జగన్ దావోస్లో పర్యటిస్తోన్న వేళ..ఏపీలో స్టీల్ దిగ్గజం భారీ పెట్టుబడి
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం పెట్టుబడుల వేటలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన స్విట్జర్లాండ్లోని దావోస్ పర్యటిస్తోన్నారు. అక్కడ ఏర్పాటైన ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొంటున్నారు. ఈ అంతర్జాతీయ వేదిక ద్వారా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను ప్రపంచ వాణిజ్య, పారిశ్రామికవేత్తల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తోన్నారు. ఇప్పటికే 60 వేల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు సంబంధించిన పరస్పర అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నారాయన.
|
రాష్ట్రానికి భారీ పెట్టుబడి..
ఈ పరిణామాల మధ్య మరో భారీ పెట్టుబడి రాష్ట్రంలోకి ప్రవహించింది. స్టీల్ జెయింట్ ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ ఈ పెట్టుబడులను ప్రకటించాయి. ఈ రెండు కంపెనీలు సంయుక్తంగా 1,000 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనున్నాయి. 1,000 కోట్ల రూపాయలతో విశాఖపట్నంలోని పెల్లెట్ ప్లాంట్ (Vizag Pellet Plant)ను విస్తరించనున్నట్లు తెలిపాయి. ఈ మేరకు కొద్దిసేపటి కిందటే ఓ ప్రకటన విడుదల చేశాయి.
|
వైఎస్ జగన్తో ఆదిత్య మిట్టల్ భేటీ..
దావోస్లో పర్యటిస్తోన్న వైఎస్ జగన్తో ఆర్సెలార్ మిట్టల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆదిత్య మిట్టల్ సమావేశం అయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అంశాలు వారిద్దరి మధ్య ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. భవిష్యత్తులో విశాఖపట్నాన్ని పారిశ్రామిక హబ్గా, ప్రపంచ స్థాయిలో అత్యుత్తమ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దబోతున్నామని, దీనికోసం ఇదివరకే చర్యలు చేపట్టామని వైఎస్ జగన్ వివరించారు.
|
విశాఖ పెల్లెట్ ప్లాంట్లో..
ఆయనతో భేటీ ముగిసిన కొద్దిసేపటికే- 1,000 కోట్ల రూపాయల పెట్టుబడులను ప్రకటించింది ఆర్సెలార్ మిట్టల్ కంపెనీ. వైజాగ్ పెల్లెట్ ప్లాంట్ వార్షిక ఉత్పాదక సామర్థ్యం ఎనిమిది మెట్రిక్ టన్నులు. దీన్ని 11 మెట్రిక్ టన్నులకు పెంచాలని నిర్ణయించినట్లు ఆర్సెలార్ మిట్టల్ అండ్ నిప్పాన్ స్టీల్స్ తెలిపాయి. 2023 నుంచి ఈ ప్లాంట్ విస్తరణ పనులను మొదలు పెడతామని పేర్కొన్నాయి. ఈలోగా పర్యావరణ అనుమతులను తీసుకోవడానికి అవసరమైన ప్రక్రియను మొదలుపెడతామని వివరించాయి.
|
రూ.4,600 కోట్లతో
ఏపీలో 975 మెగావాట్ల ఉత్పాదక సామర్థ్యంతో సంప్రదాయేతర ఇంధన ప్రాజెక్ట్ను నెలకొల్పబోతున్నట్లు ఇటీవలే వెల్లడించింది ఆర్సెలార్ మిట్టల్. దీనికోసం 4,600 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టనుంది. సౌర, పవన విద్యుత్ కేంద్రాలను నెలకొల్పబోతోంది. ఇందులో ఉత్పత్తి అయ్యే విద్యుత్లో 20 శాతాన్ని తన సొంత అవసరాల కోసం వినియోగించుకుంటుంది. హజీరాలోని స్టీల్ ప్లాంట్ కోసం కేటాయిస్తుంది.
|
రెన్యూవబుల్ ఎనర్జీపైనా
సంప్రదాయేతర ఇంధన వనరుల మీద ఆధారపడటం వల్ల ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను తగ్గించినట్టవుతుందని ఆర్సెలార్ మిట్టల్ తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం పరస్పర అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది.