కరోనా మొదటి దెబ్బ కార్పోరేట్ రంగంపైనే, చైనా తర్వాత భారత్: షాకింగ్ రిపోర్ట్
కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచ, ఆసియా, భారత ఆర్థిక వ్యవస్థలపై భారీగా ప్రభావం పడుతుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ భారత్, ఏషియా పసిఫిక్ బ్యాంకులపై విడుదల చేసిన ఎన్పీఏల నివేదిక మరింత కలవరపెడుతోంది. ఏషియా పసిఫిక్ బ్యాంక్స్, కోవిడ్ 19 క్రైసిస్ పేరుతో నివేదికను విడుదల చేసింది. కరోనా మహమ్మారి, చమురు ధరల షాక్, మార్కెట్ అస్థిరత కారణంగా 2020లో ఆసియా పసిఫిక్ బ్యాంకులకు 300 బిలియన్ డాలర్ల అదనపు రుణ వ్యయ భారం, నిరర్థక ఆస్తులు 600 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశముందని తెలిపింది.
Covid 19: ఇండియాలో లాక్డౌన్ తర్వాత అసలు దెబ్బ, భారీగా ఉద్యోగాల కోత!
చైనాపై అధిక ప్రభావం
2020 ఏడాదిలో కొన్ని బ్యాంకులకు నెగిటివ్ రేటింగ్ వచ్చే అవకాసముందని ఎస్ అండ్ పీ తెలిపింది. కరోనా కారణంగా ఈ ప్రాంత బ్యాంకులు 100 బిలియన్ డాలర్ల అదనపు రుణ వ్యయాన్ని నమోదు చేయవచ్చునని తెలిపింది. ఇందులో అధిక ప్రభావం చైనాపై ఉంటుందని ఈ రేటింగ్ ఏజెన్సీ వెల్లడించింది. ఇక్కడ ఎన్పీఏ నిష్పత్తి 2.0 శాతం పెరగవచ్చునని, క్రెడిట్ లాస్ 100 బేసిస్ పాయింట్లు ఉండవచ్చునని (డాలర్ టర్మ్స్) తెలిపింది.
భారత్కూ పెను ప్రమాదం
భారత్ విషయంలో కూడా నివేదికలో తీవ్ర ఆందోళనకర అంశాలే ఉన్నాయి. ఇండియా ఎన్పీఏ రేషియో 1.9 శాతం ఉండవచ్చునని, రుణ వ్యయ నిష్పత్తి 130 బేసిస్ పాయింట్లు పెరగవచ్చునని అంచనా వేసింది.కరోనా వ్యాప్తి మరింత వేగంగా, విస్తృతంగా సుదీర్ఘకాలం కొనసాగే అవకాశముందని పేర్కొంది. దీంతో ఆర్థిక వ్యవస్థపై అంచనాలకు మించి ప్రభావం ఉంటుందని పేర్కొంది.
కరోనా వల్ల తొలి దెబ్బ ఈ రంగానికే
పెట్టుబడిదారుల కష్టాలు మరింత పెరుగుతాయని ఎస్ అండ్ పీ తన నివేదికలో వెల్లడించింది. ఇది బ్యాంకుల రుణ సామర్థ్యాన్ని దెబ్బతీస్తుందని తెలిపింది. కరోనా వైరస్ తొలి దశ ప్రభావం బ్యాంకులపై అంతగా ఉండదని, తొలుత కార్పోరేట్ రంగం తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుందని తెలిపింది. ఈ ప్రభావం బ్యాంకులపై పడుతుందని తెలిపింది.
ఎస్ అండ్ పీ హెచ్చరిక
ఆసియా ప్రాంతంలో 20 బ్యాంకింగ్ రంగాల రేటింగ్ సామర్థ్యం కరోనా ప్రభావం తీవ్రస్థాయిలో ఉంటుందని హెచ్చరించింది. ఆయా ప్రభుత్వాలు, నియంత్రణ సంస్థలు తీసుకునే చర్యలు కీలకంగా మారుతాయని తెలిపింది. ఇప్పటికే కొన్ని దేసాలు దిద్దుబాటు చర్యలు చేపట్టాయని, మరికొన్ని చర్యలకు సిద్ధమయ్యాయని పేర్కొంది. కానీ చాలా దేశాలు ఇంకా ఆ దిశగా ఆలోచించలేదని తెలిపింది.