కిలో చికెన్ రూ 500... ఎక్కడో తెలుసా?
ఎవరో ఎదో చేస్తే... ఇంకెవరికో శాపం అంటారు. ఇది ఇప్పుడు దేశంలో నెలకొన్న పరిస్థితులకు తార్కాణంగా నిలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పౌరసత్వ సవరణ బిల్లు (క్యాబ్) ను పార్లమెంట్ లో ఆమోదిస్తే... దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కూరగాయలు, చికెన్, ఫిష్ వంటి నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్, మటన్ లేనిదే ముద్ద దిగని మన దేశంలో ఇప్పుడు చికెన్ కిలో రూ 500 అయింది. అయితే ఈ ధర దేశమంతా కాదు కానీ... పౌరసత్వ సవరణ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న అసోం రాష్ట్రంలో ఇలా చికెన్ సహా అనేక నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి.
అసలే ఉల్లిపాయ ధరలు పెరిగి దేశమంతా దాని పేరు చెబితేనే కళ్ల నీళ్లు పెట్టుకుంటున్న సందర్భంలో ఇప్పుడు తాజాగా మరో కొత్త విపరిణామం మొదలైంది. అయితే, ఇది అసోం తో మాత్రమే ఆగేలా లేదు. దేశంలో ఇప్పటికే దాదాపు 5 రాష్ట్రాలు ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఒక వేళ అక్కడ కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంటే... దాని ప్రభావం పూర్తిగా దేశం పైనా పడుతుంది. ఇప్పటికే ఒక్కో మెట్టూ ఎక్కుతున్న ద్రవ్యోల్బణం రంకెలేయటం ఖాయం.
నేటి నుంచి FASTag,పెద్ద రిలీఫ్:అదే లైన్లో వెళ్తే అధిక ఛార్జ్
చికెన్ రూ 500, పాలకూర రూ 60...
పౌరసత్వ సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టిన నాటినుంచి అసోం రాష్ట్రంలో నిరసనలు మొదలయ్యి. అవి లోక సభలో ఈ బిల్లును ఆమోదించిన తర్వాత మరింత అధికమయ్యి. అక్క కర్ఫ్యూ విధించే స్థాయికి చేరుకున్నాయి. దీంతో ఒక్క సరిగా జన జీవనం స్తంభించి పోయింది. రవాణా సదుపాయాలు లేక ఆహార ఉత్పత్తులు, నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. శనివారం ఒక గంట పాటు కర్ఫ్యూ సడలించినప్పుడు .... మార్కెట్లో కిలో చికెన్ ధర రూ 500 పలికింది. రాహు రకం చేపలు కిలో రూ 420 కి చేరుకోగా... సాధారణ సమయంలో రూ 10 ఉండే పాలకూర ధర ఏకంగా రూ 60 కి పెరిగిపోయింది. ఉల్లిగడ్డ కిలో రూ 250, ఆలుగడ్డ కిలో రూ 60 చొప్పున లభించాయి. ఈ విషయాలను ది టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక కథనంలో వెల్లడించింది.
ఏటీఎం లో నో కాష్...
నిరసనల నేపథ్యంలో మొత్తం అక్కడ జన జీవనం అస్తవ్యస్తం ఐంది. ఏటీఎం లు నో కాష్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి. చివరకు పాయింట్ ఆఫ్ సేల్ యంత్రాలు, స్వైపింగ్ మెషిన్ లు కూడా పనిచేయటం లేదట. చాలా వరకు పెట్రోలు బంకుల్లో ఇంధనం లభించటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా తన మొబైల్ బ్యాంకు వ్యాన్ తో కొంత వరకు ప్రజల అవసరాలు తీర్చినా అది కొంత మందికి మాత్రమే పరిమితమైంది. అసోం లోని గువహతి నగరం పరిస్థితి చాలా దయనీయంగా మారిపోయింది. ఆ రాష్ట్రాల్లో అత్యంత అధిక జనాభా కలిగిన అతి పెద్ద నగరం కావటం తో దానికి తగినంత ఏర్పాట్లు చేయటంలో ప్రభుత్వ యంత్రంగా విఫలమైంది.
ఇతర ప్రాంతాలపైనే ఆధారం...
గువహతి నగరానికి కూరగాయలు సహా అన్ని రకాల ఆహార ఉత్పత్తులు ఇతర ప్రాంతాల నుంచే సరఫరా అవుతాయి. ముఖ్యంగా బెంగాల్ బోర్డర్ నుంచి అధిక మొత్తం లో సరుకుల రవాణా జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఆ ప్రధాన రహదారిపై సరుకులు, ఆహార పదార్థాలతో రవాణాకు సిద్ధంగా ఉన్న ట్రక్కులు రోడ్డు పైనే నిలిచిపోయాయి. గత ఆదివారం నుంచి బెంగాల్ - అసోం బోర్డర్ పై వందలాది ట్రక్కులు నిలిచిపోయాయి. దీంతో సప్లై చైన్ పూర్తిగా దెబ్బతింది. ప్రభుత్వం వెంటనే తగిన చర్యలు తీసుకోవాలి అని అసో ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ జనరల్ శిశిర్ దేవ్ కలిత కోరారు. సరఫరా లేనప్పుడు అధిక ధరలే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సోమవారం కల్లా మార్కెట్లు సాధారణ స్థితికి చేరుకుంటాయని భావిస్తున్నట్లు చెప్పారు. ఏది ఏమైనా ఢిల్లీ లో తీసుకొనే నిర్ణయాలు గల్లీలో జనాలకు నరకం చూపిస్తున్నాయి. ఎప్పుడు ఈ పరిస్థితిలో మార్పు వస్తుందో చూడాలి.