ఈ సంవత్సరం కంపెనీల్లో సగటు వేతన పెంపు 6.1 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలో సగటు వేతన పెంపు ఇంత తక్కువగా ఉండటం ఇదే తొలిసారి. గతేడాది మందగమనం, ఈసారి కరోనా కారణంగా సగటు వేతన పెంపు తగ్గింది. 2021లోను సగటు వేతన పెంపు 7.3 శాతంగా ఉండవచ్చునని అంచనా. ఈ మేరకు గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ కంపెనీ ఆయోన్(Aon plc) సర్వేలో వెల్లడైంది. కరోనా కారణంగా ప్రపంచంతో పాటు భారత్ పైన తీవ్రంగా దెబ్బపడింది. కరోన నేపథ్యంలో 2020 సంవత్సరంలో 71 శాతం కంపెనీలు వేతన పెంపును అమల చేశాయ. వచ్చే ఏడాది 87 శాతంగా ఉంటుందని అంచనా.
వినియోగదారులకు ఎల్పీజీ గ్యాస్ ఊరట, కమర్షియల్ సిలిండర్ ధర పెంపు
వేతనాలు ఎంత పెంచాయంటే
సర్వే ప్రకారం 2020లో సగటు వేతన పెంపు 6.1 శాతంగా నమోదయింది. 2009లో 6.3 శాతంగా ఉంది. తాజా శాలరీ ట్రెండ్స్ కూడా2021లో 7.3 శాతంగా ఉంటుందని ఈ సర్వేలో తేలింది. సెప్టెంబర్-అక్టోబర్ మధ్య 20 రంగాలకు చెందిన 1,050 కంపెనీలు ఈ సర్వేలో పాల్గొన్నాయి. సర్వేలో పాల్గొన్న కంపెనీలలో 87 శాతం తాము వచ్చే ఏడాది వేతన పెంపు అమలు చేస్తామని తెలిపాయి. 61 శాతం సంస్థలు వచ్చే ఏడాది 5 శాతం నుండి 10 శాతం వేతన పెంపు ఉంటుందని తెలిపాయి. 2020లో 71 శాతం కంపెనీలు వేతన పెంపును అమలు చేయగా, ఇందులో కేవలం 45 శాతం మాత్రమే 5 శాతం నుండి 10 శాతం పెంచాయి.
ఇంక్రిమెంట్స్..
ప్రస్తుత సంవత్సరంతో పోలిస్తే 2021లో మూడింట రెండొంతుల కంపెనీలు ఇంక్రిమెంట్స్ ఈసారి కంటే ఎక్కువగా ఇవ్వాలని భావిస్తున్నాయి. జూన్, సెప్టెంబర్ త్రైమాసికాల్లో వ్యాపారులు, హెచ్ఆర్ లీడర్స్ కఠిన నిర్ణయాలు తీసుకున్నారని, ప్రస్తుతం డిమాండ్ పుంజుకుంటోందని తెలిపింది. 2020లో అతి తక్కువ వేతన పెంపును అమలు చేసిన వాటిలో హాస్పిటాలిటీ, రిటైల్, రియల్ ఎస్టేట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇండస్ట్రీస్ ఉన్నాయి.
ఫ్రెషర్స్కు శుభవార్త
ఫ్రెషర్లకు చాలా కంపెనీలు గుడ్ న్యూస్ చెప్పాయి. జులై నుంచి వీరికి డిమాండ్ పెరగనుంది. ఎడ్యుటెక్, ఈ-లెర్నింగ్, హెల్త్ కేర్, హెచ్ఆర్ టెక్, ఫిన్ టెక్, ఎఫ్ఎంసీజీ, మాన్యుఫ్యాక్చరింగ్, టెలికం, సెమీకండక్టర్ రంగాల్లో నియామకాలు పుంజుకుంటాయని, కానీ ఏప్రిల్ వరకు ఇదే ధోరణి కొనసాగవచ్చునని నిపుణులు చెబుతున్నారు. కరోనాకు ముందు ప్రతి నెలా సగటున ఐదు లక్షలమందికి ఉద్యోగాలు లభించేవని, ఈ మార్చి 25 - ఏప్రిల్ 30 మధ్య ఇది 1.5 లక్షలకు పడిపోయిందని టీమ్ లీజ్ డాట్ కామ్, ఫ్రెషర్స్ వరల్డ్ డాట్ కామ్ వైస్ ప్రెసిడెంట్, బిజినెస్ హెడ్ తెలిపారు. ప్రస్తుతం ఇది 3.5 లక్షలుగా ఉన్నట్లు తెలిపారు.