ప్రతిభావంతులను కాపాడుకోవడానికి ఇన్ఫోసిస్ కొత్త నిబంధన!
సాఫ్టువేర్, బీపీవో రంగంలో ఆట్రిషన్ రేటు భారీగా పెరుగుతోంది. టీసీఎస్, ఇన్ఫోసిస్లు ఆట్రిషన్ ప్రభావాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. ఆదాయంలో దేశంలోని మొదటి రెండు ఐటీ కంపెనీలైన ఈ దిగ్గజాలు ప్రతిభావంతులను నిలుపుకునే ప్రయత్నంలో అసాధారణమైన వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. బెంగళూరు ప్రధాన కార్యాలయం కలిగిన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులను కాపాడుకునే ప్రయత్నంలో కొత్త నిబంధనను అమలు చేస్తోంది.
ఆ కంపెనీల్లో చేరవద్దు
దేశంలోని టాప్ 5 ఐటీ సంస్థల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఇప్పుడు అది కొత్త నిబంధనను తీసుకు వచ్చింది. తమ సంస్థలో పని చేసి, రాజీనామా చేసిన ఉద్యోగులు తర్వాత ఇతర ఐటీ సంస్థల్లో పని చేయకుండా నిషేధం విధించింది.
ఒకవేళ వారు పని చేసే క్లయింట్స్, ఇన్ఫోసిస్ క్లయింట్స్ అయితే ఒక ఆరు నెలల పాటు నేమ్డ్ కాంపిటీటర్లతో మాజీ ఉద్యోగులు పని చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యేకించి దేశంలోని టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్, ఐబీఎం, యాక్సెంచర్ సంస్థల్లో పని చేయవద్దని వెల్లడించింది.
ఉద్యోగుల్లో ఆందోళన
ఇప్పటికే రాజీనామా చేయాలనుకున్న వారు, రాజీనామాకు ప్లాన్ చేసుకున్న ఇన్ఫోసిస్ ఉద్యోగులు తాజా సంస్థ నిషేధంతో ఆందోళన చెందుతున్నారు. ఇన్ఫోసిస్కు రాజీనామా చేసిన తర్వాత ఇతర సంస్థల్లో చేరకుండా మేనేజ్మెంట్ విధించిన నిషేధం అడ్డంకిగా మారుతుందని ఆందోళన చెందుతున్నారు. దీనికి వ్యతిరేకంగా నాస్కెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనెట్(NITES) పిటిషన్ దాఖలు చేసింది. ఇన్ఫోసిస్ తాజా నిర్ణయం అనుచితమని తెలిపింది.
అందుకే ఇలా
మార్చి త్రైమాసికంలో టీసీఎస్ వార్షిక ఆట్రిషన్ రేటు 17.4 శాతంగా నివేదించింది. ఇది గత ఏడాది ఇదే త్రైమాసికంలో 7.2 శాతంగా ఉంది. ఇన్ఫోసిస్ జనవరి- మార్చి కాలంలో వార్షిక స్వచ్చంధ ఆట్రిషన్ రేటు 27.7 శాతంగా నివేదించింది. జనవరి - మార్చి 2021లో ఇది 10.9 శాతంగా ఉంది.
ఇతర దిగ్గజ ఐటీ కంపెనీలు నాలుగో త్రైమాసికం, పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఫలితాలు ప్రకటించాల్సి ఉంది. ఐటీ మార్కెట్లో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, అందుకే ఆట్రిషన్ రేటు అధికంగా ఉంది. దీంతో తమ కంపెనీకి చెందిన ప్రతిభ కలిగిన ఉద్యోగులను కాపాడుకునేందుకు ఐటీ కంపెనీలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఇన్ఫోసిస్ తాజా నిబంధనను అమలు చేస్తోంది.