రిలయన్స్ ఏజీఎంలో సౌదీ ఆరామ్కో ప్రతినిధి? కీలక ప్రకటన చేసే అవకాశం
రిలయన్స్ యాన్యువల్ షేర్ హోల్డర్స్ మీటింగ్ (AGM)పై అందరి దృష్టి ఉంది. ఈ నెల 24వ తేదీన AGM జరగనుంది. ఈ సమావేశంలో పలు అంశాలపై రిలయన్స్ కంపెనీ ప్రకటనలు చేయనున్నట్లు తెలుస్తోంది. టెలికం రంగంలో రిలయన్స్ జియో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చింది. అలాగే, ఆయిల్ టు కెమికల్స్ రంగంలో మరింత ముందుకు వెళ్లేందుకు వివిధ అంతర్జాతీయ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటోంది. ఈ నేపథ్యంలో జరగనున్న AGMకు ప్రాధాన్యత ఏర్పడింది.
4G రాకతో రిలయన్స్ ఎన్నో మార్పులు తీసుకు వచ్చింది. గ్రామాలకు కూడా 4G టెక్నాలజీ అందించడంలో ముఖ్యపాత్ర పోషించింది. వచ్చే భేటీలో అతి తక్కువ ధర 4G ఫోన్ను రిలయన్స్ లాంచ్ చేసే అవకాశముంది. రిలయన్స్ AGM భేటీలో భారీ ఒప్పందాలు జరిగే అవకాశం ఉందని వ్యాపార నిపుణులు భావిస్తున్నారు.
దాదాపు 15 బిలియన్ డాలర్లతో రిలయన్స్- సౌదీ ఆరాంకోకు భారీ ఒప్పందం జరగనున్నట్లు తెలుస్తోంది. రిలయన్స్ AGMలో ఆరాంకో చైర్మన్ యాసిర్ అల్-రుమయ్యన్ ఈ సమావేశంలో పాల్గొననున్నారని తెలుస్తోంది. రిలయన్స్ డైరెక్టర్ల బోర్డులో స్థానంపై ప్రకటించే అవకాశముందని అంటున్నారు. అయితే దీనిపై రిలయన్స్ లేదా సౌదీ ఆరామ్కో స్పందించాల్సి ఉంది.