ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం కానుకలు, ఆర్టీసీ ఆదాయంలో ప్రభుత్వానికి ఇచ్చేది ఎంత?
అమరావతి: ఏపీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. విలీనం సమయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆర్టీసీ సిబ్బందిని ప్రభుత్వ ఉద్యోగులుగా మార్చేందుకు ఏపీ కేబినెట్ ఈ నెల 11వ తేదీన ఆమోదం తెలిపింది. ఈ విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని సోమవారం లేదా మంగళవారం అసెంబ్లీలో ప్రవేశ పెడతారు. దీనికి ముందే ఆర్టీసీ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం వరాలు ప్రకటించింది.
ఏపీలో ఇక బియ్యం కార్డు, లిస్ట్లో మీ పేరు లేకుంటే ఆగాల్సిందే
జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు
ఆర్టీసీ కార్మికులు చాలాకాలంగా వేచి చూస్తున్న 40 శాతం వేతన సవరణ బకాయిలు చెల్లించేందుకు ఉత్తర్వులు ఇదివరకు జారీ చేసింది. తాజాగా, పెండింగులోని రూ.210 కోట్ల బకాయిలను విడుదల చేసింది. కారుణ్య నియామకాలకు ఆర్టీసీ యాజమాన్యం పచ్చజెండా ఊపింది. దీంతో గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్న వారికి ఊరట లభించినట్లయింది. అలాగే కండక్టర్ల అభ్యర్థుల ఎత్తును 153 సెంటీ మీటర్ల నుంచి 145 సెంటీ మీటర్లకు తగ్గిస్తూ నిబంధనలు సవరించారు.
వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత ఇస్తారు?
ఇదిలా ఉండగా, విలీన ప్రక్రియకు సంబంధించి కొత్త చట్టాన్ని తీసుకు వస్తున్న నేపథ్యంలో ఏపీఎస్ఆర్టీసీ ఆదాయంలో ప్రభుత్వానికి వచ్చే వాటాపై ఆర్థిక శాఖ అప్పుడే దృష్టి సారించినట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇటీవల బస్సు ఛార్జీల ధరలు కూడా పెంచారు. ఆర్టీసీ నష్టాల నుంచి గట్టెక్కేందుకు సమయం తీసుకుంటుంది. సభలో విలీనానికి ఆమోదం లభించిన అనంతరం కార్మికుల జీతభత్యాలు ప్రభుత్వం చెల్లిస్తుంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో ప్రభుత్వానికి ఎంత ఇస్తారనే అంశంపై దృష్టి సారించింది.
ఆ నిధులకే రెండు మూడేళ్లు
ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమయ్యాక జీతాల చెల్లింపును ప్రభుత్వం చేస్తుంది. దీంతో ఆర్టీసీపై రూ.3,300 కోట్ల మేర భారం తగ్గనుందని ఆర్థిక శాఖ భావిస్తోంది. అందుకే ఆదాయంలో కొంత తమకు ఇవ్వాలని కోరుతోంది. గత నాలుగేళ్లలో డీజిల్ ధరల పెరుగుదల, ఇతర ఖర్చుల వల్ల రూ.6,735 కోట్ల నష్టంతో పాటు బ్యాంకు రుణాలు రూ.2,995 కోట్లు, కార్మికుల ఈపీఎఫ్ ట్రస్ట్ ఫండ్, కో-ఆపరేటివ్ క్రెడిట్ సొసైటీకి జమ కావాల్సిన మొత్తం, కార్మికులకు చెల్లించే ఇతర బకాయిలు కలిపి రూ.3,740 కోట్ల వరకు చెల్లించాలి. వీటిని చెల్లించిన తరవాత మిగిలిన దానిపై ప్రభుత్వానికి ఇచ్చే ఆలోచనలో ఏపీఎస్ఆర్టీసీ ఉంది. దీనికి రెండు మూడేళ్ల సమయం పట్టవచ్చునని అంచనా.
30 శాతం ఆదాయం ఇచ్చే ఛాన్స్
ఆర్టీసీకి వచ్చే ఆదాయంలో 30 శాతం ఇచ్చే అంశంపై ఆర్టీసీ యాజమాన్యం ఆలోచన చేస్తోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఆర్థిక శాఖ మరింత ఎక్కువ కోరుతోందట. ఛార్జీలు, పార్సిల్ సర్వీసులు, స్థలాలు, దుకాణాలకు వచ్చే అద్దెలు వంటివి కలిపి ఏడాదికి రూ.6 వేల కోట్లకు పైగా రాబడి ఉండగా, కార్మికుల వేతనాలు, డీజిల్ ఖర్చు, బస్సుల నిర్వహణకు రూ.7200 అవుతోంది. అంటే ఏడాదికిరూ.1200 కోట్లు నష్టం వస్తోంది.